Lok Sabha Elections | బలమైన అభ్యర్థుల కంటే బలహీనమైన అభ్యర్థిని వెతికి పట్టుకోవడం చిన్న విషయం కాదంట. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో జాప్యానికి ఇదే కారణమంటున్నారు. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిని ఇంకా ప్రకటించకపోవడానికి కారణం ఏమిటి? అని ఆ పార్టీ నాయకుడు ఫిరోజ్ఖాన్ను అడిగితే, వీక్ క్యాండిడేట్ దొరకడమంతా ఈజీ కాదు గదా? అని ప్రశ్నిస్తున్నారు. బలమైన అభ్యర్థి అని చెప్పడానికి కొన్ని ప్లస్ పాయింట్లను చూపించవచ్చు, కానీ అదే వీక్ క్యాండిడేట్ అని చెప్పడానికి కొలబద్ద ఏముంటుంది? అంటే దానికి కాంగ్రెస్ కొత్త భాష్యం చెప్తున్నది. హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ బరిలోకి దింపే క్యాండిడేట్ వీక్ అని ఎలా చెప్పగలరంటే, ఆ క్యాండిడేట్ పేరు చెప్పగానే ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ కళ్లలో మెరుపు కనిపించాలంట! శెభాష్ గుడ్ క్యాండిడేట్ అని ఆయన మెచ్చుకోవాలి.
బ్యాక్గ్రౌండ్ వర్క్ !
మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధును గెలిపించడానికి డీసీసీ అధ్యక్షురాలు, తన సతీమణి నిర్మల ప్రత్యక్ష ఎన్నికల ప్రచారానికి పూనుకుంటే, తాను పరోక్ష బ్యాక్గ్రౌండ్ వర్క్కు పరిమితం అవుతున్నట్టు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో బ్యాక్గ్రౌండ్ వర్క్ సరిగ్గా లేకపోవడమే తన ఓటమికి కారణమని అప్పట్లో జగ్గన్న విశ్లేషించారు కూడా. ఈసారి ఆ తప్పు పునరావృతం కాకూడదని తానే స్వయంగా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్టు వివరించారు. పార్టీ అభ్యర్థి సౌండ్ పార్టీ కావడంతో బ్యాక్గ్రౌండ్ వర్క్కు వచ్చిన ఇబ్బందేమీ లేద న్న ధీమాతో ఉన్నారు జగ్గన్న.
గుంటూరు కావ్య
‘గుంటూరు కారం’ టైటిల్, ఆ సినిమాకు ఎంత మేరకు కలిసివచ్చిందో ఏమో, కానీ ప్రస్తుతం ఎంపీ ఎన్నికల్లో మాత్రం ‘గుంటూరు కావ్య’ నినాదంతో బీజేపీ అభ్యర్థి కాంగ్రెస్ ప్రచారాన్ని హీట్ ఎక్కించారు. వరంగల్ నుంచి ఎంపీ అభ్యర్థిగా కడియం శ్రీహరి కూతురు కావ్యను బరిలోకి దించింది. ఆమె భర్త నజీర్ది గుంటూరు. దీంతో బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ లోకల్, నాన్లోకల్ ఫీలింగ్ తీసుకొచ్చి ఆ ‘గుంటూరు కావ్య’ కావాలా? లేక వరంగల్ రమేష్ కావాలా? మీరే నిర్ణయించుకోండంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ‘గుంటూరు కావ్య’ నినాదం బాగానే జనంలోకి వెళ్తున్నదని కమలనాథులు కూడా సంబురపడుతున్నారట.
స్కాన్ చేయండి.. స్కామ్ చూడండి!
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 40 పర్సెంటేజీ ‘పే సీఎం’ నినాదం బీజేపీని గద్దె దించడానికి బలమైన నినాదంగా ఉపయోగపడింది. ఈ వినూత్న ప్రచార వ్యూహాన్ని ఈ సారి పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే పార్టీ అందిపుచ్చుకున్నది. చెన్నై నగరంలో పెద్ద పెద్ద హోర్డింగ్స్, పోస్టర్లు వెలిశాయి. వాటిపై ప్రధాని మోదీ బొమ్మపై క్యూఆర్ కోడ్ ముద్రించి ‘స్కాన్ చేయండి… స్కామ్ చూడండి’ అని రాశారు. మొబైల్ ఫోన్తో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే, బీజేపీ హయాంలో వెలుగు చూసిన ఎలక్టోరల్ బాండ్స్ మొదలుకొని అదానీ షేర్ల కుంభకోణం వరకు ప్రత్యక్షమవుతున్నాయట. బీజేపీని కార్నర్ చేయడానికి ఇదేదో బాగానే ఉందనే టాక్ వచ్చిందంటున్నారు.
– వెల్జాల