అరకొర వనరులు, వసతులతో చాలాకాలంగా నడుస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) జాతీయస్థాయిలో 15 ర్యాంకులు ఎగబాకి 2021-2022కి గాను 22వ స్థానం దక్కించుకున్నది. టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చే ‘ఎమర్జింగ్ ఎక్సలెన్సీ అవార్డు-2022’ను కూడా అందుకోవడం విశేషం. దేశంలోని రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నడిచే యూనివర్సిటీల్లో ఏ యూనివర్సిటీ సాధించని ఘనతను ఓయూ సాధించడం గొప్ప విషయం. ఒకవైపు ఓయూ పూర్వ వైభవాన్ని పొందుతుంటే, మరోవైపు కొందరు విద్యార్థులు తొలుత పీహెచ్డీ అడ్మిషన్ నోటిఫికేషన్ ఇవ్వాలని, ఆ తర్వాత తమకు అనుకూలంగా నియమ, నిబంధనలను మార్పుచేయాలని, ఫీజు పెంపుపై వాస్తవాలకతీతంగా ఆందోళన చేస్తున్నారు. కొంతమంది వ్యక్తిగత లబ్ధి కోసం సమస్య మూలాలను వదిలి ఈ ఆందోళనను ‘ఉస్మానియా వైస్ ఛాన్స్లర్ వర్సెస్ విద్యార్థులు’గా మారుస్తున్నారు. విద్యార్థుల ధర్నాలు, అడ్మినిస్ట్రేషన్ మౌనం కారణంగా ఓయూలో ఒక అనిశ్చితి ఏర్పడింది.
ఈ క్రమంలోనే అసలు వాస్తవాలను పరిశీలిద్దాం.ఓయూలో పీహెచ్డీ కోర్సు ప్రారంభం నుంచి 2005 వరకు చాలామంది ప్రొఫెసర్లకు పరిశోధన గైడ్షిప్ ఉన్నప్పటికీ పీహెచ్డీ సీట్లు మాత్రం చాలా ఖాళీగా ఉండేవి. పరిశోధక విద్యార్థులను ఎంచుకునే పూర్తి స్వేచ్ఛ కూడా ప్రొఫెసర్లకు ఉండేది. పరిశోధన ప్రతిపాదన, రచన, ఇంటర్వ్యూల కచ్చితమైన నియ మ, నిబంధనల మూలంగా కేవలం కొద్దిమంది విద్యార్థులే పరిశోధన కోర్సుల పట్ల ఆసక్తి చూపేవారు. విద్యార్థులు పీహెచ్డీ పూర్తిచేయటానికి అయ్యే ఖర్చు, సమయం, థీసిస్ రచనా సామ ర్థ్యం, ఉద్యోగ అవకాశాలు బేరీజు వేసుకొని, ప్రొఫెసర్లు పీహెచ్డీ సీటు ఇస్తామన్నా, ఆ కష్టా న్ని మోయలేక పారిపోయేవారు, మధ్యలో ఆపివేసేవారు. నూటిలో ఒక్కరు మాత్రమే కోర్సు పూర్తిచేసేవారు.
ఇక 2006లో యూపీఏ ప్రభుత్వం పరిశోధక విద్యార్థులకు నెలకు సగటున రూ.30 వేల రాజీవ్గాంధీ ఫెలోషిప్ ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టింది. దీంతో పీహెచ్డీ కోర్సులకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ ఫెలోషిప్లను మెరిట్ (అర్హత పరీక్ష) ఆధారంగా కాకుండా ర్యాండమ్ పద్ధతిలో ఎంపిక చేయడంతో నైపుణ్యం లేని విద్యార్థులు కూడా పీహెచ్డీ కోర్సులకు అప్లికేషన్లు పెట్టుకోవడం పరిపాటిగా మారింది. వాస్తవానికి పరిశోధన చేయాలనుకునే విద్యార్థులు ఎంఫిల్ కోర్సు పూర్తిచేసి పీహెచ్డీ కోర్సుల్లో చేరే సంప్రదాయం ఎక్కువగా ఉండేది. ఈ కోర్సు ప్రవేశాలు అర్హత పరీక్షలో అభ్యర్థులు సాధించిన ర్యాంకు ఆధారంగా జరిగేవి. కాబట్టి మెరిట్ ఏ దశలోనూ దెబ్బ తినలేదు. యూజీసీ ప్రకటించిన ఫెలోషిప్ల మూలంగా ఎంఫిల్ కోర్సును చేయకుండా నేరుగా పీహెచ్డీ కోర్సు చేసుకునే సంప్రదాయం మొదలైంది. చివరికి యూజీసీ ఎంఫిల్ కోర్సును ఎత్తివేసింది.
తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న 2010 ప్రాంతంలో ఓయూ నిర్వహించిన పీహెచ్డీ అర్హత పరీక్ష అప్పట్లో పెద్ద వివాదమైంది. కారణమేమంటే అర్హత పరీక్షలో 40 శాతం మార్కులు సాధించిన విద్యార్థులను క్వాలిఫైడ్ అభ్యర్థిగా పరిగణించారు. వారిని పీహెచ్డీ అడ్మిషన్ ఇంటర్వ్యూలకు సంబంధిత డీన్ కార్యాలయాలకు పిలిచి, అభ్యర్థుల పరిశోధక అంశం, రీసెర్చ్ మెథడాలజీ, రచన, ఆలోచనల సామర్థ్యాలను బేరీజు వేసి మెరిట్ లిస్టులను తయారుచేసి అడ్మిషన్ ఇచ్చేవారు. ఆ ప్రవేశ పరీక్షల్లో 40 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు తెలంగాణ ఉద్యమ కార్యకలాపాల మూలంగా పరీక్షల్లో సరైన మార్కులు సాధించలేకపోయామన్న అంశాన్ని కారణంగా చూపిస్తూ క్వాలిఫయింగ్ మార్కులను తగ్గించాలని డిమాండ్ చేశారు. మార్కుల తగ్గింపు పోరాటం హింసాత్మకంగా మారటంతో అప్పటి యూనివర్సిటీ అధికార వర్గాలు 20 మార్కులను తగ్గించాయి. దీంతో పీహెచ్డీ కోర్సులు విద్యార్థి నాయకులకు రాజకీయ అడ్డాగా, కొంతమందికి ఫెలోషిప్ అందించే ఆదాయ వనరులుగా మారాయి. నాటినుంచి పీహెచ్డీ అంటేనే చర్చలు, రచ్చలు, సంఘర్షణలు…
ప్రొఫెసర్ డి.రవీందర్ 2021లో ఓయూ వీసీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పీహెచ్డీ కోర్సులను స్ట్రీమ్లైన్ చేసే ప్రక్రియలో భాగంగా, నిర్ణీత గడువు తీరిన పీహెచ్డీ అడ్మిషన్లను 31-12-2022తో రద్దు చేస్తామని ఆర్డర్ తీసుకువచ్చారు. థీసిస్ సమర్పించుకునేవారికి ఆరు నెలల గడువు ఇచ్చారు. ఆ తర్వాత విద్యార్థుల కోరిక మేరకు మరో 6 నెలల గడువును పెంచారు. ఫలితంగా మధ్యలో ఆగిపోయిన సుమారు 800 థీసిస్లు సమర్పించబడ్డాయి… యూనివర్సిటీ మీదున్న ఓవర్ బర్డెన్ను తగ్గిస్తూ, కొత్త నోటిఫికేషన్తో వచ్చే విద్యార్థులకు సీట్లు, హాస్టల్ వసతులు కల్పించడానికే ఈ నిర్ణయం తీసుకున్నారు.మరో సంస్కరణలో భాగంగా 40 శాతం మార్కులు పొందిన జనరల్, 35 శాతం మార్కులు పొందిన బీసీ, 30 శాతం మార్కులు పొందిన ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్వాలిఫైడ్ అభ్యర్థులుగా గుర్తిస్తూ, ఇంటర్వ్యూ నిర్వహించే ‘టెస్ట్ ఆఫ్ కాలిఫయింగ్’ పద్ధతి స్థానంలో, ప్రవేశ పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా ‘టెస్ట్ ఆఫ్ మెరిట్’ పద్ధతిని ప్రస్తుత వీసీ ప్రతిపాదించారు. నిజానికి దేశవ్యాప్తంగా జరుగుతున్న అన్ని అడ్మిషన్లు ఈ ‘టెస్ట్ ఆఫ్ మెరిట్’ పద్ధతిలో నే జరుగుతాయి. ఉస్మానియా గతంలో ఎంఫి ల్, నేడు పీజీ కోర్సులకు కూడా ఈ పద్ధతినే అవలంబిస్తున్నది.
‘టెస్ట్ ఆఫ్ క్వాలిఫైయింగ్’ పద్ధతిలో కనీసం 40 మార్కులు పొందినవారు, అదే పరీక్షలో 80-90 శాతం మార్కులు పొందిన విద్యార్థుల తో సమానంగా అర్హత పొందుతారు. మార్కుల వ్యత్యాసాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం వల్ల మెరిట్ దెబ్బతింటుంది. ప్రవేశ పరీక్షతో కనీ స అర్హత మార్కులు సాధించి, ఇంటర్వ్యూలలో కృత్రిమంగా సృష్టించిన పరిశోధనా పత్రాలను జోడించి, పైరవీల ద్వారా అడ్మిషన్లు పొందాలనుకుంటున్న యాంటీ మెరిట్ విద్యార్థి వర్గాలు వారికి అనుకూలంగా లేని ‘టెస్ట్ ఆఫ్ మెరిట్’ పద్ధతిని వ్యతిరేకించాయి. మెరిట్ను ప్రోత్సహిస్తున్న వైస్ ఛాన్స్లర్ను నియంతగా దూషిస్తున్నప్పటికీ, యూజీసీ -2022 పీహెచ్డీ నియమావళి ప్రకారం కేటగిరీ-1 కింద నేషనల్ జూనియర్ ఫెలోషిప్ సాధించిన విద్యార్థులకు దక్కవలసిన 60 శాతం వాటాను, మిగిలిన 40 శాతాన్ని ‘టెస్ట్ ఆఫ్ మెరిట్’ పద్ధతిలో పైరవీలకు ఏ మాత్రం తావులేకుండా రూల్ ఆఫ్ రిజర్వేషన్ను పాటిస్తున్న అడ్మిషన్లు ఆయన కల్పించారు. కొందరు వ్యక్తులు అమాయక విద్యార్థులను, నాయకులుగా చేస్తామంటూ సత్యదూర వాదనలను తెరపైకి తెస్తూ అకడమిక్ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు.
రెండు దశాబ్దాల తర్వాత పెంచిన పీహెచ్డీ కోర్సు ఫీజులను కూడా ఇదే తరహాలో కొందరు వ్యక్తులు కావాలనే రాజకీయం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఓయూను, సెంట్రల్ యూనివర్సిటీల ఫీజులతో పోల్చుతూ సామాన్య విద్యార్థులను మభ్యపెడుతున్నారు. మన రాష్ట్రంలో జేఎన్టీయూ, పొరుగు రాష్ర్టాల్లోని బెంగళూరు, అన్నామలై యూనివర్సిటీలు
సగటున రూ.20 నుంచి 40 వేలను ఫీజుల రూపంలో వసూలు చేస్తున్నారనే వాస్తవాన్ని వారు ఎక్కడా చెప్పకుండా, కేవలం ఓయూ దేశవ్యాప్తంగా అధిక ఫీజును వసూలు చేస్తుందని బద్నాం చేసే పనిలో ఉన్నారు. గతంలో పీజీ విద్యార్థుల ట్యూషన్ ఫీజు పెంచారు. పెంచిన ఫీజును ప్రభుత్వమే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా చెల్లించింది. తద్వారా ఓయూలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుదలకు సహాయపడింది. ఇప్పుడు కూడా పెరిగిన పీహెచ్డీల ఫీజులను రీయింబర్స్మెంట్ పథకం ద్వారా ప్రభుత్వం చెల్లిస్తుందన్న విషయాన్ని అందరూ గమనించాలి.
(వ్యాసకర్త: విజిటింగ్ స్కాలర్, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్, అమెరికా)
వాస్తవానికి పీహెచ్డీ కోర్సులో నిర్ణీతకాలం అంటూ ఏదీ లేదు. కానీ, పరిశోధక విద్యార్థి కేవలం నాలుగేండ్లే హాస్టల్,
ఫెలోషిప్, ఇతర వనరులు ఉపయోగించుకోవాలి. ఒకవేళ నాలుగేండ్ల తర్వాత సదరు విద్యార్థి థీసిస్ సమర్పించాలనుకుంటే గైడ్, డీన్ రెకమండేషన్తో ఆ థీసిస్ యూనివర్సిటీ స్టాండింగ్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరిగా పొందాలి.