మగాధిపత్య కుల అహంకారుల్లోనే కాదు అభ్యుదయ, ప్రగతిశీల మగాళ్ల మాటలు, పాటలు, సాహిత్యం, నిత్య జీవన ప్రక్రియల్లో మహిళా వ్యతిరేకత, అవమానం కొట్టొచ్చినట్టు కనపడతాయి. ప్రజాప్రతినిధులైన పాలకులు, ప్రభుత్వ, ప్రభుత్వేతర, శాసనసంస్థలు రాజ్యాంగబద్ధ్దంగా పాలించేటట్టు చూడవలసిన గురుతర బాధ్యత కలిగిన న్యాయవ్యవస్థలోని న్యాయమూర్తులు, న్యాయవాదులు కూడా తిరోగమన భావజాల పదబంధాల ప్రయోగాలకు అతీతం కాదు.
దాశరథి కృష్ణమాచార్య తెలంగాణ విముక్తి కోసం నిజాం నవాబును ఎదిరిస్తూ రచనలు చేసిన అభ్యుదయ కవి. మంచి మనసులు చిత్రానికి ఆయన రాసిన ‘నన్ను వదిలి నీవు పోలేవులే..’ పాటలో స్త్రీని పువ్వుతో పురుషున్ని పరిమళంతో పోల్చారు. సుందర పుష్పంతో స్త్రీ పోలిక సబబే. పురుషున్ని సువాసనతో పోల్చి, అది లేని పువ్వుకు విలువలేదని, మగాడు లేని మహిళ లేదని వర్ణించారు. పుష్పం, పరిమళం రెండూ మహిళే.
సిరివెన్నెల (చేంబోలు) సీతారామ శాస్త్రి సినిమా పాటలన్నీ సంస్కృత పదాలతో వినసొంపుగా ఉంటాయి. ప్రజల భాషలో లేని ఈ పాటలు సామాన్యులకు అర్థంకావు. ఆయన గాయం చిత్రానికి రాసిన ఒక పాట భావం చూద్దాం. ‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని’ సిగ్గులేనిది జనానికి కాదు. జాతీయోద్యమంలో, స్వాతంత్య్ర సమరంలో, సామాజిక విప్లవాల్లో పాల్గొన్నది ఈ జనాలే. సిగ్గులేనిది పెట్టుబడిదారి, సామ్రాజ్యవాద, నూతన ఉదారవాద పాలక వర్గానికి. పాలనా వైఫల్యానికి కారణం పాలకులే. ‘అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని’ అగ్గిపెట్టె లేక, అగ్గిని పక్కింటి నుంచి తెచ్చుకునే రోజుల్లో దాన్ని నీటితో కడిగి తీసుకునే సంప్రదాయం ఆధిపత్య వర్గాలది. అగ్గితో కడగాల్సింది నిచ్చెనమెట్ల కులగజ్జిని పెంచి, పేదలను జీవశ్చవాలుగా మార్చిన వ్యవస్థను. ‘మారదు లోకం మారదు కాలం’ సామాజిక మార్పు ప్రగతిశీలుర విప్లవ వాంఛ. సమాజం మారదు, మారకూడదనడం సనాతన సంప్రదాయం.
‘బలవంతులే బతుకాలని సూక్తి మరవకుండా శతాబ్దాలు గడవలేదా’ సామాజిక బలహీనులను చంపే అరణ్య సూక్తి శతాబ్దాల నుంచి సాగుతున్నది. ఇక మీదా కూడా కొనసాగాలన్న భావం ఈ పాదంలో ఉన్నది. శివ సినిమాలోని ‘బోటని పాఠముంది..’ పాట చదువుపై విద్యార్థుల అశ్రద్ధను ప్రోత్సహిస్తూ, ఫెయిలయినా సెప్టెంబర్, మార్చి పరీక్షలు రాసుకోవచ్చని సలహా చెపుతోంది. బొబ్బిలి రాజా కోసం రాసిన ‘బలపం పట్టి భామ బళ్ళో ..’ చిలిపిగా ఉందో శృంగారంగా ఉందో నిర్ణయించాలి.
శాస్త్రీయ సంగీత కుటుంబ నేపథ్యం కలిగి అనేక బహుమతులు అందుకున్న దేవిశ్రీ ప్రసాద్ గబ్బర్సింగ్ చిత్రానికి రాసిన పాట, ‘ఏ.. గన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్లా.. ఆవకాయబద్ద లేని మందు కంటే దారు ణం.. ఒక్క నవ్వు ఇవ్వు దాన్ని అమ్ముకుంటే అప్పు బాధ తప్పుతాదే’. ప్రాస కోసం అర్థంలేని పదాలతో పాట రాస్తారా? సారా తాగడానికి ఆవకాయ అవసరమనడం మద్యపానాన్ని ప్రోత్సహించినట్టు కాదా? కాబోయే భార్య, ప్రేమికురాలి నవ్వును అమ్ముకుంటే అప్పు తీరుతుందనడం అర్ధాంగి అంగ ప్రక్రియలను, అవయవాలను అమ్ముకోవచ్చని అర్థం కాదా?
విప్లవ కవి, అభ్యుదయవాది స్త్రీహక్కుల పోరాట యోధుడు గద్దర్ ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై’ పాటలో మల్లెతీగకు పందిరిలా చెల్లికి అవసరమైన ఆధారంగా, అమ్మాయి అనే మసక చీకటికి అన్నయ్య అనే వెన్నెల్లా ఉంటానని, పెండ్లి నాటికి (కట్నానికి) తృణమో పణమో కూడపెడతానని రాయడం విచిత్రం. పాత సినిమాల్లో కులాంతర, మతాంతర సందేశాలు విచిత్రంగా ఉంటాయి. మొదట ఆ యువతీయువకులను విభిన్న కులాల, మతాలవారీగా చూపుతారు. చివర వారు చిన్నతనంలో తప్పిపోయి వేరువేరు కులాలలో, మతాలలో పెరిగిన యువతీయువకులుగా చిత్రీకరిస్తారు. కులగోత్రాలు, మిస్సమ్మ ఈ కోవ చిత్రాలే.
సభల్లో స్త్రీలను వేదికపైకి అరుదుగా ఆహ్వానిస్తారు. వారి భాగస్వామ్యానికి, ప్రాతినిధ్యానికి ప్రాధాన్యం కల్పించరు. సమానత ఇవ్వరు. ప్రగతిశీలమని ప్రచారం చేసుకునే సామాజిక, సాంస్కృతిక సంస్థల్లోనూ, సనాతన ధర్మ పరిరక్షణ సంఘాల్లోనూ ఇదే తీరు. సనాతన ధర్మ నిర్మాణ, నిర్వహణల నిష్ణాతులు పూర్వ పునర్జన్మలు, సంచితకర్మ ఫలితాల కర్మ సిద్ధాంతం వగైరాలను ప్రవక్తీకరిస్తారు. పుణ్యపాపాలు, స్వర్గ నరకాలతో ఆశపెడుతారు, భయపెడుతారు. వైదిక ఆచరణల్లో జనాలను ఇరికిస్తారు. సమాజ నిర్మాణంలోనే గాక సమాజాన్ని మార్చడంలో స్థిర నిబద్ధ పాత్రను పోషిస్తున్న రాజకీయపక్షాల నాయకులు, కార్యకర్తలు కూడా వారసత్వంగా మనసుల్లో పాతుకుపోయిన వైదికవాద పదజాలాన్ని, స్త్రీల విషయాల్లో కూడా, ఆయాచితంగా వాడుతున్నారు.
వర్తమానంపై గతకాల పురుషాధిపత్య అగ్రవర్ణ పెత్తనం భవిష్యత్తుకు అడ్డంకి. ఈ భావజాలానికి నేటి కేంద్ర ప్రభుత్వం ప్రతినిధి. ఈ సూత్రాలతోనే పరిపాలన సాగిస్తోంది. జాతీయ, అంతర్జాతీయ మేధావుల, సంస్థల సూచనలను, విమర్శలను అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. వాటిని తమదైన శైలిలో సనాతనవాదంతో, వాదనలతో తిప్పికొడుతోంది.
మతాల్లో స్త్రీల అణచివేత పద్ధ్దతులు బోలెడు. వైదిక పురాణాలలో, కథలలో సీత, ద్రౌపది, అహల్య, చంద్రమతి వగైరా వనితల పట్ల జరిపిన ఘటనలు అమానవీయాలు. మృగాధికార అవసర కారకాలు. క్రైస్తవం, ఇస్లాం తదితర మతాల్లోనూ ఇలాంటివి ఉన్నాయి. సనాతన ధర్మం పేరుతో జరుగుతున్న వైదికవాద అభివ్యక్తీకరణలన్నీ ప్రగతి నిరోధకాలు. ఈ పితృస్వామ్య భావాలతో సామాజిక, మానవత్వ విలువలు, సమానత్వ హక్కులు దెబ్బతింటాయి.
విశ్వంలో స్వేచ్ఛాస్వాతంత్య్రాలు లేక భయం నీడలో బతికే ప్రాణి మహిళ మాత్రమే. సామ్యవాద దేశాల్లో లైంగిక అసమానతలు లేవు. మహిళా సమానత్వానికి సమసమాజం బీజాలు నాటింది. భారత ఉన్నత న్యాయస్థానం లింగవివక్షల మూసపోత కట్టడికి ఇటీవల ఒక కరదీపికను జారీచేసింది. అందులో మహిళలను మానవీకరించింది. మగబుద్ధి మారనిదే మగువల మర్యాదహీన మనుగడ మారదు.
(వ్యాసకర్త: ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి)
-సంగిరెడ్డి హనుమంతరెడ్డి
9490 20 4545