దళితులు, బీసీలు, మైనారిటీలతో పాటు అగ్రవర్ణాలకు చెందిన నిరుపేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వం విదేశీ విద్య, స్వయం ఉపాధి తదితర పథకాలు ప్రవేశపెట్టి, ఆయా వర్గాలను ఆదుకొన్నది. ఈ 75 ఏండ్లలో రాష్ట్రంలో గానీ, కేంద్రంలో గానీ ఏ ప్రభుత్వం కూడా అగ్రవర్ణ పేదల సంక్షేమం కోసం ఒక్క పథకాన్ని ప్రకటించలేదు. కానీ, తెలంగాణలోని సకలజనుల శ్రేయస్సే ధ్యేయంగా అధికారంలోకి వచ్చిన కేసీఆర్ 2017లో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తును ఏర్పాటు చేసి పేద బ్రాహ్మణుల సంక్షేమం కోసం పాటుపడిన వ్యక్తిగా ఖ్యాతి దక్కించుకొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 2001 కింద బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తున్నది. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఆధ్వర్యంలో మొత్తం 8 పథకాలు అమలవుతున్నాయి. అవి.. వివేకానంద విదేశీ విద్యా పథకం, శ్రీరామానుజ ఫీజు రీయింబర్స్మెంట్, వేద, శాస్త్ర పండితులకు గౌరవ వేతనం, వేదహిత – వేద పాఠశాలలు, వేద విద్యార్థులకు ఆర్థిక సహాయం, సంప్రదాయ పాఠశాల – కంచి కామకోటి పీఠం, ఔత్సాహిక పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు ప్రోత్సాహం, విప్రహిత బ్రాహ్మణ సదనం, తెలంగాణ బ్రాహ్మణ నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షలకు శిక్షణనివ్వడం వంటి కార్యక్రమాలున్నాయి.
విదేశాల్లో చదువుకోవాలనుకునే పేద బ్రాహ్మణ విద్యార్థులు ఆర్థికసాయం పొందేందుకు, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం, పారిశ్రామిక ప్రోత్సాహానికి ఈ పరిషత్తు గత ఆరేండ్లుగా అండదండలు అందిస్తున్నది. కళాశాల ఫీజుల రాయితీలతో పాటు విదేశీ విద్యా పథకాల కింద ఒక్కో విద్యార్థికి రూ.20 లక్షల వరకు సాయం అందించింది. 2023 జనవరిలో ఇంటర్వ్యూలో ఉత్తీర్ణులైన 121 మంది పేద విద్యార్థులకు అప్పటి ప్రభుత్వం విదేశీ విద్యా పథకానికి సంబంధించి మంజూరు పత్రాలు అందించింది. ప్రభుత్వ సాయంపై నమ్మకంతోనే వారంతా బ్యాంకుల్లో రుణాలు తీసుకొని అమెరికా, కెనడా తదితర దేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లారు. ఒక్కొక్కరు రూ.50 లక్షల పైచిలుకు రుణాలు చేసి విదేశాల్లో మాస్టర్స్ చదువుతున్నారు. ప్రస్తుతం వారి ఎంఎస్ పూర్తి కావస్తున్నది కానీ ఇంతవరకు నిధులు వారి ఖాతాల్లో జమ కాలేదు.
విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఫీజు రూ.40 లక్షలపైనే ఉంటుంది. గత జనవరి నుంచి పలుమార్లు అప్పటి ప్రభుత్వాన్ని ఈ విషయం గురించి విన్నవించాం. తీరా నిధులు అందించే సమయానికి ఎన్నికల కోడ్ అడ్డు వచ్చింది. దీంతో మరోసారి నిరాశ తప్పలేదు. ఈ పథక నిధులు ఆపటం వల్ల ఎందరో పేద విద్యార్థులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికే విద్యార్థులు బ్యాంకుల్లో తీసుకొన్న రుణాల వడ్డీని వారి తల్లిదండ్రులు చెల్లిస్తున్నారు.
మంజూరై ఏడాది గడిచినా ఇప్పటివరకు లబ్ధిదారులకు డబ్బు అందలేదు. ప్రాధాన్య క్రమంలో వివేకానంద విదేశీ విద్యా పథకాన్ని విస్మరించటం వల్ల రుణ భారం పెరుగుతున్నది. గత ప్రభుత్వం ఏటా రూ.100 కోట్ల నిధులను కేటాయించేది. ఈ నిధులతోనే వివిధ పథకాలు అమలవడంతో పేద బ్రాహ్మణుల స్థితిగతులు మెరుగయ్యాయి. ప్రభుత్వాలు మారినప్పుడు సంక్షేమ పథకాల విధానాల్లో మార్పులు అనివార్యమే. నామినేటెడ్ పోస్టులను రద్దు చేయడంలో అర్థం ఉన్నది. కానీ, వారితో పాటు లబ్ధిదారులను కూడా తొలగించడం సరైనది కాదు. అలాగే సంక్షేమ పథకాలను రద్దు చేయడం సబబు కాదు.
విదేశాల్లో పీజీ, ఇతర ఉన్నత విద్యా కోర్సులు అభ్యసిస్తున్న వెనుకబడిన తరగతుల (బీసీ),ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఈబీసీ) విద్యార్థులకు మహాత్మా జ్యోతిబాపూలే విదేశీ విద్యా నిధి పథకం కింద ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.20 లక్షలు అందజేస్తున్నది. విద్యార్థుల ట్యూషన్ ఫీజులు, ఇతర ఖర్చుల కోసం ప్రభుత్వం అందించే ఈ ఆర్థిక సాయం ఉపయోగపడుతున్నది. కాగా, మహాత్మా జ్యోతిబాపూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకంలో మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఈ పథకం మార్గదర్శకాలను మార్చేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్టు సమాచారం. మార్పులు చేస్తే చేయండి.. కానీ ఇదివరకే మంజూరు పత్రాలు పొంది విదేశాల్లో చదువుతున్న వారికి మొండిచెయ్యి చూపకూడదు.
గత ప్రభుత్వం ఏటా జనవరిలో 150 మంది,ఆగస్టులో 150 మందిని ఎంపిక చేసి ఆర్థికసాయం చేసింది. దీంతో పాటు వీసా, ప్రయాణ ఖర్చులకు గరిష్ఠంగా రూ.50 వేలు అందించింది. ఇప్పటివరకు ఈ పథకం కింద సుమారు 2,700 మంది విద్యార్థులు లబ్ధి పొందినట్టు తెలుస్తున్నది. ఇదే తరహాలో ఎస్సీ, ఎస్టీలకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద సాయం అందిస్తున్నది. ఈ పథకాలన్నీ అటకెక్కితే పేద విద్యార్థుల కష్టాలు వర్ణనాతీతం.
తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారుల విషయంలో సానుభూతితో వ్యవహరించాలి. ఇప్పటివరకు ఈ పథకాల కింద మంజూరు పత్రాలు పొందినవారికి తక్షణమే నిధులు విడుదల చేసి ఆయా వర్గాల పేద విద్యార్థులను ఆదుకోవాలి. విధివిధానాల్లో మార్పుచేర్పులు చేసే విషయంలో ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ, ఈ పథకం మీద కోటి ఆశలు పెట్టుకొని బ్యాంకుల్లో భారీగా రుణాలు తీసుకొని విదేశాలకు వెళ్లిన పేద విద్యార్థుల ఆశలు అడియాసలు కాకూడదు. ప్రభుత్వాలు మారినా పేదలకు అందే సంక్షేమ పథకాలు మారకూడదు.
– వైనతేయ