జాతీయ సేవా పథకం(ఎన్ఎస్ఎస్) ఆవిర్భవించి నేటికి 54 సంవత్సరాలు. జాతీయ సేవలో విద్యార్థులను భాగ స్వామ్యం చేయాలనేది జాతిపిత మహాత్మాగాంధీ ఆలోచన. విద్యార్థులు చదువుకునే కాలాన్ని విద్యకు మాత్రమే పరిమితం చేయకుండా సేవకు కొంత సమయాన్ని కేటాయించే ధర్మాన్ని విద్యార్థులకు గుర్తు చేసే గురుతర బాధ్యత గురువులది. విద్యాసంస్థలను నెలకొల్పిన పరిసరాల్లో జీవిస్తున్న ప్రజల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక జీవన విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించి, పరిసర ప్రజల సమస్యలపై వారికి చైతన్యం కలిగించడానికి విద్యార్థులకు సామాజిక సేవ తప్పనిసరి అవసరం. దానికోసమే జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) రూపొందించబడింది.
విద్యార్థుల్లో శాస్త్రీయ, విజ్ఞాన, భౌతిక, నైతిక సానుకూల దృక్పథం కలిగించడం పాలకుల, విద్యాసంస్థల, సమాజం, అధ్యాపకుల బాధ్య త. అభ్యసన ఆతృత, ఆసక్తి ప్రదర్శించడం విద్యార్థుల కనీస కర్తవ్యం. క్యాంపస్-కమ్యూనిటీల మధ్య నిర్మాణాత్మక సంబంధం, గురుశిష్యుల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొల్పడం మాత్రమే కాదు, సామాజికస్పృహతో కూడిన నాణ్యమైన నైపుణ్యాలు కలిగిన యువ మానవవనరులను తయారు చేయాలనే తలంపుతో విద్యాసంస్థల్లో విద్యార్థులకు సామాజికసేవ కార్యకమాలు ప్రవేశపెట్టాలని డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన విద్యాకమిషన్ సూచించింది.
1950లో జరిగిన ‘కేంద్ర విద్యా సలహా బోర్డు’ సమావేశం అధ్యాపకుల సహకారంతో విద్యార్థులు కొంత సమయాన్ని, శారీరకశ్రమను సమాజసేవ కోసం కేటాయించాలని సూచించింది. విద్యార్థులు డిగ్రీ పట్టా పొందడానికి తప్పనిసరిగా కొంతసమయాన్ని సమాజసేవకు కేటాయించడం కోసం ఒక పథకాన్ని విద్యాసంస్థల్లో ప్రవేశపెట్టాలని 1958లో ప్రధాని నెహ్రు కోరారు. ఈ అంశాన్ని అధ్యయనం చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయాలని 1959లో జరిగిన విద్యాశాఖ మంత్రుల సమావేశం సూచించింది. ఈ సూచన మేరకు 1959 ఆగస్ట్ 28న డా. సీడీ దేశ్ముఖ్ అధ్యక్షతన జాతీయ సేవా కమిటీని ఏర్పాటు చేశారు. ఏడాదిలో కొంతకాలం పాటు విద్యార్థులకు మిలిటరీ, సమాజ సేవ, శారీరక శ్రమ, సాధారణ విద్యలో శిక్షణ ఇవ్వాలని కమిటీ సూచించింది. ఈ సూచన పలు కారణాల వల్ల ఆచరణకు నోచుకోలేదు.
1960లో కేంద్ర ప్రభుత్వ సూచనమేరకు ఆచార్య కేజీ సయిదాయిన్ విదేశాల్లో విద్యార్థులు జాతీయ సేవలో పాల్గొంటున్న తీరును అధ్యయనం చేసి అనేక సూచనలతో యువతకోసం ‘జాతీయసేవ’ టైటిల్తో ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించారు. డా.డీఎస్. కొఠారి అధ్యక్షతన ఏర్పాటైన విద్యాకమిషన్ (1964-66) కూడా విద్యార్థులను ఏదో ఒక విధంగా సమాజసేవకు వినియోగించుకోవాలని సూచించింది.
ఏప్రిల్ 1967లో జరిగిన రాష్ట్ర విద్యామంత్రుల సదస్సు దీన్ని పరిగణనలోకి తీసుకుని విశ్వవిద్యాలయ విద్యార్థులకు జాతీయకేడెట్కార్ప్స్ (ఎన్సీసీ) లాగానే, విద్యార్థులకోసం జాతీయసేవాపథకం (ఎన్ఎస్ఎస్)ను ప్రారంభించాలని, క్రీడాకారులను జాతీయక్రీడాసంస్థ (ఎన్ఎస్ఓ) ద్వారా ప్రోత్సహించాలని సూచించింది. 1967 సెప్టెంబర్లో జరిగిన విశ్వవిద్యాలయ ఉప కులపతుల సమావేశం ఈ సూచనను స్వాగతించి క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి ఉపకులపతులతో ఒక ప్రత్యేక కమిటీ వేయాలని సూచించింది. 1969 మేలో విశ్వవిద్యాలయ విద్యార్థి ప్రతినిధులు, ఉన్నత విద్యాసంస్థల ప్రతినిధులతో కేంద్ర విద్యాశాఖ ఒక సమావేశం నిర్వహించింది. అ సమావేశంలో జాతీయ సమైక్యత సాధనకు విద్యార్థుల జాతీయ సేవ ఒక శక్తివంతమైన సాధనంగా భావిస్తూ, గ్రామీణ జీవితాలను పట్టణ విద్యార్థులకు పరిచయం చేయడానికి దీన్ని ఉపయోగించుకోవాలని సూచించింది.
నాల్గవ పంచవర్ష ప్రణాళిక కాలంలో జాతీయ సేవా పథకం కోసం రూ.5 కోట్లు కేటాయించి ఎంపిక చేసిన విద్యాసంస్థలలో ఒక పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని పేర్కొన్నది. అందరి సూ చనల అనంతరం, జాతిపిత మహాత్మాగాంధీ శతజయంతి సంవత్సరం 1969 సెప్టెంబర్ 24న అప్పటి విద్యాశాఖమంత్రి డా.వీకేఆర్వీరావు దేశంలోని 37 విశ్వవిద్యాలయాల్లో, 40 వేల మంది విద్యార్థులతో జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) లాంఛనంగాప్రారంభించారు. 2023 మార్చ్ 31 నాటికి ఇందులో విద్యార్థుల సంఖ్య 38 లక్షలకు చేరుకున్నది.
‘నాకోసం కాదు మీ కోసం’ అనే లక్ష్యంతో, జాతీయ సేవా పథకం విద్యార్థుల్లో లౌకికవాదం, ప్రజాస్వామ్య, సామ్యవాదభావజా లం, జాతీయ సమైక్యత, భారతీయత బీజాలు వేయడానికి అద్భుతంగా ఉపయోగ పడుతుందనటంలో అతిశయోక్తి లేదు. విద్యార్థుల్లో ఆత్మైస్థెర్యం, జీవన నైపుణ్యాలు, మానవసంబంధాలు, శాస్త్రీయదృక్పథం, శ్రమపట్లగౌరవం, దయాగుణం, సహకరించు స్వభావం, సమష్టి నిర్ణయీకరణ సామర్థ్యం, నాయకత్వ లక్షణాలను కల్పించుటలో ఇది ఒక వేదికగా పనిచేస్తుంది. గ్రామీణ ప్రజల జీవన విధానాన్ని, సమస్యలను అవగాహన చేసుకోవడానికి, సమాజంలోని ఆర్థిక, సామాజిక స్థితిగతులను అధ్యయనం చేయడానికి ఎన్ఎస్ఎస్ ఎంతగానో మేలు చేస్తుంది. విద్యార్థుల భౌతిక, మానసిక, వ్యక్తిత్వ వికాసానికి ఇది దోహదం చేస్తుంది.
జాతీయ యువజన పార్లమెంట్ నిర్వహణ, జాతీయఓటర్స్దినోత్సవం, రిపబ్లిక్ డే సందర్భం గా విద్యార్థులు పరేడ్లో పాల్గొనటం, జాతీ య సమైక్యత శిబిరాలు, రక్తదాన, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం, సాహసకృత్యాల నిర్వహణ శిబిరాలు, శ్రమదాన శిబిరాలు, గ్రామాలు దత్తత తీసుకొని అభివృద్ధి పరచడం, జాతీయ, యువజన పండుగల నిర్వహణ, జాతీయ విప త్తు నిర్వహణలో శిక్షణ, మొక్కలపెంపకం, పర్యావరణపరిరక్షణ, అంటువ్యాధుల నివారణ పట్ల చైతన్య కార్యక్రమాల నిర్వహణ మొదలగు అనేక రకాల కార్యక్రమాల్లో విద్యార్థులకు అవగాహన, శిక్షణ, విజ్ఞానం కల్పించి, విద్యార్థులను సమాజ సేవలో పాల్గొనేలా చేసే వేదిక జాతీయ సేవా పథకం.
ఏది ఏమైనా జాతీయ సేవా పథకాన్ని మరిం త బలోపేతం చేయడం మనందరి ఉమ్మడి బా ధ్యత. తక్షణ అవసరం కూడా. క్రీడలు, యువజ న మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కేంద్ర జాతీయ సేవాపథకం తక్షణమే కేంద్ర విద్యామంత్రిత్వశాఖ పరిధిలోకి తేవాలి. కేంద్రం ప్రవేశ పెట్టబోతున్న నూతన విద్యావిధానంలో జాతీయ సేవ ను విద్యార్థులకు ఒక తప్పనిసరి విషయంగా ప్రవేశపెట్టి, మార్కు లు, పరీక్ష, ప్రాజెక్టు పద్ధతి తప్పనిసరి చేయాలి.
(వ్యాసకర్త: ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్)
-డా. ఏ. విజయ్ కుమార్