Telangana Movement | తెలంగాణ భాషను యాసని ఈసడించిన వాళ్లే, సినిమాల్లో కామెడీ సీన్లకు వాడుకున్న వాళ్లే నేడు మన భాషకు వెండితెరపై పట్టం కట్టక తప్పని పరిస్థితిని తెలంగాణ ఉద్యమం కల్పించింది. ఈ విజయం సాధారణమైంది కాదు. మన భాష, యాస ఈ రోజు ప్రపంచ వేదికలపై గొప్ప గౌరవాన్ని అందుకుంటున్నది. సాహిత్యంలోనూ ఆధిపత్య వాదాన్ని తిప్పికొట్టి ప్రజల భాషకు పట్టం కట్టింది తెలంగాణ ఉద్యమం.
తెలంగాణలో తెలుగు కవులు పూజ్యం అని ముడుంబై రాఘవాచార్యులు అన్నందుకు సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ కవులు రాసిన 354 కవితలు సేకరించి ‘గోలకొండ కవుల సంచిక’ పేరుతో పుస్తకం వేశారు. భాషా సాహిత్యాల్లో కూడా ఇక్కడి భాషను చులకన చేయడాన్ని తెలంగాణ సాహితీవేత్తలు సహించలేదు. తగిన జవాబు చెప్పారు. ప్రజల మనిషిగా వట్టికోట ఆళ్వారు స్వామి రాసిన సాహిత్యంలో ఇక్కడి మట్టి వాసన కనిపిస్తుంది. దాశరథి, కాళోజీ, సుద్దాల హనుమంతు, బండి యాదగిరి వంటి సాహిత్యకారులెందరో తెలంగాణ భాషలో సాహిత్యాన్ని వెలువరించారు.
విశాలాంధ్ర ఏర్పడక ముందు తెలంగాణ భాష సాహిత్యసంపదకు పుట్టినిల్లుగా సారస్వత భాషగా పేరెన్నికగన్నది. తెలుగు అనే పదం కూడా తెలంగాణ పదం నుంచి వచ్చిందేనంటారు. తెలుగులో మొదటికవి తెలంగాణకు చెందిన పాల్కురికి సోమన. కాకతీయుల కా లం నాటి వాడు. ఆది కవి అని చెప్పే నన్నయ్య రాసింది అనువాద సాహిత్యం. సోమనది స్వతంత్ర సాహిత్యం. సోమన రాసిన ‘వృశాధిప శతకం’ తెలుగులో మొదటి శతకం. ఇది శివస్తుతితో కూడిన శైవసాంప్రదాయ గ్రంథం. వీరశైవ మత స్థాపకుడయిన బసవణ్ణ జీవితమే ఇతివృత్తంగా బసవపురాణం రాశాడు. ఆయన రాసిన అక్షరాంక పద్యాలు నేటికి కూడా కవులకు సవాలు వంటివే. సోమన రాసిన సాహిత్యం అచ్చతెలుగు సాహిత్యం. పోతన సంస్కృతాన్ని తెలుగును కలిపి మధ్యయుగంలో కవిత్వం రాశాడు. పొన్నగంటి తెలగన రాసిన ‘యాయాతి చరిత్ర’ వంటి కావ్యాలే కాదు ఆధునిక యుగంలో నిజాం రాచరిక పాలనకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటంలో సురవరం ప్రతాపరెడ్డి రాసిన రచనలు ఉద్యమాన్ని ఉరకలు పెట్టించాయి.
తెలంగాణలో తెలుగు కవులు పూజ్యం అని ముడుంబై రాఘవాచార్యులు అన్నందుకు సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ కవులు రాసిన 354 కవితలు సేకరించి ‘గోలకొండ కవుల సంచిక’ పేరుతో పుస్తకం వేశారు. భాషా సాహిత్యాల్లో కూడా ఇక్కడి భాషను చులకన చేయడాన్ని తెలంగాణ సాహితీవేత్తలు సహించలేదు. తగిన జవాబు చెప్పారు. ప్రజల మనిషిగా వట్టికోట ఆళ్వారు స్వామి రాసిన సాహిత్యంలో ఇక్కడి మట్టి వాసన కనిపిస్తుంది. దాశరథి, కాళోజీ, సుద్దాల హనుమంతు, బండి యాదగిరి వంటి సాహిత్యకారులెందరో తెలంగాణ భాషలో సాహిత్యాన్ని వెలువరించారు.
తెలుగు వారందరికీ ఒకే రాష్ట్రం ఉండాలని ఏర్పడ్డ విశాలాంధ్రలో తెలంగాణ అణిచివేతకు గురైంది. అది అనేక రూపాలుగా కొనసాగింది. సాహిత్యంలోనూ అణిచివేత తప్పలేదు. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఈ ఉద్యమంలో సాహిత్యం ప్రత్యేక పాత్ర పోషించింది. కాళోజీ నారాయణ రావు రాసిన కవితలు ప్రత్యేక తెలంగాణ అవసరాన్ని చాటి చెప్పాయి.
విశాలాంధ్ర ఏర్పడిన తర్వాత తెలంగాణ భాషా సాహిత్యాలను ఆధిపత్య వాదులు అణిచివేశారు. పాఠ్యపుస్తకాల్లో, సినిమాల్లో ఆధిపత్య భాష చెలామణి అయ్యింది. తెలంగాణ భాష కేవలం కామెడీ సీన్లకు పరిమితం చేశారు. విలన్లు మాట్లాడే భాషగా చూపించారు. ప్రత్యేక తెలంగాణ మలిదశ పోరాటానికి శంఖారావం పూరించిన కేసీఆర్ ఉద్యమాన్ని ఉధృతం చేయడంతో సాహిత్యరంగంలోను అణిచివేతలను విదిలించి కొట్టడం ప్రారంభమయ్యింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భాషా సాహిత్యాలపై సినిమా టీవీ మాధ్యమాలపై కూడా దృష్టి పెడుతూ పునర్నిర్మాణ ప్రయత్నాలు జరిగాయి. ఆ ప్రయత్నాల ఫలితమే నేడు తెలంగాణ పాఠ్యపుస్తకాలు ప్రత్యేకంగా రూపుదిద్దుకున్నాయి. పిల్లలకు చిన్నప్పటి నుంచి తెలంగాణ ప్రజల భాషను పరిచయం చేసేలా ఇక్కడి పాఠ్యపుస్తకాలు రూపొందాయి. ఇప్పుడు సినిమా తెరపై కూడా తెలంగాణ భాషకు ప్రత్యేక ఆదరణ దొరుకుతోంది. తెలంగాణ భాష మాట్లాడే హీరో ఇప్పుడు ప్రజల హృదయాలను దోచుకుంటున్నాడు. తెలంగాణ నుడికారం, తెలంగాణ పలుకుబడులు, తెలంగాణ మట్టివాసన, తెలంగాణ ప్రజల జీవభాష ఇప్పుడు అస్తిత్వ జెండా ఎగరేస్తున్నది. మలిదశ ఉద్యమం సాధించిన విజయాల్లో ఇది చాలా కీలకమైనది.
కాళోజీ నిజానికి ఈ విషయాన్ని ఎప్పుడో చెప్పారు. రెండున్నర జిల్లాల ఆధిపత్య భాష ప్రాబల్యం కేవలం కొద్దికాలమే అయ్యింది. సోమన కాలం నుంచి తెలంగాణ భాషా సాహిత్యాల మహోన్నత వైభవం మరోసారి తెలంగాణ సాధించుకున్నది. నేడు సినిమాలు విజయం సాధించాలంటే హీరో తెలంగాణ భాష మాట్లాడడమే హిట్ మంత్రగా మారిం ది. హీరోలు, హీరోయిన్లు, ఇతర ప్రముఖ పాత్రలు మాట్లాడే ప్రధాన భాషగా తన సత్తా చాటింది. దీనంతటికీ కారణం తెలంగాణ ఉద్యమమే. ఉద్యమంలో సాహిత్య సాంస్కృతికాంశాల ప్రాముఖ్యాన్ని గుర్తించి వాటిని ఉద్యమంలో భాగంగా మార్చడంలో కేసీఆర్ విజయం సాధించారు. ఈ భాషలో ఉన్న లయ, శబ్దసౌందర్యం మరెక్కడా లేదని రుజువయ్యింది.
ఇది సినిమాలకు మాత్రమే పరిమితం కాదు, టీవీ సీరియళ్ళ, వ్యాపార ప్రకటనల్లోను తెలంగాణ భాష తన ప్రత్యేకతను చాటి చెబుతోంది. సాహిత్యంలో కూడా ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తున్నది. కవిత్వం, నవలలు, కథలు తెలంగాణ నేలతల్లి భాషలో వస్తున్నాయి. మాస్ మీడియాలో భాష విస్తరించడం వల్ల భాష విస్తృతి పెరుగుతుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. ఈ పరిణామం కొంతకాలం తర్వాత తెలంగాణ భాషకు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపునిచ్చే గొప్ప వైభవంగా మారబోతున్నది.
(వ్యాసకర్త : తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి)
-డా. బాలాచారి
90631 31999