ప్రముఖ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ మాటలు నిజమవుతున్నాయి. దేశంలో అప్పుడే పురుడు పోసుకుంటున్న బీఆర్ఎస్ పాత్రపై కొన్నిరోజుల కిందట ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘దేశ జాతీయ రాజకీయాల్లో నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర అవసరమని, ఆ పాత్ర ఎవరు పోషించినా అది ఓ చాలెంజర్ లాంటిదని, అందుకే ‘కౌన్ బనేగా చాలెంజర్’ అనేది దేశ ప్రజల ముందు పెద్ద సవాల్ లాంటి ద’న్నారు. సరిగ్గా నేడు తెలంగాణలో అదే పరిస్థితి కనపడుతున్నది.
ఏదేమైనా బీజేపీ ఆగడాలు శృతి మించిపోతున్నాయి కాబట్టి తెలంగాణ ప్రజానీకం అప్రమత్తం కావాల్సిన అవసరం ఉన్నది. కేంద్రసంస్థలు దర్యాప్తు పేరుతో ఇక్కడి నాయకులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ప్రతి తెలంగాణ పౌరుడు నిద్ర లేవాల్సిన అవసరం వచ్చింది. కుటుంబ పెద్ద కష్టాల్లో కూరుకుపోతే అది మనకూ నష్టమే కదా?
దేశానికే అన్నపూర్ణగా మారుతున్న పసికూన తెలంగాణ. ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టడానికి బీజేపీ అనకొండలా అర్రులు చాస్తున్నది. మొన్నటికి మొన్న ప్రభుత్వాన్ని కూల్చాలనే బీజేపీ ఎత్తుగడలను ముఖ్యమంత్రి కేసీఆర్ తన రాజకీయ చతురతతో తిప్పికొట్టారు. ఆయన్ను చూసి యావత్భారతం గర్వపడింది. ఆయన దెబ్బకు తేరుకోని బీజేపీ మరోమారు ధ్వంస రచనకు పూనుకున్నది. మదపుటేనుగులా తయారైన ఈడీ, సీబీఐలతో ప్రభుత్వ పెద్దలపై దాడులు చేయిస్తున్నది. తెలంగాణ రక్తంలో నిఖార్సయిన ఉద్యమ భావజాలం ఇంకా ఆవిరి కాలేదనే సత్యం, దాడులకు భయపడని మంత్రుల మొక్కవోని ధైర్యంతో తేటతెల్లమైంది. ఆవును ఎదుర్కొలేని పులి, దూడ దూడపై పడ్డట్టు… బీజేపీ ధ్వంస రచనల్లో సరికొత్త వ్యుహం పన్నింది. ముఖ్యమంత్రి కూతురు కల్వకుంట్ల కవితపై నిరాధార ఆరోపణలతో వివరణ అనే ముసుగులో సీబీఐ ద్వారా నోటీసులు జారీచేసింది. ఇదే అదనుగా కేసీఆర్ కుటుంబంపై బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ బురద జల్లడం షురూజేసింది.
వాస్తవాలను కప్పిపుచ్చుతూ బట్టకాల్చి మీదేసే ప్రయత్నానికి బీజేపీ శ్రేణులు ఒడిగడుతున్నాయి. ఈ తరుణంలో ఆగ్రహావేశాలకు గురైన బీఆర్ఎస్ శ్రేణులు కవితకు సంఘీభావం తెలియజేస్తుండటం శుభ పరిణామం. అసలు బీజేపీ దేశానికి ఒక దుష్టశక్తిలా తయారైంది. నయవంచక, నికృష్ట రాజకీయాలతో సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ కాషాయ పార్టీ ఎన్నెన్నో నీతిమాలిన విధానాలకు పూనుకుంటున్నది. ‘ఆజాదీ కా అమృతోత్సవ్’ సందర్భంలో గుడ్డి గుర్రంలా తయారైంది. గుజరాత్ ఎన్నికల సమయంలో బీజేపీ చేసిన విషప్రచారం నాగరిక సమాజానికి మంచిది కాదు.
లౌకిక భావనకు గొడ్డలి పెట్టు వంటిది. 2002, గుజరాత్లో ముస్లిం మైనారిటీలపై జరిగిన హింసాకాండను హోంమంత్రి హోదాలో అమిత్ షా సమర్థించడం సిగ్గుచేటు. స్వాతంత్య్రం లభించిన తర్వాత మైనారిటీలపై జరిగిన అతిపెద్ద హింసాకాండ అది. బిల్కిస్ బానో కుటుంబసభ్యులపై దారుణ అత్యాచారాలకు పాల్పడిన రేపిస్టులను జైలు నుంచి విడుదల చేయడం సిగ్గుచేటు. మతహింస బాధితులకు న్యాయం కోసం పోరాడిన తీస్తా సెతల్వాద్, ఆర్బీ శ్రీకుమార్లను జైలుపాలు చేసింది బీజేపీ ప్రభుత్వం. ఇంతటి అరాచక విధానాలకు పాల్పడే బీజేపీ దేశాన్ని అభివృద్ధి చేస్తుందంటే నమ్మశక్యం కాదు. అందుకే బీఆర్ఎస్ రూపంలో వస్తున్న కేసీఆర్ను ఆదిలోనే అడ్డుకునేందుకు కుటిల నీతిని ప్రదర్శిస్తున్నది.
అసలు గుజరాత్ అభివృద్ధి నమూనాను పరిశీలిస్తే బీజేపీ డొల్లతనం బయటపడుతుంది. అక్కడి ప్రభుత్వం కార్పొరేట్-మతోన్మాదశక్తుల సమ్మేళనం. ఈ దుష్టశక్తులు అక్కడి ప్రభుత్వానికి జోడెద్దుల పాత్ర పోషిస్తున్నాయి. వాణిజ్యసంస్థల చేతుల్లో ఆస్తులు పోగుపడటంతో పారిశ్రామికరంగం అభివృద్ధి చెందింది. కానీ నాణేనికి మరోవైపు అన్నట్లు అత్యంత అల్పస్థాయిలో కార్మికులకు వేతనాలు చెల్లిస్తున్నారు. ఈ విధంగా సామాజిక, ఆర్థికసూచికకు మధ్య ఎంతో వైరుధ్యం ఉన్నది. అదే తెలంగాణలో పరిశీలిస్తే పలు సంక్షేమ పథకాల ద్వారా బడుగు, బలహీనవర్గాలకు సుమారు లక్ష కోట్లు నిధులు వెళ్లడం ద్వారా ఇక్కడ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. గుజరాత్ ఎన్నికల విష ప్రచారంపై రిటైర్డ్ బ్యూరోక్రాట్ ఈఏఎస్ శర్మ ఎన్నికల కమిషన్కు లేఖ రాసినా ఎలాంటి స్పందన లేకపోవడం శోచనీయం.
బీజేపీ అమలుచేస్తున్న దిక్కుమాలిన విధానాలతో దేశానికి మరో ప్రమాదం పొంచి ఉన్నది. గ్రామీణ పేదలకు సంజీవనిగా పనిచేస్తున్న ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడిచే కార్యక్రమానికి బీజేపీ బరితెగించింది. గ్రామీణ అభివృద్ధి శాఖ మాజీ కార్యదర్శి అమర్ జిత్ సిన్హా నేతృత్వంలో ఉపాధిహామీ చట్టంలో మార్పుల కోసం కమిటీ వేసింది. దీనివెనుక అసలు లక్ష్యాలు వేరే ఉన్నాయనేది నగ్న సత్యం. బీజేపీ తీసుకునే నిర్ణయాలను బట్టి అర్థమవుతుంది. ప్రధానిగా మోదీ అధికారంలోకి వచ్చాక 4 శాతం ప్రజలు దేశవ్యాప్తంగా ఉపాధికి దూరమయ్యారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారిలో 18 శాతం మంది తిరస్కరణకు గురవుతున్నారు. ఏడాది, తొలి అర్ధ సంవత్సరంలోనే సుమారు కోటిన్నర మంది ప్రజలకు ఉపాధిహామీని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిందంటే ప్రధాని మోదీని నయా తుగ్లక్గా తప్పకుండా భావించాలి.
ఏదేమైనా బీజేపీ ఆగడాలు శృతిమించిపోతున్నాయి కాబట్టి తెలంగాణ ప్రజానీకం అప్రమత్తం కావాల్సిన అవసరం ఉన్నది. కేంద్రసంస్థలు దర్యాప్తు పేరుతో ఇక్కడి నాయకులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ప్రతి తెలంగాణ పౌరుడు నిద్ర లేవాల్సిన అవసరం వచ్చింది. కుటుంబ పెద్ద కష్టాల్లో కూరుకుపోతే అది మనకూ నష్టమే కదా? సీఎం కేసీఆర్ కాకుండా తెలంగాణను రక్షించేది ఇంకెవరని ప్రతి తెలంగాణ పౌరుడు ఆత్మవిమర్శ చేసుకోవాలి. అసలే ఆర్థికమాంద్యం రాబోతున్నదని ప్రపంచ మేధావులు నొక్కిచెప్తున్నారు. కరోనా కాలంలో బీజేపీ దిక్కుమాలిన నిర్ణయాలతో యావత్ దేశ ప్రజలు ఏవిధంగా ఇబ్బందులు పడ్డారో కండ్లముందు ఆ చిత్రాలు కనబడుతూనే ఉన్నాయి. కాబట్టి రాజ్దీప్ సర్దేశాయ్ మాటల ప్రకారం.. కేసీఆర్కు అండగా మనందరం చాలెంజర్ పాత్ర పోషిద్దాం!
(వ్యాసకర్త: టీఆర్ఎస్ పార్టీ
సీనియర్ నాయకులు)
-మఠం బిక్షపతి
95424 23242