లోక్సభ నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరిపి అసెంబ్లీ వారీ సమీక్షలు సాగిస్తున్న బీఆర్ఎస్, ఆ తర్వాత మరొక సమీక్ష కూడా నిర్వహించటం అవసరం. అది, వివిధ సామాజిక వర్గాలు, వృత్తుల వారీ ప్రజలతో ప్రత్యక్ష సమీక్షలు. మొదటి రెండింటిలో పాల్గొంటున్నవారంతా బీఆర్ఎస్ పార్టీకే చెందిన నాయకులు, శ్రేణులు. ఎన్నికల ఫలితాలపై, భవిష్యత్తు సన్నద్ధతపై వీరితో సమీక్ష ఎంత ముఖ్యమో, స్వయంగా ఓటర్లు అయి జయాపజయాలను నిర్ణయించే క్షేత్రస్థాయి సాధారణ ప్రజా వర్గాలతో సమీక్షలు కూడా అంతే ముఖ్యం. అప్పుడే సమీక్షలకు లోతు, అర్థం, సమగ్రత ఏర్పడుతాయి. దిద్దుబాటు చర్యలపై పూర్తి స్పష్టత వస్తుంది.
లోగడ ఒకసారి అనుకున్నట్టు, ఎన్నికల ఫలితాలపై గాని, ఓటమిపై గాని ఒక రాజకీయ పార్టీ ఈ విధమైన పద్ధతిలో సమీక్షలు జరపటం, ఆ వివరాలను ఎప్పటికప్పుడు బయటకు వెల్లడించడం మనకు తెలిసినంతవరకు మొత్తం దేశంలోనే ఎప్పుడూ లేదు. బీఆర్ఎస్ సమీక్షల విశేషాలు పూర్తిగా తెలియరాకపోవచ్చు. మీడియా పరిమితుల దృష్ట్యా అది వీలు కాదు కూడా. కాని యథాతథంగా ఈ పద్ధతి అన్నదే మనకు గతంలో తెలియనిది. ఇది కొత్త పద్ధతే గాక కొత్త స్ఫూర్తి కూడా. రాగలకాలంలో దిద్దుబాటు చర్యలు సైతం ఒకవేళ ఇదే స్ఫూర్తితో సాగిన పక్షంలో ఫలితాలు తప్పక అందుకు తగినట్టు ఉంటాయి.
వివిధ సామాజిక వర్గాలు, వృత్తుల వారీ ప్రజల భావనలు ఏమిటో ఈ మొదటి రెండు సమీక్షలలో పార్టీ నాయకులు, శ్రేణుల ద్వారా నాయకత్వానికి కొంత తెలిసే ఉంటుంది. కానీ అది మరొకరి ద్వారా పరోక్ష రూపంలో తెలియటానికి, ప్రజల ముఖతః ప్రత్యక్షంగా తెలియటానికి తగినంత తేడా ఉంటుంది. అప్పుడు వారు బీఆర్ఎస్ పాలనతో పాటు పార్టీ మంచిని చెడును కూడా ఉన్నది ఉన్నట్టు నిర్మొహమాటంగా చెప్పగలరు. మంచిని మెచ్చటం ఎట్లా చేస్తారో చెడును అట్లానే ఎత్తిచూపుతారు. దానితో పాటు తమకు తోచిన సూచనలు ఎన్నయినా చేస్తారు. వాళ్ల అభిప్రాయాలు అన్నీ సరైనవి కాకపోవచ్చు. ఎందుకంటే, వారెంతా సామాన్య ప్రజలైనా వారికి కూడా ఆబ్జెక్టివిటీ, సబ్జెక్టివిటీ అనే రెండూ ఉంటాయి.
ఆ దృష్టితో వారి అభిప్రాయాలను వడబోయవచ్చు. అదెట్లున్నా, పార్టీ శ్రేణుల పరిధిని దాటి నేరుగా ప్రజా వర్గాల ఆలోచనలు తెలుసుకోవటం చాలా ఉపయోగకరమవుతుంది. ఇది మరో ప్రయోగమూ అవుతుంది. అంతే కాదు. ఒక పార్టీ ఈ విధంగా వివిధ వర్గాల సామాన్యుల అభిప్రాయాలను, సలహాలను నేరుగా వింటున్నదనే వార్తలు వారిద్వారా గ్రామాలలో, పట్టణాలలో ఇతరులకు చేరినప్పుడు, తామెప్పుడూ ఎరగని ఆ పద్ధతి, స్ఫూర్తి ప్రజలలో బీఆర్ఎస్ పట్ల సానుకూల అభిప్రాయాన్ని కలిగిస్తాయి. అందువల్ల రాగల రోజులలో కలిగే మేలు ఏమిటో ఎవరైనా ఊహించగలరు. ఇంకా చెప్పాలంటే, మొదటి రెండు సమీక్షలకు ఇది తీసిపోనిది. ఎందుకంటే, మొదటి రెండు పార్టీలకు అంతర్గతమైనవి కాగా, ఇది బాహిరమైనది, ప్రజానీకంతో ప్రత్యక్ష సంబంధం కలది.
ఇటువంటి సమీక్షల వల్ల కలిగే కీలకమైన ఉపయోగం మరొకటి ఉంది. కారణాలు ఏవైతేనేమి పార్టీకి ఏదో ఒక మేరకు దూరమైన సామాజిక, వృత్తి వర్గాలతో తిరిగి సాన్నిహిత్యానికి దారులు ఏర్పడుతాయి. ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఆ పార్టీ స్వాతంత్య్రోద్యమ కాలం నుంచి అన్ని సామాజిక వర్గాలకు, వృత్తివర్గాలకు ఉమ్మడి వేదికగా రూపొందటం తెలిసిందే. స్వాతంత్య్రం లభించిన వెనుక కాంగ్రెస్ పరిపాలన కొంతకాలం పాటు ఆయా వర్గాలన్నింటికి మేలుచేసే విధంగానే సాగింది. ఎన్నికలలో కాంగ్రెస్ పట్ల వారి స్పందనలు కూడా అందుకు తగినట్టు కన్పించాయి. ఆ తర్వాత నుంచి తేడాలు మొదలయ్యాయి.
పరిపాలన వల్ల తమకు అసలు మేలు జరగటం లేదని, లేదా తగినంత జరగటం లేదని, లేదా నష్టాలు జరుగుతున్నాయని భావించిన ఆయా సాధారణ ప్రజా వర్గాలు నెమ్మదిగా కాంగ్రెస్కు దూరం కాసాగాయి. కొందరు ఇతర పార్టీల వైపు మళ్లగా, కొందరు తమ సొంత పార్టీలు, లేదా స్వతంత్ర సంస్థలను ఏర్పాటు చేసుకోవటం మొదలుపెట్టారు. మరి కొందరు ఇదేమీ చేయక తమ సమస్యలపై ఆందోళనలు సాగించారు.
సమస్య ఏమంటే, కాంగ్రెస్ పార్టీ ఈ పరిణామాల వల్ల నష్టపోతూ కూడా తనను తాను ఏ విధంగా సరిదిద్దుకోవాలో ఆ పని చేయలేదు. కొన్నిసార్లు అరకొరగా చేసింది. కొన్నిసార్లు అసలేమీ చేయలేదు. కొన్నిసార్లు నటనలు మాత్రం చేసింది తప్ప చిత్తశుద్ధి, శ్రద్ధ చూపలేదు. అందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి, కాలం గడిచిన కొద్దీ కాంగ్రెస్లో స్వాతంత్య్రోద్యమ కాలం నాటి సామాజిక న్యాయస్ఫూర్తి బలహీనపడసాగింది.అభివృద్ధి లక్ష్యాలు నెరవేరక వెనుకడుగు వేసింది. రెండు, పార్టీ యంత్రాంగం, ప్రభుత్వ పాలన బలవంతులైన వర్గాల చేతిలో బందీ కావటం మొదలైంది.
బలవంతుల ప్రాభవం గతం నుంచీ ఉండినా, అది క్రమంగా అదుపు తప్పి పెరగసాగింది. అటువంటి స్థితిలో, సాధారణ ప్రజావర్గాల ఓట్లయితే అధికారం కోసం కాంగ్రెస్కు తప్పనిసరి గనుక, పార్టీకి దూరమవుతున్న వర్గాల మేలు కోసం ఏదో చేసినట్టు పాప్యులిస్టు పద్ధతులలో నటించటం మినహా, వారి స్థితిగతులు తాము హామీ ఇచ్చినట్టు మౌలికంగా, లేదా గణనీయంగా మారేట్లు చేసింది ఏమీ లేదు. అనగా, దూరమవుతున్న వర్గాలను తిరిగి దగ్గరకు తెచ్చుకునేందుకు తీసుకున్న చర్యలు లేవన్న మాట.
అది జరగకపోగా అదే అసమర్థ పాలనతో వారిని మరింత దూరం చేసుకుంటూపోయారు. అట్లా మరికొంత కాలం గడిచేసరికి మరొకవైపు పార్టీ నాయకత్వం సైతం అసమర్థంగా, బలహీనంగా తయారైంది. దానితో ఇక ఆ వర్గాలు పార్టీకి మళ్లీ దగ్గర కావటమనే ప్రసక్తి లేకుండా పోయింది. ఇది వర్తమానంలో మనం చూస్తున్న కాంగ్రెస్ పరిస్థితి.
ఈ ఉదాహరణను ఇంత వివరంగా చెప్పుకోవటం ఎందుకంటే ఇది ఏదో ఒక మేరకు ఆయా నిర్దిష్ట పరిస్థితులను బట్టి, అన్ని పార్టీలకు వర్తిస్తుంది. దానినుంచి నేర్చుకోవలసి ఉంటుంది. బీఆర్ఎస్కు కూడా. మొన్నటి అసెంబ్లీ ఫలితాలనే గమనించండి. తన పదేండ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వం నిజానికి అద్భుతమైన, అపూర్వమైన, దేశంలో మరెక్కడా జరగని మంచిపనులు అనేకం చేసింది. విమర్శకులు సైతం జనాంతికంగా అంగీకరించే విషయం ఇది.
తెలంగాణ రూపు రేఖలు గతం కన్న పలు విధాలుగా మారాయి. పైన ప్రస్తావించిన వివిధ సామాజిక వర్గాలు, వృత్తి వర్గాల జీవితాలలో గణనీయమైన మార్పులు వచ్చాయి. అయినప్పటికీ ఎన్నికల ఫలితాలు ఈ విధంగా ఎందుకున్నట్టు? విధానాలలో, ఆచరణలో ఎటువంటి లోపాల వల్ల వివిధ వర్గాలలోని తగినంత మంది పార్టీకి దూరమైనట్టు? వారిని తిరిగి దగ్గరకు తెచ్చుకునేందుకు విధానాలలో, ఆచరణలో చేసుకోవలసిన మార్పులేమిటి? పైన చెప్పుకొన్న కాంగ్రెస్ వైఫల్యాల అనుభవం నుంచి నేర్చుకోదగినదేమిటి? అన్నవి ప్రశ్నలు.
ఇందుకు సమాధానాలు తెలుసుకునేందుకు బీఆర్ఎస్ నాయకత్వం సమీక్షల క్రమాన్ని ఆరంభించింది. అయితే ఆ క్రమంలో లోక్సభ నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిని, అదేవిధంగా పార్టీ శ్రేణుల పరిధిని దాటి వివిధ ప్రజా వర్గాల పరిధిలోకి ప్రత్యక్షంగా ప్రవేశించాలి. అది ఎందుకు అవసరమో, అందువల్ల కలిగే మేలు ఏమిటో మరొకసారి చెప్పుకోనవసరం లేదు. ఇటువంటి సమీక్షల ప్రక్రియ పార్టీ జయాపజయాలతో నిమిత్తం లేకుండా రాగల కాలంలో కూడా ఒక విధానంగా మారితే అందువల్ల కలిగే మేలు మౌలికం, దీర్ఘకాలికం అవుతుంది. పార్టీకి ఇక తిరుగు ఉండదు, చేదు అనుభవాలు ఉండవు.
టంకశాల అశోక్