రెండు జాతీయ పార్టీలు, ఇద్దరు నాయకులు, వేర్వేరు సంఘటనలు.. కానీ ఒకే ఆలోచన, ఒకే దాడి ‘KCR National Party has No Takers’ అని. ఒకరు 2022 జూన్ 13న కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్ కుమార్రెడ్డి అయితే, ఇంకొకరు 2022 అక్టోబర్ 4న బీజేపీ నేత, కేంద్రమంత్రి కిషన్రెడ్డి. చరిత్ర మరిచిన ఈ రెండు జాతీయ పార్టీలకు, ఆ నాయకులకు ఖమ్మం గుమ్మంలో 2023, జనవరి 18న ‘భారత్ రాష్ట్ర సమితి’ తొలి బహిరంగసభ గట్టి సమాధానం చెప్పనున్నది.
ఒక్క వేదిక నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్మాన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ను తట్టుకోలేకనే 19న మోదీ తన పర్యటనను రద్దు చేసుకున్నట్టు అర్థమవుతున్నది. మూడు రాష్ర్టాల ముఖ్యమంత్రులు, ఒక ప్రతిపక్ష నేత తెలంగాణకు వచ్చి సభలో పాల్గొనబోతున్నారంటే వాళ్లందరికీ నేటి రాజకీయాల్లో బీఆర్ఎస్ అవసరంపై పూర్తి అవగాహన ఉందని గమనించాలి. తెలంగాణ సాధించడానికి ఎన్నో పార్టీలను బిల్లుకు మద్దతు కోరారు కేసీఆర్. ఇప్పుడు అదే అనుభవం ఈ సమయంలో దేశానికి అత్యంత అవసరం.
2022 ఫిబ్రవరి 17న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చేసిన అధికారిక ట్వీట్పై దృష్టిపెట్టాలి. ‘కేసీఆర్ సమాఖ్యస్ఫూర్తి కోసం పోరాడు తారు. వారితో కలిసి రాష్ర్టాల హక్కులు, దేశ రాజ్యాంగ పరిరక్షణ కోసం పనిచేయాలి’ అని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. ఆగస్టు 31న కేసీఆర్ బీహార్కు వెళ్లి గాల్వాన్లో చనిపోయిన అమర జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సహాయం కోసం చెక్కులు పంచిన రోజున బీహార్ సీఎం నితీష్కుమార్ కేసీఆర్ను ఉద్దేశించి మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు ఒక తెలంగాణ పౌరుడిగా మనం గర్వించేదగినవి. ‘కేసీఆర్ దేశ్ కే సమ్మానిత్ నేత’ అని సంబోధిస్తూ తెలంగాణలో జరిగిన అభివృద్ధిపై ప్రసంశలు కురిపించారు.
2022 ఏప్రిల్ 11న కేసీఆర్ ఢిల్లీలో కేంద్రానికి వ్యతిరేకంగా ‘ఒకే ధాన్యం సేకరణ విధానం’ కోసం దీక్ష చేపడితే సమాజ్వాది అధ్యక్షుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ సంపూర్ణ మద్దతు తెలిపాడు. రాష్ట్రీయ లోక్దళ్ ఎంపీ జయంత్ కేసీఆర్ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. రైతు నేత రాకేష్ టికాయత్ ఏకంగా కేసీఆర్తో దీక్షకు కూర్చొని కేసీఆర్ పాలనలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలను కొనియాడారు. ‘రైతుబంధు’, ‘రైతుబీమా’ యావత్ దేశానికే ఆదర్శమని ఆ ప్రసంగంలో చెప్పారు. ఢిల్లీలో ఏడాది పాటు జరిగిన రైతు పోరాటంలో పాల్గొన్న రైతు నేతలకు, కేసీఆర్కు మంచి సంబంధాలున్నాయని కేంద్ర ప్రభుత్వానికి నిఘావర్గం నివేదికను కూడా ఇచ్చింది.
మహారాష్ట్ర నుంచి సీనియర్ పార్లమెంట్ సభ్యుడు, కొన్ని దశాబ్దాల నుంచి జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్న శివసేన సంజయ్ రౌత్ బాలాసాహెబ్ ఠాక్రేకు ఆత్మీయ శిష్యులు. అలాంటి సంజయ్రౌత్ మీడియా ముఖంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటం కోసం అన్ని పార్టీలను ఏకంజేసే సత్తా కేసీఆర్కు ఉందని ప్రకటించారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ఈ యేడు జరుగుతున్న ఎన్నికల్లో కింగ్ లేదా కింగ్ మేకర్గా మీడియా విశ్లేషిస్తున్నా కుమారస్వామి, దళితనేత, లోక్సభ సభ్యుడు తోల్ తిరుమవలన్ ఏకంగా ఢిల్లీ బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభానికి వచ్చి కేసీఆర్పక్షాన నిలబడ్డారు.
2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి కూటమి అయిన ఎన్డీయేలో మోదీ తీరును, ఏకపక్ష నిర్ణయాలను, విధానాల వైఫల్యాలను చూసి చేరినవారు లేరు, వదిలి వెళ్లిపోయిన వాళ్లే ఉన్నారు. టీడీపీ, శివసేన, మెహబుబా ముఫ్తీ పీడీపీ, శిరోమణి అకాలీదళ్, నితీష్ జనతాదళ్ ఇలా దూరమైన వాళ్లే ఎక్కువ. అదే కేసీఆర్తో చెయ్యి కలుపుతున్న వారు పెరుగుతున్నారు. బీజేపీని ఓడించిన కేసీఆర్, కేజ్రీవాల్, పినరయి విజయన్, భగవంత్ సింగ్మాన్, మోదీ, అమిత్ షా, యోగిని ఎదురించి తన సీట్లను మూడు రెట్లు పెంచుకున్న అఖిలేష్, వీరందరూ బీఆర్ఎస్ మొదటి సభ కోసం ఖమ్మం రావడాన్ని బీజేపీ అగ్ర నాయకత్వం తీవ్రంగా చూస్తున్నది. విశ్లేషకులు టర్నింగ్ పాయింట్గా భావిస్తున్నారు.
ఇప్పటికే ప్రధాని తన పదవి హుందాతనాన్ని సైతం మరిచి రామగుండంలో వేలు చూపించి మరీ కేసీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించిన విషయం ప్రజలు మరవరు. కొంతకాలం నుంచి కేసీఆర్ వేసిన కీలక ప్రశ్నలకు మోదీ సమాధానం చెప్పకుండా కనీసం కేసీఆర్ పేరు తీయడానికి మోదీ ఆలోచిస్తున్నాడు. వ్యవసాయం, నీళ్లు, విద్యుత్, యువతకు ఉపాధి… ఇలా విధానాలపై సూటిగా కేసీఆర్ మాట్లాడుతుంటే బీజేపీలో అగ్ర నాయకులు తట్టుకోలేక పోతున్నారు. అందుకే సీబీఐ, ఈడీ, ఐటీ లాంటి సంస్థలను కేసీఆర్పై దాడి చేయించి ఆపే ప్రయత్నం చేయిస్తున్నారు. కానీ కేసీఆర్కు దేశవ్యాప్తంగా, పలు రాష్ర్టాల నుంచి ప్రజలు, ప్రజా ప్రతినిధులు, రైతులు, యువత మద్దతు తెలుపుతున్నారు.
దశాబ్దాలుగా దేశ ప్రజలను నిర్లక్ష్యం చేసిన రెండు జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఖమ్మం వేదిక నుంచి ఒక కొత్త శక్తి ఆవిర్భవించనున్నది. మోదీకి ఒక చాలెంజర్ ఉద్భవిస్తారు.
ఆయనే కేసీఆర్!
(వ్యాసకర్త: రీసెర్చ్ స్కాలర్, ఓయూ)
క్రిశాంక్ మన్నె