MS Swaminathan | భారత వ్యవసాయరంగంలో ఓ శకం ముగిసింది. ఆహారోత్పత్తిలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు కారణమైన హరిత విప్లవ పితామహుడు, ప్రఖ్యాత శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్(98) కన్నుమూశారు. ప్రపంచంలో ఆకలి, పేదరికం తగ్గించడానికి ఆయన ఆఖరి శ్వాస వరకు కృషిచేశారు. హరిత విప్లవం వల్ల కలిగిన కొన్ని దుష్ప్రభావాలను సరిదిద్దేందుకు ‘సతత హరిత విప్లవం’ తీసుకురావాలని ఆకాంక్షించారు. పర్యావరణానికి, సమాజానికి హాని కలగని విధంగా పాడి పంటల ఉత్పత్తి పెరగాలని సూచించారు. రైతు అనుకూల మార్కెట్ విధానాలు రావాలని పరితపించారు.
1943లో బెంగాల్లో ఏర్పడిన కరువును కండ్లారా చూసిన స్వామినాథన్ చలించిపోయారు. స్వామి వివేకానంద, గాంధీజీ, రమణ మహర్షి బోధనలతో ప్రభావితమైన ఆయన దేశాన్ని ఆకలి నుంచి కాపాడాలన్న లక్ష్యంతో వైద్యుడు కావాలన్న తన కోరికను మార్చుకొని వ్యవసాయ పరిశోధనల వైపు అడుగులు వేశారు. ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ(ఐఏఆర్ఐ)లో పీజీ చేశాక యునెస్కో ఫెలోషిప్తో నెదర్లాండ్స్లోని అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఆలుగడ్డల జన్యు పరిణామంపై అధ్యయనం చేశారు. తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్లో పీహెచ్డీ పూర్తిచేశారు. 1954లో భారత్కు తిరిగొచ్చి ఐఏఆర్ఐలో శాస్త్రవేత్తగా చేరి తన పరిశోధనలు సాగించారు.
నార్మన్ బోర్లాగ్ నేతృత్వంలో 1945లో మెక్సికో హరిత విప్లవాన్ని సాధించింది. ఈ విప్లవాన్ని ఇతర దేశాలకూ విస్తరించాలని రాక్ఫెల్లర్ ఫౌండేషన్ నిర్ణయించింది. అదే సమయంలో నార్మన్ బోర్లాగ్ను స్వామినాథన్ మన దేశానికి ఆహ్వానించారు. ప్రభుత్వపరంగా ఇబ్బందులున్నా.. మెక్సికో ప్రయోగశాల నుంచి గోధుమలను దిగుమతి చేసుకుని ప్రయోగాత్మకంగా పంజాబ్లో పండించారు. అవి మంచి దిగుబడి సాధించడంతో భారత్లో హరిత విప్లవానికి నాంది పలికారు. దేశంలో ఆహార కొరత తీర్చడానికి మేలైన వరి వంగడాలను స్వామినాథన్ సృష్టించారు. ఇతర దేశాలకు చెందిన మేలైన వరి వంగడాలను మన దేశంలో ప్రవేశపెట్టి, వాటి నుంచి కొత్త వంగడాలను సృష్టించారు.
1960,1970 దశకాల్లో స్వామినాథన్ చేసిన చేసిన కృషి వల్ల కరువు కోరల్లో ఉన్న భారత్లో అధిక దిగుబడినిచ్చే గోధుమ, వరి వంగడాల సాగు మొదలైంది. ఫలితంగా ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగి భారతదేశం స్వయం సమృద్ధి సాధించింది. స్థానిక పరిస్థితులపై లోతైన అవగాహన ఉన్న స్వామినాథన్ ఆధునిక శాస్త్రీయ పద్ధతులను మిళితం చేసి దేశ వ్యవసాయరంగంపై పరిశోధనలు చేశారు. తద్వారా కొత్త వంగాడాలను సృష్టించి రైతుల ఆదాయ వృద్ధికి, దేశాభివృద్ధికి తోడ్పాటునందించారు. తన పరిశోధనలకు గుర్తింపుగా లభించిన వరల్డ్ ఫుడ్ ప్రైజ్ డబ్బుతో 1988లో చెన్నైలో ఎం.ఎస్.స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ను స్థాపించి జీవిత చరమాంకం వరకు వ్యవసాయ పరిశోధనలను ప్రోత్సహిస్తూ వ్యవసాయరంగ అభివృద్ధి కోసం స్వామినాథన్ పరితపించారు. వివిధ అంతర్జాతీయ వ్యవసాయ, పర్యావరణ కార్యక్రమాలకు తన మేధస్సును అందించారు. వ్యవసాయంతో పాటు పర్యావరణ సమస్యలపైనా ఆయన దృష్టి సారించారు.
టైమ్ మ్యాగజైన్ 20వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన 20 మంది ఆసియన్లలో స్వామినాథన్ను ఒకరిగా గుర్తించింది. రామన్ మెగసెసే (1971), పద్మభూషణ్ (1972), ఆల్బర్ట్ ఐన్స్టీన్ వరల్డ్ అవార్డ్ ఆఫ్ సైన్స్ (1986), పద్మవిభూషణ్ (1989) తదితర పురస్కారాలెన్నో ఆయనను వరించాయి.
1972 నుంచి 1979 వరకు ఐఏఆర్ఐకు ఆయన డైరెక్టర్ జనరల్గా పనిచేశారు. కేంద్ర వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శిగా, ప్రణాళిక సంఘం సభ్యుడిగా, అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ డైరక్టర్ జనరల్గా, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రీసోర్స్ సంస్థ అధ్యక్షుడిగా స్వామినాథన్ సేవలందించారు. ఇక్రిశాట్తో పాటు మరికొన్ని అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. చైనా, పాకిస్థాన్, శ్రీలంక, వియెత్నాం తదితర దేశాల పరిశోధనలకు సహకారం అందించారు. 46 పరిశోధనా పత్రాలను వెలువరించారు. 2007 నుంచి 2013 వరకు నామినేటెడ్ ఎంపీగా సేవలందించారు.
ఆధునిక పద్ధతుల్లో అధిక దిగుబడి సాధ్యమని స్వామినాథన్ విశ్వసించారు. రైతులకు కనీస మద్దతు ధర దక్కాలంటే పంట ఉత్పత్తి వ్యయంపై కనీసం 150 శాతం అధికంగా ఆదాయం లభించేటట్ట చేయాలని ప్రభుత్వానికి సూచించారు. వ్యవసాయం లాభసాటిగా మారినప్పుడే యువ రైతులు సేద్యంలో కొనసాగుతారని, కొత్తవారు ఆకర్షితులవుతారని అభిప్రాయపడ్డారు. వ్యవసాయ విధానాల రూపకల్పనలో రైతులు, విధానకర్తల మధ్య తగినంత చర్చ జరగాలని కోరుకున్నారు. రైతుకు అనుకూలమైన మార్కెట్ విధానాలు అవసరమని.. అప్పుడే వారికి తగినంత ఆదాయం లభిస్తుందని చెప్పారు. హరిత విప్లవం కలిగిన కొన్ని దుష్ప్రభావాల పట్ల ఆయన ప్రతిస్పందిస్తూ ‘సతత హరిత విప్లవం’ తీసుకురావాలని ఆకాంక్షించారు. పర్యావరణానికి, సమాజానికి హాని కలగనివిధంగా పాడి పంటల ఉత్పత్తి పెరగాలని సూచించారు.
(వ్యాసకర్త: ఇండిపెండెంట్ జర్నలిస్ట్)
ఇస్కా రాజేష్ బాబు
93973 99298