భూమిలో లభించే బొగ్గు ఇంధన ఉత్పత్తిలో ప్రముఖ భూమిక పోషిస్తుంది. అయితే బొగ్గు గనుల కార్మికులు వృత్తి జీవితంలో ఎదుర్కొనే కష్టాలు, ప్రమాదాల గురించి సాధారణ ప్రజలకు అంతగా తెలియదు. వారి శ్రమ దోపిడీ గురించి కూడా బయటి ప్రపంచానికి అవగాహన లేదు. అయితే కొన్ని సంవత్సరాలుగా బొగ్గు గనుల కార్యకలాపాలు, కార్మికుల జీవితాల గురించి సినిమాలు రావడం గొప్ప పరిణామంగా భావించాలి.
భారత్లో మొదటిసారిగా పశ్చిమ బెంగాల్లో దామోదర్ నది ఒడ్డున రాణిగంజ్ గనిలో 1774లో మెస్సర్స్ సమ్మర్ హిట్లీ ఆఫ్ ఇండియా కంపెనీ బొగ్గు తవ్వకాలు ప్రారంభించింది. అనంతరం ప్రస్తుతం కోల్ ఇండియా అనుబంధ సంస్థల ఆధీనంలో దక్షిణ భారతదేశంలో సింగరేణి కాలరీస్ కంపెనీ ద్వారా 1889 నుంచి బొగ్గు ఉత్పత్తి జరుగుతున్నది. బొగ్గు గనుల కార్మికుల కష్టాలు, వారు ఎదుర్కొనే ప్రమాదాలు, అధికారులు చేసే శ్రమ దోపిడీ గురించి కొన్ని దశాబ్దాల నుంచి భారత్లో సినిమాలు వస్తున్నాయి. 1980 దశకంలో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ నటించిన కాలా పత్తర్తో ఈ ట్రెండ్ మొదలైంది.
ఝార్ఖండ్లో 1979లో చసనాలా బొగ్గు గనిలో జరిగిన నీటి ప్రమాదంలో దాదాపు 300 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఉదంతం ఆధారంగా ఈ సినిమా తీశారు. ఝార్ఖండ్లోని ధన్బాద్లో మాఫియా ముఠాల వైరంపై 2014లో గ్యాంగ్ ఆఫ్ వస్సీపూర్ సిని మా వచ్చింది. వినోద్ ఖన్నా, సునీల్ శెట్టి నటించిన ‘కోయలాంచల్’ చిత్రం కూడా శక్తివంతమైన బొగ్గు మాఫియా కథ చుట్టే తిరుగుతుంది. ధన్బాద్లో అక్రమ బొగ్గు తవ్వకాలు, అక్రమ రవాణా ఎలా జరుగుతాయో ఈ చిత్రంలో చూపించారు. నడుస్తున్న రైళ్లలో బొగ్గు దొంగతనం చేసి మాఫియా డాన్గా మారిన ఇద్దరు మిత్రుల కథతో తెరకెక్కిన రణవీర్ సింగ్, అర్జున్ కపూర్ నటించిన ‘గుండే’ చిత్రం విజయాన్ని సాధించింది.
టాలీవుడ్ను పరిశీలిస్తే కృష్ణంరాజు నటించిన చేయెత్తి ‘జై కొట్టు తెలుగోడా’ సినిమాను కొత్తగూడెం ప్రాంతంలో చిత్రీకరించారు. ప్రముఖ నటులు బాలకృష్ణ, విజయశాంతి నటించిన ‘నిప్పు రవ్వ’ సినిమా బొగ్గు గని ప్రమాదాలు, దళారీల శ్రమ దోపిడీ గురించి తీసిందే. సింగరేణి బొగ్గు గని కార్మికుల నిజ జీవితాలను వెండి తెరపై ‘చీకటి సూర్యులు’గా చూపించిన ఘనత విప్లవ నటుడు ఆర్ నారాయణ మూర్తికి దక్కుతుంది. ఈ ఏడాదిలో విడుదలైన నాని నటించిన ‘దసరా’ సినిమా సైతం బొగ్గు గని కార్మికుల కథే. ఈ చిత్రంలో సింగరేణి కార్మికులు మాట్లాడే యాసతో కూడిన భాష హైలెట్!
ప్రముఖ హీరో ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ చిత్రంలోని కొన్ని దృశ్యాలను గోదావరి ఖని ఓపెన్ కాస్ట్లో చిత్రీకరించారు. అక్టోబర్ 6న దేశవ్యాప్తంగా విడుదల కానున్న అక్షయ్ కుమార్ నటించిన ‘మిషన్ రాణిగంజ్’ చిత్రంలో 1989 నవంబర్ 13న పశ్చిమ బెంగాల్ రాణిగంజ్ గని నీటి ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను ఒక క్యాప్సూల్ ద్వారా రక్షించిన వైనాన్ని చూపించారు. ఈ చిత్రాన్ని రిటైర్డ్ ఇంజినీర్ జస్వంత్ సింగ్ గిల్ జీవితం ఆధారంగా నిర్మించారు. ప్రముఖ వెబ్ సిరీస్ నిర్మాత ఏక్తా కపూర్ ‘ధన్బాద్’ వెబ్ సిరీస్ నిర్మిస్తున్నారు. ఒకప్పుడు బొగ్గు గనుల ప్రాంతాలపై చిన్నచూపు ఉండేది. అలాంటి ప్రాంతాలను షూ టింగ్ స్పాట్లుగా గుర్తించడం గొప్ప పరిణామం!
-ఆళవందార్ వేణుమాధవ్
86860 51752