ఒకప్పుడు సినిమా అంటే ఓ ఎమోషన్. సినిమా థియేటర్ ఓ జ్ఞాపకం. సినిమా అంటే చాలు జనం ఎగబడేవారు. పల్లెటూర్ల ప్రజలు ఏకంగా ఎడ్ల బండ్లు కట్టించుకొని మరీ థియేటర్లకు వెళ్లేవారు. ఆ కాలంలోనే మాయాబజార్, లవకుశ లాంటి సినిమాలు రజతోత్సవం, శతదినోత్సవాలు జరుపుకొన్నాయి. కానీ, ఇప్పటి సినిమాలు పట్టుమని పది రోజులైనా ఆడటం లేదు. నాడు ఓ వెలుగు వెలిగిన థియేటర్లు నేడు కళ తప్పాయి. టూరింగ్ టాకీస్లు, నేల టిక్కెట్, గోడలపై పోస్టర్లు.. ఇలా ఒక్కొక్కటి తెరమరుగయ్యాయి. నూతన టెక్నాలజీతో పాటే ‘తెర’పైకి వచ్చిన మల్లీప్లెక్స్, ఓటీటీ సంస్కృతి సింగిల్ స్క్రీన్ థియేటర్లను అమాంతం మింగేసింది.
వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించే సినిమా రంగం కళ తప్పింది. టెక్నాలజీ అందుబాటులో వచ్చాక నాణ్యత, సహజత్వం పెరగాల్సిందిపోయి సినిమాలు మరింత నాసిరకంగా తయారవుతున్నాయి. ఈ తరం అభిరుచులకు అనుగుణంగా కథల్లో మార్పులంటూ వచ్చిన నయా పోకడ కారణంగా కథ, కథనంలో అసహజత్వం, అతిశయోక్తి వచ్చి చేరాయి. దీంతో ప్రేక్షకులకు సినిమాలు దూరమైపోయాయి. నాటి నటులు, దర్శకులు సినిమా నిర్మాణాన్ని మహాయజ్ఞంగా భావించేవారు. సహజత్వం కోసం పరితపించేవారు. చిత్రీకరణ పట్ల రాజీపడేవారు కాదు. ఎంతో అంకితభావంతో పనిచేసే నాటి దర్శక, నిర్మాతలు తమ సినిమాల్లో అసభ్యత, అశ్లీలతకు చోటిచ్చేవారు కాదు.
కాలం మారింది, కాలంతో పాటే కథలూ మారాయి. ప్రస్తుతం ఏ సినిమా చూసినా హీరో, హీరోయిన్ల చుట్టే కథలు తిరుగుతున్నాయి. కమర్షియల్ హంగులు తప్ప వినోదం, విజ్ఞానం అనేమాటే లేకుండాపోయింది. కుటుంబ విలువలు, బాంధవ్యాల ప్రస్తావనే లేదు. పైగా నిర్మాణ ఖర్చులో మూడొంతులు హీరో, హీరోయిన్ల రెమ్యునరేషన్కే కేటాయించాల్సి వస్తున్నది. దీంతో మిగిలిన ఒక వంతుతోనే సినిమా నిర్మాణం చేపట్టాల్సిన పరిస్థితి దాపురించింది. ఈ కారణంగా సినిమాలో కథ, కథనాలకు చోటే దక్కడం లేదు.
మూసధోరణిలో వరుసపెట్టి వస్తున్న సినిమాల కారణంగా ప్రేక్షకుడు థియేటర్లకు రావడమే మానేశాడు. అదే సమయంలో మల్టీప్లెక్స్లు, ఓటీటీల రాకతో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కరూ అడుగు పెట్టడం లేదు. విపరీతంగా పెరిగిన ఖర్చులను భరించలేక సినిమా టాకీస్లు మూతబడుతున్నాయి. వాటి స్థానంలో మల్టీప్లెక్స్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు పుట్టుకొస్తున్నాయి. దీంతో ఒకప్పుడు వినోదాన్ని అందించిన సినిమా హాళ్లు వ్యాపార స్థావరాలుగా మారిపోయాయి. దోపిడీకి గురవుతున్న ప్రేక్షకుడు సినిమా థియేటర్ వైపు కన్నెత్తి చూడటం లేదు. ఇది ఎంత వరకు వచ్చిందంటే తెలంగాణలో ఏకంగా 10 రోజుల పాటు థియేటర్లను మూసివేసేంత.
ఇది సింగిల్ స్క్రీన్ థియేటర్ల సమస్య మాత్రమే కాదు. సినిమా ఇండస్ట్రీ మొత్తానికి సంబంధించినది. కథలో విషయం ఉంటే ప్రేక్షకులు ఇప్పటికీ ఆదరిస్తారని రుజువవుతూనే ఉన్నది. కథ, కథనం సరిగ్గా ఉంటే కుటుంబ కథా చిత్రాలను ఇప్పటికీ, ఎప్పటికీ ప్రేక్షకులు ఆదరిస్తారని బలగం సినిమా మరోసారి రుజువు చేసింది. ఈ నేపథ్యంలో సినీ రచయితలు కొత్త కథలను అన్వేషించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా మేలుకోకపోతే నాటకాలు అంతరించిపోయినట్టే.. సినిమా కూడా అంతరించిపోవడం ఖాయం.
జోస్యుల వేణుగోపాల్
94404 36806