స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడుస్తున్నప్పటికీ భారత రాజ్యాంగంలోని 340, 341, 342 ఆర్టికల్స్ పూర్తిగా అమలు కాకపోవడం వల్ల బహుజనులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీసీల సంఖ్యకు తగినట్టు రిజర్వేషన్లు లేకపోవడం మూలంగా విద్య, ఉద్యోగాల్లో వెనుక బాటుకు గురవుతున్నారు. బీసీల జనాభాకు తగినట్టు రిజర్వేషన్ కోసం కుల గణన చేయా లని అనేక సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అందుకే బీసీ జనగణన కోసం మరో జాతీయోద్యమం తప్పదు.
బీసీలు కోరుకుంటున్నది మతం కాదు, సమానత్వం. సమాజంలో సగానికి పైగా ఉన్న బీసీలకు న్యాయం కావాలి. కేంద్ర ప్రభుత్వం మతాన్ని, మతపరమైన అసమానత్వాన్ని ముందుకు తెస్తున్నది. మతం కాదు మాకు పరిపాలనలో భాగస్వామ్యం కావాలని బడుగు జనులు అడుగుతున్నారు. బీసీలను కేంద్రం చులకనగా చూస్తున్నది. బీసీల న్యాయబద్ధమైన డిమాండ్లను అమలు చేయకుండా నిర్లక్ష్యంగా, నిరంకుశంగా ప్రవర్తిస్తున్నది. దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా బహుజన సమూహాలు ఒక్కటి కావలసిన సమయం ఆసన్నమైంది. దేశ రథచక్రాలను నడిపే బహుజనులు తమకు రిజర్వేషన్లు పెంచమని అడుగుతుంటే కేంద్ర పాలకులకు చీమ కుట్టినట్టయినా లేదు. బీజేపీది బడుగు బలహీనవర్గాల వ్యతిరేక భావజాలం. అందుకే బీసీ జనగణన విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నది.
బీసీ జనగణన అంటే దేశంలో సగానికి పైగా ఉన్న జనాభా గణన అని మొరపెట్టుకుని అడిగినా కేంద్రం వినటం లేదు. దేశంలో చెట్ల లెక్క లు, పుట్టలు, గుట్టలు, జంతువుల లెక్కల న్నీ ఉంటాయి. బీసీల జనాభా లెక్కలు మాత్రం ఉండవు. దేశంలో ఏ రకమైన మార్పు లు రావాలన్నా మొదట రావల్సింది బహుజనుల నుంచే అన్న విషయం మరువరాదు. బీసీల జనాభా లెక్కలు తేలకుండా, వారి జీవనవిధానం, చదువుసంధ్యలు తెలుసుకోకుండా.. దేశం అభివృద్ధిపథంలో దూసుకుపోతున్నదని కేంద్రం ప్రకటించడం పచ్చి బూటకమవుతుం ది. ఈ బూటకాన్ని 75 ఏండ్లుగా దేశ పాలకు లు కొనసాగిస్తూనే ఉన్నారు.
బహుజనుల బతుకుల బాగు కోసం జాతీయ ఉద్యమాన్ని చేపట్టవలసిన అవసరం ఉన్నది. ఆ సమయం కోసం దేశంలోని బహుజనులంతా ఎదురుచూస్తున్నారు. తమ బతుకుల్ని మార్చుకోవాలని, దేశాన్ని అభివృద్ధి పథంలో తీర్చిదిద్దుకోవాలన్న విశాల భావజాలం బీసీ వర్గీయుల్లో ఉన్నది. ఇందుకోసం జాతీయ బహుజన ఉద్యమం ముమ్మరంగా జరగవలసి ఉన్నది. ఆ ఉద్యమం పోరాటాల గడ్డ తెలంగాణ నుంచే మొదలు కావలసి ఉంది. ఆ ఉద్యమానికి విశాలదృక్పథంతో ముందు వరుసలో నిలిచే, ధైర్యంగా పోరాడే నాయకుడు కావాలి.
అలాంటి నాయకునికోసం బీసీలు ఎదురు చూస్తున్న సందర్భంలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీసీ జనగణన జరగాలని బీఆర్ఎస్ జాతీయ ప్లీనరీ సమావేశంలో తీర్మానించారు. దేశంలో గుణాత్మకమైన మార్పును సాధించే దిశగా బీఆర్ఎస్ ఉద్యమస్ఫూర్తితో పురోగమించాలని కోరుతూ, తీర్మానానికి బహుజన లోకం జేజేలు పలుకుతున్నది.
తాము అధికారంలోకి వస్తే బీసీల జనగణన జరుపుతానంటున్నది బీఆర్ఎస్. కేంద్రం లో బీసీ సంక్షేమ మంత్రిత్వశాఖ ఏర్పాటుకు కట్టుబడి ఉంటామని వాగ్దానం చేస్తున్నది. వాగ్దానం చేయడమే కాదు దేశంలోని బహుజనులందరినీ కలుపుకొనిపోయి బీసీల జాతీయ ఉద్యమాన్ని నిర్మించగల శక్తి కేసీఆర్కు ఉన్నదన్న విశ్వాసం కూడా బహుజనుల్లో బలంగా ఉన్నది. బహుజనులందరి కోసం గొంతు విప్పుతున్న కేసీఆర్కు అండదండగా నిలుద్దాం. దేశ రాజకీయాల్లో సమూల మార్పునకు తెలంగాణ నుంచి మొదలైన మహాప్రస్థానంలో మనమూ అడుగులు వేద్దాం.
(వ్యాసకర్త : చైర్మన్,తెలంగాణ సాహిత్య అకాడమీ
జూలూరు గౌరీశంకర్