ఆకలిపై అలుపులేని పోరాటం సాగించిన వీరుడు.. హరిత విప్లవ పితామహుడిగా చరితార్థుడు.. సాగు బాగుకోసం ఆకుపచ్చని కలలు గన్న నిరంతర స్వాప్నికుడు.. ఎంఎస్ స్వామినాథన్.. సర్వోన్నత పౌరపురస్కారమైన భారతరత్నకు ఎంపిక కావడం ఆలస్యంగా జరిగిన న్యాయంగానే పరిగణించాలి. ఆహార స్వయం సమృద్ధికి బాటలు వేసిన అచ్చమైన అన్నదాతగా నిండైన, మెండైన జీవనయానం ముగించుకుని ఇటీవలే ఆయన దివంగతులయ్యారు.
MS Swaminathan | 1942 నాటి మాట. అటు గాంధీజీ తెల్లదొరలను ‘క్విట్ ఇండియా’ అన్నరోజులవి. రెండో ప్రపంచ యుద్ధం చండచండం, తీవ్రతీవ్రం అవుతున్నది. మరోవైపు వలసవాదం పుణ్యమా అని సమృద్ధ భారత్ ఆకలికేకలతో అలమటిస్తున్నది. 30 లక్షల మందిని బలిగొన్న డొక్కల కరువు పీడకలలో నుంచి మేలుకున్న సామాన్య మానవుడే స్వామినాథన్. కరువులను తరిమికొట్టిన హరిత సేనానిగా వినుతికెక్కాడు. బక్కజీవులకు పిడికెడు అన్నం పెట్టాలనే తపన అతడిని పొలంబాట పట్టించింది. తండ్రి కోరిక మేరకు తను డాక్టర్ కావాల్సి ఉండింది. రోగం నయం చేయడం కన్నా రోగానికి మూలమైన ఆకలిని అంతం చేయాలని ఆయన పంతం పూనారు. అన్నానికి మారుపేరుగా మారారు. దిగుబడులను పెంచే గుట్టు జన్యుశాస్త్రంలో ఉందని ఆ దిశగా అడుగులు వేశారు. కొత్త వంగడాలను సృష్టించి దేశానికి కడుపునిండా అన్నం దొరికే మార్గం చూపారు. పరిపాలన విధులు నిర్వహించే అధికారిగా ఉద్యోగ జీవితం ప్రారంభించినప్పటికీ అనతికాలంలోనే తనకు అత్యంత ప్రీతిపాత్రమైన వ్యవసాయ పరిశోధనలోకి అడుగుపెట్టారు. అమెరికా, యూరప్లో చేసిన పరిశోధనలకు సొంతగడ్డ మీద సానపెట్టారు. కటక్లోని వరి పరిశోధనా కేంద్రంలో ఆయన హరిత కృషి మొగ్గలు తొడిగింది. సారవంతమైన నేల, చక్కటి నీటి నిర్వహణకు మేలురకం విత్తనాలు తోడైతే దిగుబడి పెరుగుతుందని నిరూపించిన శాస్త్రవేత్త ఆయన. దక్షిణాది ప్రధాన ఆహారమైన వరిపంట తీరుతెన్నులను సమూలంగా మార్చివేశారు. ఆ తర్వాత ఉత్తరాది వారు ఎక్కువగా తినే గోధుమపై దృష్టి సారించారు. కరువు తీర్చారు.
1947లో భారతదేశం రాజకీయ స్వాతంత్య్రం అయితే సాధించింది కానీ, ఆకలి నుంచి విముక్తం కాలేదు. వలస పాలనలో వ్యవసాయం అడుగంటింది. ప్రజలకు సరిపడా ఆహారాన్ని దేశం అందించలేకపోతున్నది. ఈ సుడిగుండం నుంచి బయటపడాలని భారత్ చూస్తున్నది. సాగును ఆధునీకరించే వనరులు మనదేశంలో అప్పటికీ అరకొరగానే ఉన్నాయి. అమెరికా వంటి దేశాల నుంచి ధాన్యం ఓడల కోసం ఎదురుచూసే దీన, పరాధీన పరిస్థితి. అలాంటి నేపథ్యంలో దేశంలో హరిత విప్లవానికి నారు పోశారు స్వామినాథన్. 1947లో 60 లక్షల టన్నులున్న గోధుమ దిగుబడి ఇరవై ఏండ్లలో మూడింతలైంది. ఇది హరిత విప్లవం తొలి విజయాల్లో ఒకటి. నోబెల్ బహుమతి గ్రహీత, అమెరికా వ్యవసాయ శాస్త్రవేత్త నార్మన్ బోర్లాగ్తో కలిసి స్వామినాథన్ చేసిన పరిశోధనలు భారతదేశ వ్యవసాయరంగ అభివృద్ధికి అండగా నిలిచాయి. ఇక్కడి నేల పరిస్థితులకు అనుగుణమైన ‘గెయిన్స్’ వంటి మేలురకం గోధుమ పొట్టి వంగడం తయారు చేయగలిగారు. ఇలాంటి సృజనాత్మకమైన పరిశోధనలే స్వామినాథన్ను హరిత విప్లవ పితామహునిగా నిలబెట్టాయి.
హరిత విప్లవానికి సారథ్యం వహించిన స్వామినాథన్ ఆ విప్లవ దుష్ఫలితాల గురించి కూడా ఆనాడే హెచ్చరించారు. పంటలే కాదు, ఆ పంటలను పండించే రైతుల బాగోగుల గురించి కూడా ఆయన లోతుగా ఆలోచించేవారు. కనీస మద్దతు ధరకు సర్కారు అండగా నిలవాలని గట్టిగా వాదించినవారిలో ఆయన కూడా ఉండడం విశేషం. సగటు ఉత్పాదక వ్యయానికి 50 శాతం అధికంగా చేర్చి మద్దతు ధర నిర్ణయించాలన్న ఆయన సూచన సర్వజనామోదం పొందింది.
సాగు బాగు కోసం నిరంతరం తపించిన స్వామినాథన్కు తెలంగాణతోనూ సన్నిహిత అనుబంధం ఉంది. సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ వ్యవసాయ రంగంలో సాధించిన అద్వితీయ విజయాలను ఆయన మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. 2014లో ముఖ్యమంత్రిగా కేసీఆర్ పగ్గాలు చేపట్టిన తర్వాత స్వామినాథన్ తెలంగాణకు వచ్చారు. వ్యవసాయ రంగం అభివృద్ధిపై పలు సలహాలు, సూచనలు చేశారు. స్వామినాథన్ చూపిన బాటలో తెలంగాణ పయనిస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. తదనంతర కాలంలో వ్యవసాయ రంగంలో తెలంగాణ సాధించిన అద్భుత విజయాలపై స్వామినాథన్ ఆసక్తి చూపేవారు.
వ్యవసాయ శాస్త్రవేత్తగా అద్వితీయమైన సేవలందించిన స్వామినాథన్ను జాతీయ, అంతర్జాతీయ పదవులు, అవార్డులు లెక్కకు మించి వరించాయి. భారత వ్యవసాయ పరిశోధనా మండలికి, తర్వాత అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థకు డైరెక్టర్ జనరల్గా పనిచేశారు. 1987లో ఏర్పాటు చేసిన ప్రపంచ ఆహార బహుమతి మొట్టమొదటి గ్రహీత ఆయనే. అంతర్జాతీయంగా రామన్ మెగసెసె అవార్డు, ఐన్స్టీన్ సైన్స్ అవార్డు లభించాయి. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్నారు. ఇప్పుడు భారతరత్న ఆయనను వరించి తనను తాను గౌరవించుకుంది.
– తుమ్మలపల్లి రఘురాములు
91827 77750