హరిత విప్లవం గుర్తుకురాగానే స్ఫురించే మొదటి పేరు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్. వ్యవసాయంలో ఆధునిక విధానాలను ప్రవేశపెట్టి దేశ ఆహార భద్రతను పెంచి దేశాన్ని అన్నపూర్ణగా తీర్చిదిద్దడంలో ఆయన కృషి వెలకట్టలేనిది. రైతుల జీవితాలను మెరుగుపరచడానికి చివరిదాకా ఆయన పనిచేశారు.
భారత వ్యవసాయరంగంలో అనేక కీలక మలుపుల వెనుక ఆయన నిర్ణయాలు, ఆలోచనలు ఉన్నాయి. హరిత విప్లవం పేరుతో అధిక దిగుబడినిచ్చే వరి, గోధుమ వంగడాలు, రసాయనాలు, యంత్రాలు వాడటం ప్రారంభించింది ఆయనే. హరిత విప్లవానికి సహకారం అందించడానికి జాతీయస్థాయిలో వ్యవసా య విశ్వవిద్యాలయాలు, విస్తరణ వ్యవస్థ, వ్యవసాయ రుణాల కోసం బ్యాంకుల జాతీయీకరణ, మద్దతు ధర లు, ధాన్యసేకరణ కోసం భారతీయ ఆహార సంస్థ, ఆహార భద్రత కోసం జాతీయ పంపిణీ వ్యవస్థ వంటివి ఏర్పాటుచేయటంలో ఆయన కీలక పాత్ర పోషించారు. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి డైరెక్టర్ జనరల్గా, అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ డైరెక్టర్గా, కేంద వ్యవసా య శాఖ కార్యదర్శిగా, ప్రణాళికా సంఘం సభ్యులుగా, ఎంపీగా అనేక కీలక పదవులను ఆయన నిర్వహించారు. మొత్తం 33 జాతీయ అవార్డులు, 32 అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు.
జాతీయ రైతు కమిషన్ చైర్మన్గా దిగుబడులు ఎంత పెంచామని కాకుండా, రైతుల ఆదాయం ఎంత పెంచామని ఆలోచించాలని స్వామినాథన్ సూచించారు. ఎంపీ గా ఉన్న సమయంలో వ్యవసాయరంగంలో మహిళల ప్రాధాన్యం గుర్తించి, దానికి అనుగుణంగా విధానాలు ఉండాలని మహిళా రైతుల హక్కుల చట్టం ముసాయిదా తయారుచేసి పార్లమెంట్ ముందుంచారు. గ్రామీణులు సొంతంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు వచ్చినప్పు డే వ్యవసాయంలో మార్పులు వస్తాయన్న ఆలోచనతో గ్రామాల్లో వాతావరణ పాఠశాలలు స్థాపించారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పుల ప్రభావం వ్యవసాయరంగం మీద ఎలా ఉంటుంది, ఆ మార్పులను ఎదుర్కోవడానికి రైతులు ఏం చేయాలి, ప్రభుత్వ విధానాలు ఎలా మారాలనే అంశాలపై పరిశోధన చేయడమే కాకుండా ఆ దిశగా ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చారు.
వ్యవసాయరంగంలో ఉన్న విభిన్న పరిస్థితులు, విభిన్న అవసరాలు, విభిన్న దృక్కోణాల మధ్యలో నిర్ణయాలు తీసుకునే విషయంలో ఎదురయ్యే అనేక వివాదాలు కూడా ఆయన చుట్టూ ఉన్నాయి. హరిత విప్లవం ద్వారా వచ్చిన దుష్ఫలితాలకు ఆయనే బాధ్యులని, జాతీయ జీవవైవిధ్యం కోల్పోవటం, విదేశాలకు తరలిపోవటంలో ఆయన పాత్ర ఉందని అనేక ఆరోపణలు వచ్చాయి. కానీ ఆయన జీవన ప్రయాణాన్ని దగ్గరగా చూసినవాళ్లు కానీ, ఆయనతో ఒక్కసారి మాట్లాడిన వాళ్లు కానీ చెప్పే అనుభవాలు పూర్తిగా వేరుగా ఉన్నాయి. తనతో కలిసి పనిచేసిన ప్రతి వ్యక్తి పేరు గుర్తుపెట్టుకొని పలకరించే అలవాటు ఆయనకు ఉండేది. జాతీయ వ్యవసాయ పరిశోధనా మండలి డైరెక్టర్ జనరల్గా ఉన్నప్పుడు సంస్థ పొలంలో పనిచేసే రైతులను కూడా ఆయన పేరుతో పలకరించేవారని చెప్తారు.
జీవ వైవిధ్యాన్ని కాపాడటం కోసం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ప్రయత్నాల వెనుక స్వామినాథన్ సహకారం ఉన్నది. జీవవైవిధ్య చట్టం, బయో డైవర్సిటీ ఇంటర్నేషనల్, నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ స్థాపన లో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. హైదరాబాద్లో గల ఇక్రిశాట్ ఏర్పాటు కూడా ఆయన ప్రయత్నాల వల్ల జరిగినదే. భారత దేశంలో ప్రపంచ వాణిజ్య సంస్థ నిర్ణయాల మేరకు మేధో సంపత్తి హక్కుల గురించి చర్చలు జరిగి చట్టం చేసినప్పుడు, అందులో రైతులకు హక్కులు ఉండాలని పోరాడి, వాటిని కూడా చట్టంలో చేర్చేలా ప్రభుత్వాన్ని ఒప్పించారు. భారతదేశంలో అనేక పాంతాల్లో రైతులు కాపాడుతూ వస్తున్న జీవవైవిధ్యాన్ని డాక్యుమెంట్ చేసి, దానికి చట్టబద్ధమైన హక్కులు కల్పించే దిశగా స్వామినాథన్ ఫౌండేషన్ ద్వారా కృషి చేశారు.
వ్యవసాయ సమస్యలు, వాటి పరిష్కారాల గురించి ఆయన ఎన్నో వ్యాసాలు రాశారు. ప్రభుత్వాలు చెప్పిందే చేయటం కాకుండా, ప్రభుత్వాలు ఏం చేయాలో చెప్పి వారి చేత ఆ మార్పులు చేయించేవారు. 2004లో జాతీయ రైతుల కమిషన్ చైర్మన్గా ఉన్న ఆయన దేశవ్యాప్తంగా పర్యటించి వ్యవసాయ రంగంలో తీసుకురావాల్సిన మార్పుల గురించి, రైతుల సమస్యల గురించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించారు.
పంటల పెట్టుబడి ఖర్చుకు అదనంగా 50 శాతం జత చేసి మద్దతు ధర కల్పించాలని, ప్రతి రాష్ట్రం వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయాలని, పంటల బీమా చేయాలని, ప్రతి మనిషికి ఆరోగ్య బీమా వర్తింపజేయాలని నివేదిక సమర్పించారు. కానీ ఆయన సిఫారసులు నేటి వరకు అమలు చేయకపోవడం దురదృష్టకరం. స్వామినాథన్ కమిషన్ నివేదికను అమలుచేయడమే స్వామినాథన్కు నిజమైన నివాళి. ఆయన జీవితం ఎందరికో ప్రేరణ కలిగిచింది. వ్యవసాయరంగానికి స్ఫూర్తిగా నిలిచిన ఆయనకు రైతుల తరపున ఘన నివాళి.
(వ్యాసకర్త: సామాజిక కార్యకర్త)
పులి రాజు
99083 83567