ఈశాన్య రాష్ట్రమైన అస్సాం చరిత్రలో కీలక పరిణామం చోటుచేసుకున్నది. యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం (యూఎల్ఎఫ్ఏ-ఉల్ఫా), కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఉల్ఫా తీవ్రవాదులు ఆయుధాలను వదిలేసి జనజీవన స్రవంతిలో కలిసిపోయి ఈశాన్య భారతంలో శాంతిభద్రతల స్థాపనకు సహకరించాలి. ఈ ఒప్పందాన్ని అతిపెద్ద విజయంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పుకొన్నారు. చర్చలకు అనుకూలంగా ఉన్న అరబింద రాజ్ఖోవా వర్గం మాత్రమే దీనిపై సంతకం చేసిందన్న విషయాన్ని మరిచిపోకూడదు. పరేశ్ బారువా నేతృత్వంలోని ఉల్ఫా- ఇండిపెండెంట్ వర్గం ఇంకా ఉనికిలోనే ఉందన్న విషయాన్ని గుర్తెరగాలి. అయితే ఏదేమైనప్పటికీ ఈశాన్య భారత్లో శాంతి దిశగా ముందడుగు పడిందనే చెప్పాలి.
ఉల్ఫా తీవ్రవాదం అనేది ఒక్క అస్సాం రాష్ర్టానికి సంబంధించిన సమస్య కాదు. మొత్తం ఈశాన్య భారతంపై దీని ప్రభావం ఉన్నది. సార్వభౌమాధికార అస్సాం లక్ష్యంగా 1979లో ఏర్పాటైన ఉల్ఫా ఒకానొక సమయంలో ఈశాన్య భారత్తో పాటు ఆ చుట్టుపక్కల దేశాల్లోనూ కార్యకలాపాలను నిర్వహించింది. మయన్మార్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్థాన్లో శిబిరాలతో అప్పట్లో ఉల్ఫా ఓ వెలుగు వెలిగింది. అయితే శ్రీలంకలో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్టీటీఈ) పతనం, భూటాన్లోని శిబిరాలను తొలగించాలని ఆ దేశంపై ఒత్తిళ్లు, బంగ్లాదేశ్లో భారత్కు అనుకూలంగా వ్యవహరించే షేక్ హసీనా ప్రభుత్వం రాకతో ఉల్ఫాకు గడ్డు పరిస్థితులు ప్రారంభమయ్యాయి.
ఏండ్ల పాటు జరిగిన అణచివేత కారణంగా ఉల్ఫా క్రమంగా పట్టు కోల్పోయింది. దీంతో శాంతి చర్చల దిశగా అడుగులు వేయకతప్పలేదు. 1992లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావుతో ఆరుగురు ఉల్ఫా ప్రతినిధుల బృందం చర్చలను ప్రారంభించింది. అయితే వీటిని ఉల్ఫా జనరల్ కౌన్సిల్ తిరస్కరించడంతో అప్పట్లో జరిగిన చర్చలు అటకెక్కాయి. అనంతరం 2005, 2008, 2011లోనూ పలుమార్లు చర్చలు జరిగాయి. అయితే రాజ్ఖోవా నేతృత్వంలో 2012లో మొదలై.. 12 ఏండ్ల పాటు సాగిన సుదీర్ఘ చర్చల పర్వం ఓ కొలిక్కి రావడంతో తాజాగా శాంతి ఒప్పందం కుదిరింది. ఈ చర్చలను వ్యతిరేకించిన పరేశ్ బారువా ఉల్ఫా-(ఇండిపెండెంట్) పేరిట సొంత కుంపటి పెట్టుకున్న విషయం తెలిసిందే.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు- ఉల్ఫా మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించడం, శిబిరాల రద్దు, ఉల్ఫా తీవ్రవాదులకు నగదు చెల్లింపులు తదితర అంశాలున్నాయి. రాష్ట్ర అభివృద్ధికి స్పెషల్ ప్యాకేజ్, ఐఐఎం ఏర్పాటు, రైలు తయారీ కర్మాగారం, అంతర్జాతీయ కల్చరల్ సెంటర్, స్పోర్ట్స్ కాంప్లెక్సులు, రోడ్డు కనెక్టివిటీ తదితర ప్రాజెక్టులు చేపట్టాలని శాంతి ఒప్పందంలో ఉన్నది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఒప్పందాన్ని గొప్పగా అభివర్ణిస్తున్నప్పటికీ.. దీనిపై విమర్శలు వస్తున్నాయి. ఓవైపు ప్రతిపక్షాలు, మరోవైపు సోషల్మీడియా వేదికగా సామాన్యులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం దీన్ని తెరపైకి తీసుకొచ్చిందని ప్రతిపక్షాలు అంటున్నాయి. మణిపూర్ అల్లర్ల కారణంగా ఈశాన్యంలో ప్రభ కోల్పోయిన బీజేపీ.. ఏదో సాధించామని చెప్పుకోవడానికి శాంతి ఒప్పందాన్ని మమ అనిపించిందనే విమర్శలూ ఉన్నాయి. ఒప్పందంలో చేర్చిన పలు అంశాలను కూడా వారు లేవనెత్తుతున్నారు.
అస్సాం అభివృద్ధికి పలు ప్రాజెక్టుల కేటాయింపును ఒప్పందంలో చేర్చటాన్ని ప్రతిపక్ష నేతలు తప్పుబడుతున్నారు. ‘మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. దాని కోసం ఒప్పందం చేసుకోవాలా?’ అని ప్రతిపక్షాలతో పాటు సోషల్ మీడియాలోనూ విమర్శలు వస్తున్నాయి. ఓబీసీలోని పలు సామాజికవర్గాలకు ఎస్టీ హోదా కల్పించే హామీని ఇందులో చేర్చకపోవడాన్ని విపక్ష కాంగ్రెస్ నేత దేబబ్రత సైకియా గుర్తుచేశారు. ఎన్ఆర్సీ గురించి అందులో ప్రస్తావించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ విమర్శల కారణంగానే ఉల్ఫా నేతలు ఒప్పందం అనంతరం మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
ఈశాన్య భారతం మొదటి నుంచి ఒప్పందాలకు వేదిక. ఈ ప్రాంతంలో అనేక ఒప్పందాలు జరిగినప్పటికీ మిజో, బోడో ఒప్పందాలు మాత్రమే పూర్తి స్థాయిలో విజయవంతమయ్యాయి. తాజాగా జరిగిన ఒప్పందం ప్రభావం మిగతా గ్రూపులపై కూడా పడుతుంది. సాధారణంగా ఏదైనా ఒప్పందం జరిగినప్పుడు.. దాన్ని వ్యతిరేకిస్తున్న వర్గం విడిపోయి మరో కుంపటి పెట్టుకోవటం సహజం. ఈ సమయంలో వారు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని కోరుకుంటారు. ఇక్కడ కూడా అదే జరిగే అవకాశం లేకపోలేదు.
ప్రస్తుత ఒప్పందాన్ని సరైన రీతిలో అమలు చేయకపోతే.. మళ్లీ ఉల్ఫా తీవ్రవాదులు ఆయుధాలు చేపట్టే ప్రమాదం ఉన్నది. ఒప్పందంలోని డిమాండ్ల అమలును పర్యవేక్షించేందుకు ఓ కమిటీని నియమిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పినప్పటికీ, అది అనుకున్నంత సులువు కాదనే చెప్పాలి. ఎందుకంటే ఒప్పందం చేసుకున్నంత సులువు కాదు, దాన్ని అమలు చేయడం. కేంద్ర, రాష్ట్ర పాలకులు దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది. పైగా సార్వత్రిక ఎన్నికల వేళ పురుడుపోసుకున్న ఈ ఒప్పందంలోని అంశాలను ఆ తర్వాత పక్కనపెడితే.. సమస్య మళ్లీ మొదటికొస్తుంది.
పరేశ్ బారువా నేతృత్వంలోని మరో వర్గం ఇంకా ఉనికిలోనే ఉన్నది. మయన్మార్లో శిబిరాలు నిర్వహిస్తున్న ఆ వర్గం తమ ఆధిపత్యాన్ని చాటేందుకు ప్రయత్నించే అవకాశం ఉన్నది. రాజకీయ లబ్ధి కోసమే ఒప్పందం జరిగిందా? అనే అనుమానాలు అందరి మదిని తొలుస్తున్న వేళ.. అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ ఈశాన్య భారత దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు పనిచేయాల్సిన అవసరం ఉన్నది.
– ఎడిటోరియల్ డెస్క్