పల్లేర్లు కాసిన నేల మీద పసిడి సిరులు.. చెరువు గట్ల మీద మళ్లీ గిజిగాని గూళ్లు.. ఇదీ ఇవ్వాల్టి తెలంగాణ అని ప్రముఖ కవి, ప్రజా గాయకుడు జయరాజ్ అన్నారు. నెత్తురు పారిన తెలంగాణ ఆకుపచ్చని చీరెను కట్టుకున్నదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం అవతరించాకే తెలుగు భాషకు, యాసకు ఔన్నత్యం పెరిగిందని, కవులు, కళాకారులకు గౌరవం పెరిగిందన్నారు. తెలంగాణ అన్నందుకే తనను వేరుగా చూసిన విప్లవోద్యమం ఆ తర్వాత తన దారిలోకి వచ్చిందన్నారు. స్త్రీలను ఆలయాలకు దేవదాసీలుగా సనాతన ధర్మమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఒకే ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక’ అని ఉద్బోధించిన కాళోజీ లాగే తాను బతుకుతానంటున్న జయరాజ్కు రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం పద్మవిభూషన్ కాళోజీ నారాయణరావు పురస్కారాన్ని ప్రకటించింది. కాళోజీ జయంతి సందర్భంగా శనివారం అవార్డు అందుకున్న జయరాజ్ తన అనుభవాలను ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు.
తెలంగాణ ఉద్యమంలో వాన మ్మా.. వాన మ్మా అని పాడినా.. మీకు ఇప్పటి స్థితి.. ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర అనంతర దృశ్యం?
జయరాజ్: కరువు వల్ల చెరువులు ఎండిపోవటం, విపరీతమైన కరువు వల్ల తాటిపండ్లు ఏరుకొచ్చుకొని ఉడకబెట్టుకొని తిన్నం. అలాంటి తెలంగాణ ఈ రోజు ఎక్కడికిపోయినా ఆకుపచ్చని చీరె కట్టుకున్నట్టు కడుపునిండుగా కనిపిస్తున్నది. చెరువుగట్ల మీదా మళ్లీ ‘గిజిగాడి’గూళ్లు కనిపిస్తున్నవి. రాష్ట్రం సాధించటం వల్లనే, కేసీఆర్ లాంటి వాళ్లు పట్టుకొని నడిపించటం వల్లనే సాధ్యమైంది. ‘అలనాడు అశోకుడు చెరువులు తవ్వించెను. చెట్లు నాటించెను అని చెప్పుకొన్నాం.. మీరా పనిచేస్తున్నరు. సంతోషమైతాంది’ అని కేసీఆర్తో అన్నపుడు మురిసిపోయిండు. అయితే అన్ని సమస్యలు ఒక్కపారే తీరుతాయా అంటే తీరకపోవచ్చు. కరువు, ఆకలిచావులు, రైతు ఆత్మహత్యల నుంచి తెలంగాణ బయటపడగలిగింది. అదే ఒక విజయం.
ప్రజల గొడవనే తన గొడవగా స్వీకరించి జీవితాంతం ప్రజల కోసం అక్షర సేద్యం చేసిన ప్రజాకవి కాళోజీ అవార్డును అందుకుంటున్న ఈ సందర్భంలో మీ స్పందన… జయరాజ్: కాళోజీ తెలంగాణకు తండ్రిలాంటివాడు. తన జీవితకాలమంతా ప్రజల కన్నీళ్లు.. దుఃఖం, యాస, భాష, అణచివేత వంటి అనేక అంశాలపై ప్రజల బాధనే తనబాధగా భావించాడు. అలాంటి మహనీయుడు కాళోజీ వెంట తిరిగాను. బహుశా అందువల్లనే విప్లవోద్యమానికి అద్భుతమైన పాటలు రాశానేమో. తెలంగాణ ఉద్యమం మీద, సామాజిక ఉద్యమాల మీద, ప్రకృతి తత్వాన్ని అర్థం చేసుకొని ఆ ప్రకృతి వనరులు ప్రజలకు దక్కాలని నా జీవితకాలం కొట్లాడాను. ప్రజ ల్లో ఉండే హెచ్చుతగ్గులు, వివక్ష, అజ్ఞానాంధకారాలు పోవాలని ప్రజల యాసను, ప్రజల భాషను ప్రజా జీవితాలను ధారపట్టి పాటలు రాస్తున్నాను. ఇది నాకు కాళోజీ అందించిన అడుగుల చప్పుడు.. ఆయన చూపిన తొవ్వ.
కాళోజీతో మీకున్న అనుబంధం ?
జయరాజ్: కాళోజీతో నాకు బాగా సాన్నిహిత్యం ఉన్నది. కవిగా, పౌరహక్కుల ఉద్యమనాయకుడిగా నాకు అనుబంధం ఉన్నది. ఆ మహనీయుడి పేరుతో నెలకొల్పిన అవార్డు తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ నాకు ఇవ్వటం.. ధిక్కారానికి ప్రతీకగా నిలిచిన కాళోజీతో నన్ను పోల్చిచూడటమనేది నా జీవితంలో మరచిపోలేను. ఇది దేశంలోనే అత్యం త ప్రతిష్ఠాత్మకమైన అవార్డుగా భావిస్తాను.
సాహిత్యంలో అనేక ప్రక్రియలున్నా మీరు పాటనే ఎంచుకోవటంలో ఆంతర్యం ఏమిటీ?
జయరాజ్: సాహిత్యంలో అనేక ప్రక్రియలున్నాయి. అవన్నీ అక్షరజ్ఞానం ఉన్నవాళ్ల దగ్గరికి చేర్చే సాధనాలు. కానీ, లక్షలాది మంది ప్రజలను అదీ నిరక్షరాస్యులైన ప్రజల్లోకి వెళ్లాలంటే పాట ఒకటే ఆయు ధమని నమ్మాను. ప్రపంచంలోనే పాట కు ఆయువుపట్టు, పుట్టినిల్లు తెలంగాణ. కనుకనే పాటను ఎన్నుకొని, దానికొక రాగం, అభినయాన్ని ఎన్నుకొని లక్షలాదిమందిని ప్రభావితం చేశాననే విశ్వాసం నాకున్నది. నిజం చెప్పాలంటే పాట రాయగలిగినవాడే కవి. అట్లా చూసినప్పుడు గద్దరన్న మహాకవి, దాశరథి గొప్పకవి, కాళోజీ, గూడ అంజన్న, గోరెటి వెంకన్న, జయరాజ్, అందెశ్రీ ఇట్లా అనేకమంది ప్రజా కవులు లేదా వాగ్గేయకారులుగా తెలుగు సాహిత్యంలో అజరామరంగా నిలిచిపోతారు.
మీ రచనా వ్యాసంగంలో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసినవారెవరు?
జయరాజ్: ‘ఒకే ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక’ అనే కాళోజీ లైన్ నన్ను బాగా ప్రభావితం చేసింది. దాశరథి రాసిన ‘ఆ చల్లని సముద్ర గర్భం’ అంటే ఇష్టం. ‘గాయపడిన కవిగుండెలలో రాయబడని కావ్యాలెన్నో? అని చెప్పిన దాశరథి, కాళోజీ నా ఊరి వాళ్లు.. నా ఇంటివాళ్లు. ఇద్దరికీ అస లు సిసలు వారసుణ్ని నేనే. వాళ్లందించిన కలాన్ని వెంటబెట్టుకొని తిరుగుతు న్న. వాళ్లేవిధంగా జీవిత కాలం ప్రజల కోసం కొట్లాడిర్రో.. నేనూ అలాగే..
శ్రీరాంపూర్ స్టేజీ మీద నెత్తురుచాళ్ల నేపథ్యాన్ని చెప్తారా?
జయరాజ్: నాడు తెలంగాణలో భయంకరమైన కరువు. తెలంగాణ పోరాటంలో భాగంగా నేనూ, గద్దరన్న మణుగూరు నుంచి ఆదిలాబాద్ దాకా చేపట్టిన యాత్ర. తెలంగాణ రాష్ట్రం సిద్ధించటం కోసం మా వంతుగా పనిచేశాం. ఈ క్రమంలో శ్రీరాంపూర్లో సభ. అప్పటికే ఆపరేషన్. ఒళ్లంతా పచ్చిపుం డు. స్టేజీ మీద పాటుపడుతున్న ‘వానమ్మా.. వానమ్మా ఒక్కసారన్నా వచ్చిపోయే వచ్చిపో యే వానమ్మా’.. జనం నుంచి మళ్లీ పాడాలి. గట్టిగా పాడాలని కేకలు. నినాదాలు.. ప్రజల కోరిక మేరకు గట్టిగా గొంతెత్తి పాడుతున్నప్పుడు కుట్లు తెగి స్టేజీ అంతా రక్తపు మడుగే. ఆ తర్వాత ఆస్పత్రి.
తెలంగాణ రాష్ట్రం అవతరించకముందూ తర్వాత కవి, గాయకులకు లభిస్తున్న ఆదరణపై మీ కామెంట్?
జయరాజ్: తెలుగమ్మ నుదుట సింధూరం అద్దిన తెలంగాణ కవులను, సాహితీకారులను ఆంధ్రా వలసవాదులు కుట్రలు పన్నుతున్నప్పుడు దానికి వ్యతిరేకంగా కొట్లాడినం. జానపద జాబిల్లి పూసిందిరా/ పల్లె పల్లెంత ఒళ్లు ఇరిసి ఆడిందిరా, తెలుగమ్మ నుదుటికి సిం ధూరం అద్దిన తెలంగాణ కవుల జాడేదిరా? అని పాడుకున్నం. ‘మా కాళ్లల్లో గోదారి పారుతున్నా/ మా కండ్లల్లో కృష్ణమ్మ కదులుతున్నా/ మా గుండెల్లో దాహాలు మాత్రం తీరలేదని బాధపడ్డం. కానీ, తెలంగాణ రాష్ట్రం రావడం వల్ల.. మన భాష ఔన్నత్యం పెరిగింది. అం దుకే మనవాళ్లకే అవార్డులు వస్తున్నాయి. మా లాంటి వాళ్లం వాటిని పొందగలుగుతున్నాం.
తెలంగాణంటే ఒక ఉగ్రవాది. తెలంగాణ అంటే తీవ్రవాది అన్న సందర్భంలో తెలంగాణ కోసం ఉద్యమించాలె అన్న ధైర్యం ఎక్కడిది?
జయరాజ్: తెలంగాణ కోసం ఉద్యమించే సమయంలో నేను పనిచేసే విప్లవ పార్టీలో కూడా తెలంగాణ కోసం నిర్ణయం తీసుకోవాలని నేను కొటాడిన. వాళ్లు తీసుకోలేదు. నేను తెలంగాణ అన్నందుకే విప్లవోద్యమం నన్ను వేరుగా చూసింది. కానీ, అనంతరం తెలంగాణ ఉద్యమానికి వాళ్లు కూడా సపోర్ట్ చేశా రు. నేను వాళ్లను ప్రభావితం చేయగలిగిన. తెలంగాణ వచ్చిన తర్వాత మల్లా ఏ సామాజికవర్గం నుంచి వచ్చానో ఆ సామాజిక వర్గం కోసం రాయటం మొదలుపెట్టాను.
బుద్ధుడి మీద దేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ నుంచే బౌద్ధ గానాన్ని వినిపించిన. బాబాసాహెబ్ అంబేద్కర్ మీద, జ్యోతిబాపూలేమీద… సావిత్రీబాపూలే మీద అప్పటిదాకా తెలుగు సాహిత్యంలో వీరిపాటల్లేవు. నేను సామాజిక పాటల విప్లవానికి పునాది వేశాను. నేను రాసిన పాటలన్నీ హిందీ, కన్నడ సహా అన్ని భాషల్లోకి వచ్చాయి. దేశంలో అంబేద్కర్, పూలే జయంతి, వర్ధ్దంతులకు బౌద్ధ ఆరామాలల్లో వినిపించేవి తెలంగాణ జయరాజ్ పాటలే.
విప్లవోద్యమం, తెలంగాణ, సింగరేణి , సామాజిక ఉద్యమం ఇలా అనేక ఉద్యమాలతో జయరాజ్ మమేకం కావటమే కాకుండా కొనసాగింపునకు నేపథ్యం ఏమిటీ?
జయరాజ్: కొందరు వి ప్లవోద్యమం దగ్గర, కొంద రు తెలంగాణ ఉద్యమంతో ఆగిపోయారు. ఇక నా కొనసాగింపునకు నేపథ్యం ఏమిటంటే నాలోని గౌతముడు, అంబేద్కర్, మార్క్స్ చెప్పి న గతితార్కిక భౌతికవాదం నన్ను నిలువనీయటం లేదు. అసమానతలు, అవమానాలు, లింగవివక్ష ఇవన్నీ నన్ను ప్రభావితం చేస్తున్నాయి. గాలి, నీరు, వెలుగు, వెన్నెల, భూమి అంతా అందరికీ చెందాలన్నది ప్రకృతి ధర్మం. అదే నీతి. అందుకే నేను నేచరే గొప్ప కమ్యూనిస్టు అంటాను. పరిశ్రమల్లో జీతం పెరగటం కాదు వాటా పెరగాలని చెప్పిన సామ్యవాది అంబేద్కర్.
ఉద్యమకాలంలో వచ్చిన సాహి త్యం రాష్ర్టానంతరం రావటం లేదని, ట్రాన్స్ఫాం అవుతున్న తెలంగాణను కవులు, కళాకారులు అక్షరీకరించటం లేదనే వాదనకు మీ కామెంట్?
జయరాజ్: సాధారణంగా కవులు సల్లకదలకుండా ఉన్నప్పుడు మెల్లగా ఉంటారు. కవి కి కష్టాలే వరం. కష్టాలున్నప్పుడే అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించగలుగుతాడు. అయితే దుఃఖం మనిషికి ఎప్పటికీ ఉంటది. సుఖం అల లాగా వచ్చిపోతుంటది. కనుక ఆ సుఖా న్ని కూడా కవులు ఆస్వాదించాలె.
మీ సినిమా పాటల ప్రస్తావన గురించి ..
జయరాజ్: దండోరా సినిమాలో ‘కొండ ల్లో కోయిల పాటలు పాడాలి.. పల్లెల్లో అక్షరజ్యోతులు వెలుగాలి, అడవిలో అన్న సినిమా లో ‘వందనాలమ్మా…నీకు వందనాలమ్మా’ పాటలు జేసుదాసు పాడారు. దాదాపు 25 సినిమాలకు పాటలు రాశాను. నారాయణమూర్తి ఎక్కువ అవకాశాలు ఇచ్చారు.
మీకు బాగా నచ్చిన పాటలు?
జయరాజ్: ప్రపంచవ్యాప్తంగా నాకు పేరుతెచ్చిన పాట ‘శిలా నీవే శిల్పం నీవే. నా స్నేహితుడు చనిపోయినప్పుడు రాసిన ‘స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, అలాగే నాయినా మీద ‘నాయినా.. ఓ నాయిన నీ మట్టికాళ్లకు దండ మే. వీటితోపాటు ‘చెలీ నీ కన్నులలో వెన్నెల కురియాలి వంటి అనేక పాటలు నాకు ఇష్టం.ఇంకా గూడ అంజన్న రాసి న ‘అసలేటి వానల్లో ముసలెడ్లా కట్టుకొని/ మడికట్లు దున్నుతే/ గుమ్ము లెవరివి నిండెరా, అట్లనే గద్దరన్న సిరిమల్లెచెట్టు కిందా లచ్చుమమ్మో లచ్చుమమ్మా, ఇట్లాంటి పాటలు మానవ శ్రమజీవితం ఉన్నంతకాలం వర్ధ్దిల్లుతూనే ఉంటాయి.
-ఇంటర్వ్యూ:నూర శ్రీనివాస్
91827 77011