‘నాటకాంతం హి సాహిత్యం’ అనే వాక్యం నాటక వైశిష్ట్యాన్ని తెలుపుతుంది. రచనావ్యాసంగంలో మంచి అనుభవాన్ని సంపాదించిన రచయితే నాటక రచనల్లో సఫలుడు కాగలడు. సాహిత్యాధ్యాయానికే కాక సాహిత్య సృజనకు కూడా నాటకమే పరాకోటి. కనుక చేయి తిరిగిన రచయితే నాటక రచనకు సమర్ధుడు. ఇలాంటి సమర్ధుడైన నాటక రచయితే శ్రీమాన్ వానమామలై వరదాచార్యులు. వీరు ఖండకావ్య, మహాకావ్య రచనల తర్వాత నాటక రచనకు పూనుకొని తెలుగు సాహిత్యానికి ‘వైశాలిని’ నాటకాన్ని అందించారు. ‘పోతన చరితము’ అనే మహా కావ్య రచన చేసి ‘అభినవ పోతన’ బిరుదాంకితులైన వీరు వైశాలిని నాటక రచన ద్వారా ‘అభినవ కాళిదాసు’ అనే బిరుదుకు అర్హులయ్యారు.
‘కావ్యేషు నాటకం రమ్యం’ అనే ఆర్యోక్తి దృశ్య కావ్య ఔన్నత్యా న్ని తెలియజేస్తుంది. దృశ్య కావ్యానికే నాట కం, నాట్యం, దృశ్యం, ప్రేక్ష్యం, ప్రేక్షనీయకం, రూపకం అనే పర్యాయపదాలున్నాయి. కానీ దృశ్య కావ్యాలన్నిటికీ జాతి పరంగా నాటకం అనే వ్యవహారమే అధికంగా వినబడుతుంది.
రచనా వ్యాసంగంలో రాణించగలిగిన రచయిత నాటక రచనల్లోనూ రాణించగల డు. నాటక రచనలో నియమ నిగళాలను పా టిస్తూ నియమిత కాలంలో ఇతివృత్తాన్ని రస నిర్భరంగా ఉత్కంఠోపేతంగా ఉండేటట్టు రూ పొందించ గలుగుతాడు. పాత్రల వేషభాషాధికాలను ఔచిత్యానికి తగ్గట్టుగా రూపొంది స్తూ దృశ్య సూచ్య విభాగాన్ని చక్కగా నిర్వహించగలడు. ఎక్కడ వ్యగ్రత చెడకుండా, శైథిల్యం రాకుండా చూసుకోగలడు. అప్పుడే నాటకం సఫలమవుతుంది. అలాంటి లక్షణాలన్నీ ఉన్న నాటక రచయిత వానమామలై .
వైశాలిని నాటకం 250 పద్యాలతో, కొన్ని దీర్ఘవచనాలతో కూడి 221 పుటల విస్తృతి కలిగి 9 అంకాలతో రాసిన మహా నాటకం. సలక్షణమైన సంప్రదాయ పౌరాణిక నాటకం. కథా వస్తువు మార్కండేయ పురాణంలోని అష్టమాశ్వాసంలో గల అవీక్షితుని చరిత్ర. ఈ కథకు కొన్ని కల్పనికా విశేషాలను చేర్చి శిల్పాభిరామంగా తీర్చిదిద్ది మిశ్రమ కథగా మలిచారు వానమామలై.
నాటకంలో కరంధముని కుమారుడైన అవీక్షితుడు నాయకుడు. విశాలరాజు పుత్రి క వైశాలిని నాయిక. నాయిక నాయకులు పూర్వజన్మలో తాము చేసిన అపరాధముల వల్ల శాపగ్రస్తులయ్యారు. వైశాలిని పూర్వజన్మలో గంధర్వరాజైన సునయుని కూతురు. అజ్ఞానం వల్ల అగస్త్య మహర్షిని అపహసించింది. దీంతో మానవకాంతగా పుట్టి విరహతాపాన్ని పొందమని మహర్షి శపిస్తాడు. అవీక్షితుడు తెలియక నాగుల పట్ల అపచా రం చేసి శాపాన్ని పొందుతాడు. ‘మహర్షుల కోపం మంగళములకే’ అన్నట్టు వారి శాపా లే మరు జననానికి కారణమయ్యాయి. అంతేకాకుండా అవీక్షితుడు ప్రతినాయకుడై న దృఢకేశి అరాచకాల నుంచి ప్రజలను కాపాడి సమాజంలో శాంతిని నెలకొల్పుతా డు. ముఖ్య కథతో పాటు ఈ నాటకంలో అనేక ధార్మికాంశాలను సందర్భానుసారం గా పొందుపరిచారు ఆచార్యుల వారు.
తొమ్మిది అంకములు గల ఈ నాటకంలో అంగీరసం శృంగారం కాగా కరుణ, హాస్యం, రౌద్రం, వీరం అంగాలు. నాటక ప్రారంభ ప్రస్తావనలో ఒక సీస పద్యం అనుబంధంగా తేటగీతి ఉన్నాయి. తేటగీతిలో సరస కవితా కళారవీ! వరద సుకవీ! అనే పాదం కవి ప్రతి భా విశేష సంపన్నతను తెలియజేస్తుంది. నాటకం శుద్ధ విష్కంభంతో మొదలవుతుం ది. ఇందులో నాయిక పూర్వజన్మ వృత్తాంతం మానవకాంతగా జన్మించడం దృశ్యమానమవుతుంది. మొదటి అంకంలో అవీక్షితుని పూర్వజన్మ వృత్తాంతంతో పాటు అవీక్షితుడు వైశాలి గురించి తెలుసుకోవడం వంటి అంశాలుంటాయి. ఈ అంకంలోనే ప్రతి నాయకుడు దృఢకేశి తారసిల్లుతాడు.
రెండో అంకంలో వైశాలిని చెలికత్తెలతో ఆడుతూ పాడుతూ ఉండడం, అవీక్షితుడు విదూషకునితో కలిసి వైశాలినిని చూడటం, ఏను గు బారి నుంచి ఆమె ను కాపాడే సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. మూడో అ ంకంలో వైశాలిని విరహవేదన. నాలుగవ అంకంలో అవీక్షితుడు రాక్షసుని నుంచి వైశాలిని రక్షించడం, వైశాలిని స్వయంవరం, అవీక్షితుని నాగపాశంతో దృఢకేశి బంధించ టం వంటి సన్నివేశాలుంటాయి. ఐదో అం కంలో వైశాలిని అవీక్షితుని కారాగారం నుం చి విడిపించటం, తపస్సు కోసం సువ్రతుని ఆశ్రమానికి వెళ్లటం వంటి సన్నివేశాలుంటా యి. ఆరవ అంకంలో వైశాలినికి ఒక దేవదూత తారసిల్లడం, ఏడో అంకంలో దృఢకేశిని అవీక్షితుడు సంహరించడం, తరువాతి అంకంలో వైశాలిని, అవీక్షితుల వివాహం మరుత్తు జననం, చివరి అంకంలో భార్య పుత్రులతో కలిసి అవీక్షితుడు తన రాజ్యానికి రావడంతో నాటకం ముగుస్తుంది.
‘ఎయ్యది యాది భావమగు ’ అనే నాం ది పద్యంతో నాటకం ప్రారంభమవుతుంది. శృంగార రస ప్రాధాన్యత కలిగిన నాటక మిది. శుద్ధ, మిశ్రా నిష్కంభాలు, ప్రవేశము అను మూడు అర్థోపక్షేపకములు నామ నిర్దేశముతో చెప్పబడ్డాయి. అంకాస్య అంకావతార చూళికలు సూచన మాత్రంగా చేర్చబడ్డాయి. పంచసంధులు వాటి అంగాలు ప్రవేశనిష్కంభాదులు. పతాక ప్రకరీ మొదలైన నాటక లక్షణాలన్నీ కలిగిన సలక్షణ రసవత్తర నాటకం ఇది. ప్రారంభంలో సూత్రధారునితో నటి జరిపిన సంభాషణలో ..
‘కతల పద్యకృతులు నెల్లరొనర్త
రమ్యశిల్ప కావ్య రచన మరసి
కనుముక్కు మూతిగల స్త్రీలు పెక్కురు
చక్కదనపు లేమ చిక్కు నెటనొ
అనే పద్యంలో రమ్యమైన కావ్యరచన ఎలాంటిదో నన్న సంగతి ఎంతో రమ్యంగా చెప్పారు ఆచార్యులవారు. తన అర్ధాంగి వైదేహి కోరిక మేరకు రాసిన ఈ నాటకాన్ని ఆమెకే అంకితం ఇస్తూ…
‘శీలవతి గాథ నొండు రచించి నాకు
గృతి నొసంగరె యంచు వినతి నొనర్చు
దీప్త సౌభాగ్యవతికి వైదేహి సతికి
అస్మదర్థాంగికీ కృతి యంకితమ్ము’
అని తన భార్యపై ఉన్న అనురాగాన్ని తెలియజేశారు.
తెలుగు రూపక సాహిత్యానికి ‘వైశాలిని’ అనే ఒక గొప్ప నాటకాన్ని అందించారు వానామామలై. ఆధునిక కాలంలో సాంప్రదాయ మార్గాన రచించిన వైశాలిని నాటకం ‘శ్రేయోరాజ్య స్థాపనమే పరమ లక్ష్యంగా’ చెప్పబడి, వారిలో ఉన్న అభ్యుదయ దృక్ప థం సామాజికులకు అందించడంలో కృతకృత్యమైంది.
(వ్యాసకర్త: అసిస్టెంట్ ప్రొఫెసర్, మల్కాజిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల)
– స్వప్న భువకర్ 94902 35017