గిరిజనుల దశాబ్దాల కల నెరవేరబోతున్నది. వివాదాల్లో ఉన్న పోడు భూముల సమస్య పరిష్కారానికి రంగం సిద్ధమైంది. ఈ నెలలోనే పట్టాలు పంపిణీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అటవీ, గిరిజన, రెవెన్యూశాఖల సమన్వయంతో చేసిన కసరత్తు దాదాపుగా పూర్తికావచ్చింది. పోడు భూముల పట్టాల పంపిణీ దస్త్రంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేసిన విషయం తెలిసిందే.
పోడు భూములకు పట్టాలిచ్చే విషయమై రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లా ల్లోని 295 మండలాలు, 2,845 గ్రామ పంచాయతీల పరిధిలో అటవీ హక్కుల కమిటీలు క్షేత్రస్థాయిలో నెలలపాటు కసరత్తు చేశాయి. 12,49, 296 ఎకరాలకు 4,14,353 క్లెయిమ్స్ను ఈ ఫారెస్ట్ కమిటీలు వివిధ స్థాయిల్లో పరిశీలించా యి. 4,05,601 ఎకరాలకు సంబంధించి 1,50,012 మంది లబ్ధిదారులు పోడు పట్టాలకు అర్హత కలిగి ఉన్నారని తేల్చారు. ఇప్పటికే పట్టా ల పంపిణీపై గిరిజన, అటవీ, రెవెన్యూ శాఖల అధికారుల సంతకంతో పాటు, లబ్ధిదారుడి ఫొటో ఉండేలా పట్టాదారు పాస్బుక్లు సిద్ధమయ్యాయి.
భవిష్యత్తులో అటవీ భూమి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాక్రాంతం కాకుండా పాలిగాన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. ఎవరైనా ఆక్రమిస్తే కఠిన చర్యలుంటాయని ప్రభుత్వం హెచ్చరించింది. పంపిణీ చేసిన తర్వాత భవిష్యత్తులో ఇరుగుపొరుగు వారితో భూ హద్దు వివాదాలు తలెత్తకుండా ఉండటం కోసం ప్రభుత్వం ఈ టెక్నాలజీని వినియోగించినట్టు అధికార యంత్రాంగం తెలిపింది.
భూ సర్వే నెంబర్, పంపిణీ చేసే భూమి విస్తీ ర్ణం, ఆ భూమి ఏ అక్షాంశ, రేఖాంశాల మధ్య ఉన్నది? సంబంధిత భూ హద్దులేవి? వంటి అంశాలను గూగుల్ మ్యాపింగ్ వివరాలతో పాటు హాలోగ్రామ్ను పోడు పట్టాలలో పొందుపరుస్తున్నారు. పంపిణీ విషయంలో కలెక్టర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పోడు భూములకు కూడా భవిష్యత్తులో రైతుబంధు పథకం వర్తింపజేస్తామని కూడా ముఖ్యమంత్రి తెలిపారు.
గిరిజనులు అడవిని కొంతమేర నరికి జొన్న, సజ్జలు వంటి చిరుధాన్యాలూ, ఇతర కూరగాయలు పండిస్తారు. ఇవే వారి ప్రధాన జీవనాధా రం. నాగలిని ఉపయోగించకుండా కేవలం ఒక చిన్న గొడ్డలి సహాయంతో అడవిని కొట్టి సాగుచేసే ఈ పద్ధతిని ‘పోడు’ అంటారు. అడవుల్లోని కొం డవాలుల్లో చిన్న చిన్న చెట్లను, పొదలను నరికి చేసుకునే ఈ వ్యవసాయాన్నే ‘పోడు వ్యవసాయం’గా పిలుస్తారు. ఇలాంటి పోడు భూముల్లో వ్యవసాయం చేసుకొనే కుటుంబాలు తెలంగాణ రాష్ట్రంలో లక్షల్లో ఉన్నాయి. అయితే ఈ భూములపై వారికి ఎలాంటి హక్కులేదు. అవన్నీ ప్రభు త్వభూములే. బ్రిటిష్ ప్రభుత్వం ‘ప్రభుత్వ ఏజెం ట్’ (కలెక్టర్ల) అధీనంలో పరిపాలన సాగించడం వల్ల ఈ ప్రాంతాలను ‘ఏజెన్సీ ప్రాంతాలు’ అనేవారు. వీటిపై హక్కులు కల్పించాలని గిరిజనులు చాలా ఏండ్లుగా పోరాటం సాగిస్తున్నారు.
రంప పోరాటాల తర్వాత గిరిజన ముఠాదార్లతో ఒప్పందాలు కుదిరాయి. వారికి ముఠా నిర్వహణ ఇస్తూనే ప్రతి విషయంలో ఆంక్షలు విధించడం బ్రిటిష్ హయాంలో జరిగింది. తర్వా త నిజాం ప్రభుత్వం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. భూ పంపకం చాలా ముఖ్యమైన కార్యక్రమం. కానీ భూ నిర్ధారణ 1988 వరకు చేపట్టలేదు. అటవీ చట్టాల అమలులో మాత్రం ఏ విధమైన మార్పులు చేయలేదు. బ్రిటిష్ పాలనలో అమల్లో ఉన్న 1917 భూమి బదలాయింపు చట్టానికి బదులు 1959లో మరో చట్టం వచ్చింది. దీన్ని 1963 నుంచి తెలంగాణలోనూ వర్తింపజేయడంతో మొత్తం రాష్ట్రమంతా ఒకే చట్టం వచ్చింది. అయితే చట్టంలో లోపాల కంటే అమలులో అలసత్వమే ఎక్కువ. కొన్నిసార్లు గిరిజనులకు నోటీసులు ఇవ్వకుండా, వారి భూమి హక్కు పత్రాలను సరిగా పరిశీలించకపోవడం వల్ల గిరిజనులు భూమిని కోల్పోయారు. అటవీ భూములుగా ప్రకటించే ముందు వాస్తవాలను పట్టించుకోకపోవడం వల్ల ఎన్నో పురాతన గిరిజన గ్రామాలు, తరతరాలుగా వ్యవసాయంలో ఉన్న గిరిజన భూములు అడవుల్లో కలిసిపోయాయి. సంప్రదాయకంగా సామాజిక, వ్యక్తిగత హక్కులు కలిగిన గిరిజన రైతులు అడవిలో ‘చొరబాటుదారులు’గా పరిగణించబడ్డారు. దీంతో భూమి రికార్డులు తప్పుల తడకగా అస్తవ్యస్తంగా మారాయి
ఏండ్ల తరబడి పోడు భూముల రగడ రగులుతున్నది. అటవీ అధికారులకు, ఆదివాసీ బిడ్డలకు మధ్య నిత్యం పోరు నడుస్తున్నది. ఇటీవల ఈ పోడు గొడవల్లోనే ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తికోయల దాడి లో ఏకంగా ప్రాణాలే కోల్పోయారు. తాము సాగు చేస్తున్న పోడు భూముల్లోకి ఫారెస్ట్ ఆఫీస ర్లు చొరబడుతున్నారని, తమ పంటలను నాశ నం చేస్తున్నారని గిరిజన బిడ్డలు గగ్గోలు పెడుతున్నారు. అటవీశాఖ భూముల్లోని చెట్లను నరుకు తూ, అటవీ సంపదను నాశనం చేస్తూ, భూములను ఆక్రమించుకుంటున్నారని, ఫారెస్ట్ ఆఫీసర్లు అంటున్నారు. ఇలా ఎడతెగని రచ్చ జరుగుతున్న ది. ఇద్దరి వాదన సరైనదే, అసలు పరిష్కారం పోడు భూముల పట్టాల పంపిణీనే.
ఈ సమస్యకు పుల్స్టాప్ పెట్ట డం కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని కార్యాచరణను చేపట్టారు. పోడు భూముల పట్టాల సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభు త్వం జీవో 140 జారీ చేసింది. భవిష్యత్తులో ప్రతీ గిరిజనుడికి న్యాయం జరిగేలా, అటవీ, రెవె న్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. గిరిజనుల వివరాలు నమోదు చేసి పంచాయతీ కార్యదర్శికి తెలియజేయాలని ప్రభుత్వం కోరింది. అడవుల నడిమధ్యలో సాగవుతున్న పోడు వ్యవసాయాన్ని తరలించి, అడవి అంచున భూమిని కేటాయించి ఆ భూములకు పట్టాలిచ్చి, వ్యవసాయానికి నీటి వసతి, కరెంటు సౌకర్యాలు కల్పిస్తామని ప్రభుత్వం చెప్తున్నది. దీనివల్ల అడవులు నరికివేత కూడా నివారించబడుతుంది.
అడవి బిడ్డలకు అడవుల మీద ప్రేమ ఉంటుంది. వారి జీవన సంస్కృతి అడవులతో ముడిపడి ఉంటుంది. వారు అడవులను ప్రాణంగా చూసుకుంటారు. ఎట్టి పరిస్థితిల్లోనూ హాని తలపెట్టరు. వారి జీవిక కోసం అడవుల్లో దొరికే తేనె, బంక, పొయ్యి కట్టెలు, ఇతర ఉత్పత్తుల కోసం మాత్రమే వారు అడవులను ఉపయోగించుకుంటారు.
ప్రభుత్వం వారి జీవనహక్కును కాపాడుతుంది. సమస్య అంతా కూడా బయటి నుంచి పోయి భూములను ఆక్రమించి, సంపదను నరికి, దుర్వినియోగం చేసే వారితోనే, వారి స్వార్థానికి అడవులను బలి కానివ్వమని, పోడు భూముల సమస్య పరిష్కారమైన మరుక్షణం నుంచి అటవీ భూముల రక్షణ కోసం ప్రభుత్వం పటిష్టమైన చర్యలు ప్రారంభిస్తుందని సీఎం కేసీఆర్ తెలియజేశారు. గిరిజనులు ఇప్పటికే సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలిస్తామని ఇటీవల కేసీఆర్ తెలిపారు. ఈ కార్యాచరణ వల్ల గిరిజనులు, ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నిండుతాయని ఆశిద్దాం.
(వ్యాసకర్త : విశ్రాంత ప్రధానాచార్యులు)
తాము సాగు చేస్తున్న పోడుభూముల్లోకి ఫారెస్ట్ ఆఫీసర్లు చొరబడుతున్నారని, తమ పంటలను నాశనం చేస్తున్నారని గిరిజన బిడ్డలు గగ్గోలు పెడుతున్నారు. అటవీశాఖ భూముల్లోని చెట్లను నరుకుతూ, అటవీసంపదను నాశనం చేస్తూ, భూములను ఆక్రమించుకుంటున్నారని, ఫారెస్ట్ ఆఫీసర్లు అంటున్నారు.