సుసంపన్న భారతదేశ నాగరికతకు వన్నె తెచ్చిన చేనేత పరిశ్రమ దేశ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యపాత్ర పోషిస్తున్నది. దేశంలో నేటికీ సుమారు 20 లక్షల మగ్గాలపై కోటిమంది జీవనోపాధి పొందుతున్నారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా జరిగిన స్వదేశీ ఉద్యమం ఈ రంగానికి కొత్త ఊపునిచ్చింది. ఈ వృత్తిలో మహిళలు, పిల్లలతో సహా కుటుంబ సభ్యులందరి భాగస్వామ్యం ఉంటుంది. మన రాష్ర్టంలో 25 వేల చేనేత మగ్గాలు, మరో 80 వేల మరమగ్గాలపై దాదాపు 2 లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారు. రాష్ర్టంలో అనేక గ్రామాలు చేనేత, పవర్లూమ్ కేంద్రాలుగా పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నాయి.
Handloom | దేశంలోని ప్రభుత్వాల నిర్లక్ష్యం, చేనేత వ్యతిరేక విధానాల వల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఫలితంగా నేడు చేనేత, పవర్లూమ్ కార్మికులు ఉపాధి కోల్పోయి వీధిన పడుతున్నారు. సంక్షోభంలో ఉన్న వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని ప్రభుత్వాలకు విన్నవిస్తున్నా పాలకులు స్పందించకపోవడంతో సంక్షోభం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇటీవల సిరిసిల్లలో పవర్లూమ్ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిని బట్టి చూస్తే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం మాత్రం ప్రభుత్వాలు చూపకపోవడం విచారకరం.
కార్మికుల ప్రయోజనాలను కాపాడి, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే ప్రధాన ఉద్దేశంతో చేనేత సహకార వ్యవస్థ ఏర్పడింది. రాష్ర్టంలో 458 సహకార సంఘాలు ఉన్నాయి. వీటికి మాతృ సంస్థ టెస్కో. వీటి సహకారంతో సంఘాలలోని సభ్యులు వస్త్రాలను ఉత్పత్తి చేసి తద్వారా ఉపాధి పొందుతున్నారు. ఉత్పత్తి అయిన వస్త్రాలను ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. అయితే అప్పులు తెచ్చి వస్త్రాలను ఉత్పత్తి చేసిన సహకార సంఘాలు ఆ అప్పులకు వడ్డీలు కట్టలేక సతమతమవుతున్నాయి. తద్వారా నష్టాల పాలవుతూ మూతపడుతున్నాయి. ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు, మాతృ సంస్థ అయిన టెస్కోకు ప్రజాస్వామ్యయుతంగా ప్రతి ఐదేండ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాలి. 2013లో ఎన్నికైన పాలకవర్గాల పదవీకాలం ఎప్పుడో ముగిసింది. అయినా నేటికీ ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాలను ఏర్పాటు చేయకపోవడంతో సహకార వ్యవస్థ నిర్విర్యమవుతున్నది.
బకాయిలు చెల్లించకపోవడంతో వడ్డీల భారం పెరుగుతున్నది. దీంతో సహకార, సహకారేతర రంగం సంక్షోభంలో కూరుకుపోయి పని కల్పించలేని స్థితికి దిగజారాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేనేత, పవర్లూమ్ కార్మికుల బోర్డులను, పథకాలను రద్దు చేసింది. జాతీయ చేనేత బోర్డు, జాతీయ టెక్స్టైల్ బోర్డు, మహాత్మాగాంధీ బునకర్ బీమా యోజన, ఐసీఐసీఐ లాంబార్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ పథకం, హౌస్ కమ్ వర్క్ షెడ్ తదితర పథకాలను రద్దు చేయడంతో పాటు జీఎస్టీని విధించి చేనేత రంగాన్ని, ఆ రంగంపై ఆధారపడిన కార్మికులను రోడ్డున పడేసింది.
గత ప్రభుత్వాల కంటే మెరుగైన పాలన, మెరుగైన జీవన ప్రమాణాలు ఉండే విధంగా పాలిస్తామని చెప్పిన కాంగ్రెస్ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. నేతన్నల ఉపాధి, సంక్షేమం దృష్ట్యా కొత్త పథకాలను ప్రకటించకపోగా ఉన్న పథకాలను కూడా అమలు చేయకుండా నిలిపివేసి ఇబ్బందులకు గురిచేస్తున్నది.
గత రెండు నెలలుగా చేనేత, పవర్లూమ్ కార్మికులు, సంఘాలు తమ సమస్యలను, స్థితిగతులను ప్రభుత్వాలకు అనేక సందర్భాల్లో విన్నవించినా, సిరిసిల్ల లాంటి ప్రాంతా ల్లో పోరాటాలు చేస్తున్నా, కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నా స్పందించకపోవడం శోచనీయం. పాలకుల నిర్లక్ష్య వైఖరి వల్ల నేడు రాష్ర్టంలోని చేనేత, పవర్లూమ్ మగ్గాలు మరణశయ్యపై వేలాడుతున్నాయి. కష్టాలు చుట్టుముట్టినంత మాత్రాన ఆత్మహత్యలే శరణ్యమను కోవడం సరికాదు. అదే సమస్యలకు పరిష్కారం కాదు. పోరాటాలు చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీద్దాం. సమస్యలను పరిష్కరించుకుందాం.
కూరపాటి రమేష్
94900 98048