ఆధ్యాత్మిక నగరం ‘అయోధ్య’ వేడుకలకు ముస్తాబవుతున్నది. నూతనంగా నిర్మితమైన రామ మందిరంలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాల రాముడిని సాదరంగా ఆహ్వానించేందుకు భారతీయులు వెయ్యి కండ్లతో ఎదురుచూస్తున్న ఈ సమయంలో బాల రాముడి ప్రతిష్ఠాపనకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్వాతంత్య్రం సిద్ధించిన తొలి రోజుల్లో అయోధ్య రామ మందిరం ఉనికిని కాపాడుకునేందుకు ఆనాడు రామభక్తులు జరిపిన పోరాటం.. దాన్ని అడ్డుకునేందుకు నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను ‘స్వరాజ్య’ మీడియా సీనియర్ ఎడిటర్ స్వాతి గోయల్ శర్మ సోషల్మీడియాలో పంచుకున్నారు.
బ్రిటిష్ కాలంలో మొదలై మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత కూడా కొనసాగిన అయోధ్య రామ మందిరం వివాదం 2019లో సుప్రీంకోర్టు వెలువరించిన చరిత్రాత్మక తీర్పుతో సమసిపోయింది. వందల ఏండ్ల పాటు కొనసాగిన వివాదాస్పద రామ జన్మభూమి హిందువులకే చెందుతుందని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చిన విషయం విదితమే. అయితే ఈ తీర్పు హిందువులకు అనుకూలంగా రావడానికి మాత్రం 1949లో జరిగిన ఓ ఘటనే ప్రధాన కారణం. ఆనాడు రామభక్తులు చూపిన తెగువ వల్లనే నేడు అయోధ్యలో బాలరాముడు కొలువుదీరుతున్నాడు. అప్పటి జిల్లా మేజిస్ట్రేట్, అయోధ్య నగర మేజిస్ట్రేట్ రామభక్తులు చూపిన ధైర్యసాహసాలు వమ్ముకాకుండా చూశారు. ఆ సమయంలో కేంద్రంలో ఉన్న పాలకులు రామభక్తుల తెగువను నీరుగార్చే ప్రయత్నం చేసినప్పటికీ జిల్లా మేజిస్ట్రేట్, అయోధ్య నగర మేజిస్ట్రేట్ అడ్డుకున్నారు.
అయోధ్యలోని వివాదాస్పద రామజన్మభూమి స్థలాన్ని తిరిగి పొందేందుకు వందల ఏండ్లుగా సాధువులు, పూజారులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. 1528లో బాబ్రీ మసీదు నిర్మితమైన స్థలం ఒకప్పుడు హిందువులకు పుణ్యక్షేత్రంగా విలసిల్లేది. బ్రిటిష్ కాలంలోనూ అయోధ్య రామ జన్మభూమి కోసం పోరాటం జరిగింది. ఈ క్రమంలోనే 1934లో మతపరమైన అల్లర్లు చోటుచేసుకున్నాయి. రామ జన్మభూమిని తిరిగి పొందే ప్రయత్నాల్లో భాగంగా అప్పటి సాధువులు ఓ ప్రణాళిక రచించారు. బాబ్రీ మసీదు సెంట్రల్ డోమ్ కింద బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి, ప్రాణ ప్రతిష్ఠ చేయాలని అనుకున్నారు. అనంతరం బాలరాముడి విగ్రహాన్ని ‘అచల్’ (కదలనిది)గా ప్రకటించాలని వ్యూహం రచించారు.
బాబ్రీ మసీదు వెలుపల చబుత్రా (ప్లాట్ఫామ్)పై ఉన్న చిన్న రామ మందిరానికి మహంత్ అభిరామ్ పూజారిగా ఉండేవారు. అయోధ్యలోని చరిత్రాత్మక హనుమాన్ గడీ ఆలయానికి కూడా ఆయనే ప్రధాన పూజారి. ఆ చబుత్రా వద్దనే రామభక్తులు, సాధువులు పూజలు చేసేవారు. తీర్థప్రసాదాలు సమర్పించేవారు. ఎన్నటికైనా అక్కడ రామమందిరం నిర్మించి తీరాలని మహంత్ అభిరామ్ కలలు కనేవారు. హనుమాన్ గడీ ఆలయానికి సమీపంలో రామ్దాస్ అనే సాధువు తదితరులతో కలిసి రామ్లల్లాను బాబ్రీ మసీదులో ప్రతిష్ఠించాలని ప్రణాళిక వేశారు. అందుకుగానూ 1949 డిసెంబర్ 22 శుక్ల తృతీయ నాడు పవిత్రమైన తిథిని ఎంచుకున్నారు.
ప్రణాళికలో భాగంగా బాబ్రీ మసీదు వెలుపల, రామ జన్మభూమి వద్ద అఖండ కీర్తనలు, రామచరిత మానస్, భజనలు చేయసాగారు. దీంతో స్థానిక ముస్లింలు ఆందోళనకు గురై ఫైజాబాద్ జిల్లా మేజిస్ట్రేట్ కేకే నాయర్ను కలిసి పరిస్థితిని వివరించారు. పరిస్థితిని చక్కదిద్దాలని అయోధ్య నగర మేజిస్ట్రేట్ ఠాకూర్ గురుదత్ను ఆయన ఆదేశించారు. వివాదాస్పద స్థలం వద్ద జరుగుతున్న కార్యక్రమాలను వెంటనే ఆపాలని గురుదత్ సాధువులకు చెప్పారు. అయినప్పటికీ వారు కార్యక్రమాలను కొనసాగించారు. అయితే అనుకున్న ప్రణాళికను ఆచరణలో పెట్టేందుకు సుమారు 1008 మందికిపైగా భక్తులు నిత్యం అక్కడ ఉండాలని, ప్రజలను కూడా కీర్తనల్లో పాల్గొనేలా చేయాలని సాధువులు భావించారు.
1934లో జరిగిన అల్లర్ల తర్వాత బాబ్రీ ప్రాంగణంలోకి హిందువులు రాకుండా ఆంక్షలు విధించారు. వివాదాస్పద స్థలంలోకి ఎవరూ ప్రవేశించకుండా ఓ గేటును ఏర్పాటు చేసి, అక్కడ రాత్రి పూట ముస్లిం వ్యక్తిని కాపలాగా ఉంచారు. అనుకున్న ప్రణాళికను అమలు చేయాలంటే అతన్ని దాటుకొని వెళ్లాలి. అయితే అది అంత సులువేమీ కాదు. కానీ, తమ ఆరాధ్య దైవం కోసం సాధువులు ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నారు.
ఆ రోజు రానే వచ్చింది. అది 1949 డిసెంబర్ 22 అర్ధరాత్రి. రామ్దాస్ అనే సాధువు ప్రణాళికను అమలు చేసేందుకు సిద్ధమయ్యాడు. బాలరాముడి విగ్రహం, గంట, పూజా సామగ్రితో అతను బాబ్రీ మసీదు ప్రాంగణానికి చేరుకున్నాడు. సంచిలో ఉన్న గంటతో సెక్యూరిటీ గార్డును గాయపరిచి బాబ్రీ మసీదులోకి ప్రవేశించాడు. సెంటర్ డోమ్ కింద బాలరాముడిని ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు నిర్వహించాడు. బాలరాముడి విగ్రహాన్ని తొలగించేందుకు వీలు లేకుండా, ఇనుప మేకులతో భద్రపరిచాడు.
తర్వాతి రోజు ఉదయం అయోధ్య అంతటా ఓ వార్త దావానలంలా పాకింది. ‘ముందు రోజు రాత్రి మసీదు సమీపంలో సెక్యూరిటీ గార్డు ఓ వెలుగును చూశాడు. అనంతరం కొంత సమయం పాటు అతడు తన దృష్టిని కోల్పోయాడు. అనంతరం వెలుగు తగ్గుముఖం పట్టింది. సెంట్రల్ డోమ్ కింద ఓ బాలుడు నాట్యం చేయటం అతడు చూశాడు. అది చూసిన వెంటనే అతడు స్పృహ కోల్పోయాడు. ఉదయాన్నే లేచి చూస్తే డోమ్ కింద బాలరాముడి విగ్రహం ఉంది’ అనే వార్త అయోధ్య అంతటా వ్యాపించింది.
ఈ విషయం తెలుసుకున్న స్థానిక ముస్లింలు.. అప్పటి కేంద్ర ప్రభుత్వ పాలకులకు తెలియజేశారు. బాలరాముడి విగ్రహాన్ని తొలగించి, బాబ్రీ మసీదు ప్రాంగణానికి తాళం వేయాలని నాటి ప్రధాని నెహ్రూ.. యునైటెడ్ ప్రావిన్స్ (ఉత్తరప్రదేశ్) పాలకుడు గోవింద్ బల్లభ్ పంత్ను ఆదేశించారు. ఈ మేరకు ఓ నోట్ను పంపారాయన. ఈ నోట్ 2005లో అనుమానాస్పదంగా మాయమైంది.
కేంద్రం నుంచి ఆదేశాలు అందుకున్న గోవింద్ అయోధ్యకు బయలుదేరారు. కానీ, అయోధ్య నగర మేజిస్ట్రేట్ ఠాకూర్ గురుదత్ గోవింద్ పంత్ను ఫైజాబాద్లోనే అడ్డుకున్నారు. అయోధ్యలో అడుగు పెడితే.. మీ ప్రాణాలకే ప్రమాదమని, అల్లర్లు చెలరేగే ఆస్కారం ఉందని చెప్పి వెనక్కి పంపించేశారు. అనంతరం కొంతకాలానికి ముస్లింలు వివాదాస్పద స్థలంలో ప్రవేశించకుండా గురుదత్ ఆంక్షలు విధించారు. బాలరాముడి విగ్రహం తొలగించకుండా అడ్డుకునే క్రతువులో ఫైజాబాద్ మేజిస్ట్రేట్ కేకే నాయర్ కూడా కీలక పాత్ర పోషించారు.
విగ్రహాన్ని తొలగిస్తే నగరంలో అల్లర్లు చెలరేగుతాయని ఆయన కేంద్రానికి పరిస్థితిని వివరించారు. నాడు కేకే నాయర్ కృషి ఫలితంగానే బాలరాముడు అక్కడే కొలువయ్యాడు. కొంతకాలానికి 1950 జనవరిలో వాటిని తొలగించకుండా ప్రభుత్వం నిషేధాజ్ఞలు జారీ చేసింది. ఐదేండ్ల తర్వాత దీన్ని హైకోర్టు సమర్థించింది. అనంతరం బాలరాముడికి పూజలు జరిపేందుకు అనుమతులు లభించాయి. ఈ ఘటనే నేటి రామమందిరానికి అంకురార్పణగా చరిత్రలో నిలిచిపోయింది. బాలరాముడిని ప్రతిష్ఠించిన నాటి నుంచి ఏటా అయోధ్యలో ‘భగవంత్ ప్రకట్య మహోత్సవ్’ పేరిట అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు వేషధారణలో చిన్నారులు కనువిందు చేస్తుండగా.. భారీ శోభాయాత్ర నిర్వహిస్తారు. ఈ ఏడాది జనవరి 14న వచ్చే శుక్ల తృతీయ రోజు ఈ మహోత్సవం జరుగనున్నది.
– ఎడిటోరియల్ డెస్క్