మొత్తం 40 ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 5,544 మంది ఉద్యోగులను క్రమబద్ధీకరించింది తెలంగాణ ప్రభుత్వం. 2023 ఏప్రిల్ 30న సరిగ్గా మేడేకు ఒక రోజు ముందు నూతన సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫైల్పై సంతకం చేశారు. ఆ వెంటనే ఆర్థికశాఖ
జీవో 38ను జారీ చేసింది.
తెలంగాణ ఉద్యమంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొన్న సమయంలోనే ఉద్యమనేత కేసీఆర్ స్వరాష్ట్రంలో కాంట్రాక్టు వ్యవస్థకు చరమగీతం పాడుతామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంట నే ఆ దిశగా చర్యలు చేపట్టారు. కాంట్రాక్ట్ లేబర్ చట్టం 1970లో భారతదేశమంతటా అమలులోకి వచ్చింది. 20 లేదా అంతకంటే ఎక్కువమంది ఉద్యోగులున్న సంస్థల యాజమాన్యాలకు అనుకూలంగా ఇది అమల్లోకి వచ్చింది.
రెగ్యులరైజేషన్ అంటే కాంట్రాక్ట్ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా మార్చే ప్రక్రియ. వారికి ఉద్యోగ భద్రత ప్రయోజనాలు, కెరీర్ వృద్ధికి అవకాశాలను ఇది అందిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ వారికి శాశ్వత ఉద్యోగులతో సమానమైన ప్రయోజనాలను అందిస్తున్నది.
పాత రోజుల్లో ఉద్యోగాలు ఎక్కువ, అర్హులైన అభ్యర్థులు తక్కువ. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఉద్యోగాలతో పోల్చినప్పుడు అర్హత గల అభ్యర్థులు అధిక సంఖ్యలో ఉంటున్నారు.
ప్రభుత్వం శాశ్వత ఉద్యోగులతో సమానంగా రెగ్యులర్ చేయడం వల్ల కాంట్రాక్ట్ ఉద్యోగులలో అభద్రత భావం పోతుంది. హెచ్ఆర్ఏ, డీఏ, పీఆర్సీ, మెడికల్, ఈహెచ్ఎస్, మెడికల్ లీవు, ఈఎల్స్, జీపీఎఫ్, చైల్డ్కేర్ లీవ్ మొదలైన ఆర్థికపరమైన ప్రయోజనాలు కలిగి, ఉద్యోగి ఇంకా అంకిత భావంతో పనిచేయగలడు. పద వీ విరమణ వయస్సు 61 సంవత్సరాలకు పెరు గటం, పదోన్నతులు రావడం, వేతనం గణ నీయంగా పెరగటం వంటి ఇతర ప్రయోజనా లు కూడా లభిస్తాయి.
తెలంగాణ ప్రభుత్వం చరిత్రలో తొలిసారిగా శాశ్వత ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులకు పీఆర్సీని వర్తింపజేసింది. 2021 జూన్ 17న జీవో-105 ద్వారా పీఆర్సీ ప్రకారం వేతనాలు పెంచింది. డిగ్రీ అధ్యాపకులకు జీవో 104 ద్వారా, పాలిటెక్నిక్ అధ్యాపకులకు జీవో 106 ద్వారా వేతనాలు పెంచింది. క్రమబద్ధీ కరణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వేలాది కుటుంబాల్లో సంతోషం నింపింది. తెలంగాణలో కాంట్రాక్టు వ్యవస్థకు చరమగీతం పాడుతామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ అక్షరాల అమలవుతున్నది.
(వ్యాసకర్త : రిటైర్డ్ ప్రిన్సిపల్)
– సీవీవీ ప్రసాద్ 80196 08475