విద్యుత్రంగం మనుగడ, విద్యుత్ పంపిణీ విశ్వసనీయత ప్రధానంగా థర్మల్ విద్యుత్ కేంద్రాలపై ఆధారపడి ఉంటుంది. థర్మల్ విద్యుత్ను బేస్లోడ్గా వ్యవహరిస్తారు. బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్కు మాత్రమే అందుబాటులో ఉన్నంత సామర్థ్యం మేరకు వందశాతం పీఎల్ఎఫ్తో నడిపించుకునే వెసులుబాటు ఉంటుంది. జలవిద్యుత్, సౌరవిద్యుత్ సామర్థ్యాలను ఎంత పెంచుకున్నా వాతావరణ పరిస్థితుల మీద ఆధారపడి మాత్రమే ఉత్పత్తికి అవకాశం ఉంటుంది.
ఒక ప్రాంతంలోని పారిశ్రామిక, వాణిజ్య, వ్యవసాయ మానవాభివృద్ధులకు కొలమానం ఆ ప్రాంతంలోని తలసరి విద్యుత్ వినియోగం. ప్రజాజీవితంలో ఇంతటి ప్రాముఖ్యత కలిగిన విద్యుత్తు రంగాన్ని, బొగ్గు గనులను ప్రైవేటీకరించాలని కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఈ మేరకు ‘విద్యుత్ సవరణ బిల్లు-2022’ను తీసుకురావటాన్ని, దేశవ్యాప్తంగా బొగ్గు గనులను వేలం వేయటాన్ని ప్రమాదకర పరిణామాలుగా భావించవచ్చు. గడచిన వేసవికాలంలో దేశవ్యాప్తంగా అన్ని రంగాలు విద్యుత్ కోతలతో సతమతమైన చేదు అనుభవం ఉన్నప్పటికీ, తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు 24 గంటల నిరంతర కరెంటు లభించటానికి ప్రధానకారణం ప్రభుత్వ రంగంలోని సింగరేణి, విద్యుత్ సంస్థలు సవ్యమైన దిశలో కొనసాగడమే.
ప్రపంచంలో బొగ్గును అత్యధికంగా వినియోగించే దేశాలలో మన దేశం రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఉన్న చైనా వినియోగం 3.4 బిలియన్ టన్నులు కాగా, మన దేశం వినియోగం 0.9 బిలియన్ టన్నులు. వచ్చే ఆర్థిక సంవత్సరం ఒక బిలియన్ టన్నుల మార్కును దాటవచ్చని అంచనాలున్నాయి. మన సింగరేణి ఉత్పత్తి 70 మిలియన్ టన్నులు. సింగరేణి బొగ్గు దక్షిణ భారతదేశంలో దాదాపు అన్ని రాష్ర్టాల విద్యుత్ అవసరాలను తీరుస్తున్నది. ప్రపంచంలో ఐదో స్థానంలో ఉన్న మన దేశం బొగ్గు నిల్వలు సుమారు 111 ఏండ్లపాటు దేశీయ అవసరాలను తీర్చగలవు. దీంతోపాటు పెద్ద ఎత్తున బొగ్గు నిల్వలను ఎప్పటికప్పుడు కొత్తగా గుర్తించటం జరుగుతున్నది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న 141 బొగ్గు బ్లాకులను బహిరంగ వేలానికి పెట్టింది. బొగ్గు బ్లాకులను గతంలో మాదిరిగా కేటాయించడం కుదరదని, ప్రభుత్వరంగ సంస్థలు కూడా బహిరంగ వేలంలో పాల్గొని కొనాల్సిందేనని పార్లమెంటులో మంత్రి ప్రహ్లాద్ జోషి సెలవిచ్చారు. ఇదే కేంద్రప్రభుత్వం గుజరాత్లో లిగ్నైట్ బ్లాకులను ఆ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు ప్రత్యేకంగా కేటాయించింది. ఇది కేంద్రం పక్షపాత ధోరణికి ఒక ఉదాహరణ.
‘విద్యుత్ సవరణ బిల్లు-2022’ ద్వారా పం పిణీ రంగాన్ని ప్రైవేట్ పెట్టుబడిదారులకు కట్టబెట్టడం, బొగ్గు గనులను ప్రైవేటీకరించడం కేంద్ర ప్రభుత్వం ఏక కాలంలో తీసుకుంటున్న ప్రజా, రైతు, ఉద్యోగ వ్యతిరేక నిర్ణయం. ఇప్పటికే విద్యు త్ రంగాన్ని ప్రైవేటీకరించడం ద్వారా విపరీతమైన ఫలితాలను చూసిన బ్రిటన్, ఫ్రాన్స్ తదితర అభివృద్ధి చెందిన యూరప్ దేశాలు తిరిగి జాతీయీకరణ దిశగా చర్యలు చేపట్టడం గమనించవల్సిన అంశం. ప్రైవేటీకరణ ప్రజలకు మేలు చేసేటట్లయితే ముంబై మహానగరంలో కరెంటు యూనిట్ రేటు రూ.10-12 ఎందుకు ఉందో సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్ర పాలకులపై ఉంది.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని కేటగిరీల వినియోగదారులకు 24 గంటల విద్యుత్తును అందించడమే కాకుండా రైతులకు ఉచితంగా ఇస్తున్నది. 101 యూనిట్లలోపు వాడుకునే ఎస్సీ, ఎస్టీ గృహవినియోగదారులకు, 250 యూనిట్ల వరకు వాడుకునే రజక, నాయీబ్రాహ్మణ వినియోగదారులకు ఉచిత విద్యుత్తును అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.
పౌల్ట్రీ పరిశ్రమలకు, స్పిన్నింగు మిల్లులకు యూనిట్కు రెండు రూపాయల సబ్సిడీని ప్రోత్సాహకంగా ఇస్తున్నది. ప్రభుత్వరంగంలో విద్యుత్తు సంస్థలు, బొగ్గు గనులు ఉండడం వల్లనే ఇది సాధ్యపడింది. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు రెండు కోట్ల మంది రైతులకు ఉచిత విద్యుత్తు ఇవ్వటం సాధ్యమేనన్న విషయాన్ని గణాంకాలతో సహా దేశ ప్రజల ముందు కేసీఆర్ చర్చకు పెట్టిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు కలిగించడమే కాకుండా, కరెంటు, బొగ్గు ప్రైవేటీకరణ దిశగా దూకుడు పెంచిందని చెప్పవచ్చు. ఉత్పత్తి, ట్రాన్స్మిషన్ రంగాలతో పాటు పోర్టులు, బొగ్గు గనులు కలిగి ఉన్న అదానీ లాంటి కుబేరులకు డిస్కంలను అప్పగించడమే విద్యుత్తు బిల్లు ప్రధాన ఉద్దేశమనేది నిర్వివాదాంశం. థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు తప్పనిసరిగా పది శాతం విదేశీ బొగ్గును బ్లెండింగ్ చేయాలని కేంద్రం ఉత్తర్వులివ్వడం, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీ ఆస్ట్రేలియాలో అదానీ ఆధీనంలో ఉన్న బొగ్గు గనులతో పది మిలియన్ టన్నుల బొగ్గు కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోవడం యాదృచ్ఛికమా? దేశీయంగా రూ.4 వేలలోపు ఉన్న బొగ్గును కాదని రూ.25 వేలు ధర పలికే అదానీ బొగ్గును ఎందుకు కొనాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిలదీసిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం తన ఆదేశాలను సడలించుకోవడం వాస్తవం కాదా?
125 ఏండ్లుగా బొగ్గు ఉత్పత్తికే పరిమితమైన సింగరేణి ఆధ్వర్యంలో 1200 మెగావాట్ల సామర్థ్యం ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలను నెలకొల్పి రాష్ట్ర ప్రజల అవసరాలను తీర్చాలన్న వినూత్న ఆలోచన సీఎం కేసీఆర్ది. ఆ ఆలోచనను కార్యరూపంలోకి తీసుకురావటమేగాక, ఇటీవలే మరో సూపర్ క్రిటికల్ 800 మెగావాట్ల యూనిట్కు అనుమతించడం ఆయన దార్శనికతకు నిదర్శనం. బొగ్గు లభ్యత ఉన్నచోటనే ఉత్పత్తి కేంద్రం నెలకొల్పడం ద్వారా రవాణా ఖర్చులు తగ్గి యూనిటు కనీస ధరకే లభ్యమవుతుంది. అదానీకి సంబంధించిన ఆస్ట్రేలియా బొగ్గుతో జార్ఖండ్లోని గొడ్డ థర్మల్ విద్యుత్ కేంద్రంలో కరెంటు ఉత్పత్తి చేసి, దానిని బంగ్లాదేశ్కు అమ్ముకునే కేంద్ర ప్రభుత్వ వ్యాపారనీతికి, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాసంక్షేమ విధానాలకు తేడా ఇదే. ప్రజల అవసరాలను, ప్రపంచవ్యాప్త ధోరణులను గమనంలోకి తీసుకొని జాతిని నడపించే మార్గదర్శకుడి నాయకత్వమే నేడు మన దేశానికి అవసరం.
(వ్యాసకర్త: ప్రెసిడెంట్-తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్, టీఎస్ఎస్పీడీసీఎల్)
తుల్జారాం సింగ్ ఠాకూర్
78930 05313