ఉపాధ్యాయుడు సమాజానికి వెన్నెముక. ‘దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది’ అని ఒక మహానుభావుడు అన్నారు. ‘టీచర్ ఒక సోషల్ ఇంజినీర్’ అని ఇంకో మహానుభావుడన్నారు. వీటిని పరిశీలిస్తే దేశాభివృద్ధి ఉపాధ్యాయుల భుజస్కంధాలపై ఉన్నదని అర్థమవుతున్నది. దీన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల 5,089 టీచర్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసింది. టీచర్లు, అధ్యాపకుల సమస్యలను మానవీయ కోణంలో అర్థం చేసుకొని పరిష్కరిస్తున్నది. వారి కృషికి తగ్గ వేతనాలను అందిస్తూ వారిని గౌరవిస్తున్నది.
ఉపాధ్యాయ నియామక పరీక్షల్లో పారదర్శక విధానాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నది. డీఎస్సీ పరీక్షను కంప్యూటరైజ్డ్ పద్ధతిలో నిర్వహిస్తూ ప్రతిభావంతులకు తగిన న్యాయం చేస్తున్నది. లోకల్, నాన్లోకల్ కోటా రిజ్వరేషన్ను 80:20 నుంచి 95:5 శాతానికి పెంచింది. 71,400 మంది అంగన్వాడీలు, సహాయకుల ఉద్యోగ విరమణ వయస్సును 65 ఏండ్లకు పెంచింది. ఉద్యోగ విరమణ సమయంలో అంగన్వాడీ టీచర్లకు రూ.1 లక్ష, సహాయకులకు రూ. 50,000/- చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్వాడీ టీచర్ల వేతనాలను రూ.4200 నుంచి రూ.13,650కి పెంచింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అంగన్వాడీ టీచర్లకు ఫిట్మెంట్ అమలు చేస్తున్నది. అంగన్ వాడీ టీచర్లకు మూడుసార్లు వేతనాలను పెంచింది కేసీఆర్ ప్రభుత్వం. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో పనిచేస్తున్న 567 కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపింది. 2007లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వీరితో పనిచేయించిన నాటి పభుత్వం వేతనాలను మాత్రం సమానంగా ఇవ్వలేదు. కానీ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం టీచర్ల సమస్యలను మానవీయ కోణంలో ఆలోచించి పరిష్కరించింది. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ అధ్యాపకులకు ప్రొఫెసర్ హోదా కల్పించింది.
ఆధునిక విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయుడు నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి. ఆధునిక సామాజిక మార్పులకు అనుగుణంగా మారుతుండాలి. ఆధునిక యుగంలో ఉపాధ్యాయుడిపై గురుతర బాధ్యత ఉన్నది. ఆధునిక సాంకేతికాభివృద్ధి కారణంగా మొబైల్, ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాల ఉచ్చులో చిక్కుకొని విద్యార్థులు దురలవాట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి వారిని సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత ఉపాధ్యాయుడిదే. ఆధునిక ఉపాధ్యాయులు నైతిక విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించాల్సిన అవసరం ఉన్నది. ఆధునిక ఉపాధ్యాయుడు విద్యార్థికి ఒక స్నేహితుడిగా, ఒక తత్వవేత్తగా, ఒక మార్గదర్శకుడిగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఉపాధ్యాయులు ఉన్నత ప్రమాణాలను పాటించి దేశానికి మంచి పౌరులను అందించాల్సిన బాధ్యత ఉన్నది. ఉపాధ్యాయులు తమ అలవాట్లలో, ఆలోచనల్లో, జీవిత విధానంలో ఆదర్శంగా ఉండాలి. నైతిక విలువలు నేర్పకపోవడం వల్ల సమాజంలో చదువురాని వారి కంటే చదువుకున్న వారే ఎక్కువగా సామాజిక నేరాలకు పాల్పడుతున్నారు. ఒకనాడు బతకలేని బడి పంతుల్ని నేడు గౌరవంగా బతక గలిగిన స్థాయికి చేర్చింది ఈ సమాజం. కాబట్టి ఉపాధ్యాయులు సమాజానికి రుణపడి ఉన్నారు!
(వ్యాసకర్త: విశ్రాంత ప్రధానాచార్యులు)