ప్రాచీన తెలంగాణలో వైద్యం గురించి ఉన్న ఆధారాలు ఇప్పటివరకు కొన్నే లభించినా, అవి ఈ నేలలో వికసించిన జ్ఞాన సంపదను, నాగరికత నేర్పిన శాస్త్ర విజ్ఞానాన్నీ ఎత్తిచూపుతాయి. నాగార్జున కొండ మీద శాసనంలో విగత జ్వరాలయ ప్రస్తావన, ఫణిగిరి బౌద్ధ విహారంలో అగ్ర భిషక్కు దాన శాసనం, బౌద్ధ విహారాల్లో వైద్యానికి ఉన్న ప్రాముఖ్యాన్ని తెలుపుతుంది. ఇదే క్రమంలో జైనం కూడా తెలంగాణలో జీవనవిధానంగా, ప్రజల మతంగా మారిన కాలంలో వైద్యం జైన బసదుల్లో భాగ మైంది. దానికి నిలువెత్తు ఉదాహరణే వెయ్యేండ్ల కింద తెలంగాణలో ప్రాణాచార్యగా పేరొందిన వైద్యుడు, జైనుడు అగ్గలయ్య.
ఏ వైద్యుడు నయం చేయలేని స్థితిలో ఉన్న రోగాన్ని (ప్రకర్ష), నయం (ఉపక్రమ) చేయగల ఏకైక వైద్యుడు అగ్గలయ్య. ఒక వైద్యుడు వైద్యం, శస్త్ర చికిత్స చేసేవాడనీ, శస్త్ర (సర్జరీ), శాస్త్రం(వైద్యం)లో ఇతడు దిట్ట అనీ, కళ్యాణి చాళుక్య రాజైన మొదటి జగదేకమల్ల (ఇతడిని రెండవ జయసింహుడని కూడా అంటారు) క్రీ.శ.1034లో వేయించిన సైదాపూర్ శాసనం చెప్తుంది. యాదగిరిగుట్ట దగ్గర ఉన్న సైదాపురంలో ఒక స్తంభం శాసనంలో ఉన్న విషయాలను శాసన పరిశోధకులు పీవీ పరబ్రహ్మశాస్త్రి 1977లో ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిస్టరీ మెడిసిన్’ బులెటిన్లో మొదట వెలుగులోకి తెచ్చారు. ఈ స్తంభంపై రెండు వైపులా కన్నడలో, మూడో వైపున సంస్కృతంలో శాసనం ఉన్నది.
కళ్యాణి చాళుక్యరాజు మొదటి జగదేకమల్ల పొట్టలెకెరె (ఇప్పటి సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెర్వు)లో నెలెవీడి (క్యాంప్ ఆఫీస్ లేక ఉప రాజధాని అని అర్థం)లో ఉన్నప్పుడు క్రీ.శ.1034 జూన్లో వచ్చిన చంద్రగ్రహణం రోజున వైద్య రత్నాకర, ప్రాణాచార్య అగ్గలయ్య కోరిక మేరకు చేసిన దాన వివరాలు ఈ శాసనంలో ఉన్నా యి. కొల్లిపాక-7000 (కొలనుపాక ప్రాంతం)లోని ఆలేరు -40 కంపణంలోని రెండు జైన ఆలయాలకు దానం ఇచ్చిన వివరాలున్నాయి. అగ్గలయ్య స్వయంగా కట్టించిన ముచ్చనపల్లిలోని బుద్ధసేన జినాలయానికి, ఇక్కురికి (ఇప్పటి ఇక్కుర్తి) లోని వైద్యరత్నాకర జినాలయానికి చేసిన దానం, దానిమీద వచ్చే ఆదాయ వివరాలు శాసనంలో ఉన్నాయి.
ఈ శాసనంలో అగ్గలయ్యను వర్ణించిన విధానం ఆయన గొప్పతనాన్ని చెప్తుంది. అగ్గలయ్య జైనుడు, మంచివాళ్లకు మిత్రుడు. ఇతడి పనులన్నీ ప్రజల ఆరోగ్యం, మిత్రుల సంక్షేమం కోసం, జిన గురువుల బోధనల ప్రకారం ఉంటాయి. ఇతర వైద్యుల సందేహాలను నివృత్తి చేస్తున్న బ్రహ్మలాంటి వాడు అని చెప్తుంది. ఇంతటి గొప్పదనం వల్లే అగ్గలయ్య ముచ్చనపల్లికి గావుండ (అధికారి)గా, మహాసామంతగా కూడా పదవులు పొందాడు.
జగదేక మల్ల తర్వాత 24 ఏండ్లకు అధికారంలోకి వచ్చిన భువనైకమల్ల (ఇతడి ఇంకో పేరు రెండవ సోమేశ్వర) పాలనలో అగ్గలయ్య గురించిన వివరాలు సంగారెడ్డి జిల్లా నారాయణ్ఖేడ్ దగ్గరి సిరూర్లో దొరికిన రెండు శాసనాల్లో ఉన్నాయి. ఒక శాసనంలో అగ్గలయ్యను మహా సామంత అగ్గలరస అని చెప్పడం వల్ల ఇతడు మహా సామంత పదవి పొందాడని తెలుస్తున్నది. ఈ శాసనాల్లోనే ఇతడు జైన శాసనదేవి పద్మావతిని, బాహుబలిని కొలిచేవాడనీ తెలుస్తుంది. జైన మతపరంగా అగ్గలయ్య శ్రీ యాపనీయ మదువ గణానికి చెందినవాడు. సిరూర్లోని ఒక శాస నం అగ్గలయ్య భార్య వల్లికాంబె దాన గుణాన్ని గురించి వర్ణిస్తుంది.
అగ్గలయ్య కథ ఇప్పుడు రెండు, మూడు శాసనాల్లో, అగ్గలయ్య గుట్ట మీద విగ్రహాల రూపంలో, ఇక్కుర్తిలో శిథిల ఆధారాలుగా మిగిలి ఉంది. అయితే ఈ ఆధారాలు చెప్పేది కేవలం అగ్గలయ్య కథ మాత్రమే కాదు. ఇవి రికార్డు చేసింది కళ్యాణి చాళుక్య కాలంలో విలసిల్లిన సమాజం, జైనంతోపాటు నిలిచిన వైద్య విజ్ఞానాన్ని. చరిత్ర పరిశోధనలో ఇప్పటికీ పెద్దగా పట్టించుకోని అధ్యాయం నాటి కాలాల్లో వైజ్ఞానిక వికాసం. అగ్గలయ్య మన పరిశోధనలు ఈ దిశగా సాగాలని చెప్తూ ఆధారాలను విడిచివెళ్లాడు. తెలంగాణ సమాజ గమనంలో వివిధ కాలాల్లో ఇంకెంత మంది అగ్గలయ్యలున్నారో తెలువదు. నేషనల్ ఇనిస్ట్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్, తెలంగాణ చరిత్ర పరిశోధకులు ఈ కోణంలో మరింత శోధన చేయాలి.
అగ్గలయ్య గుట్టగా పేరున్న ఒకే ఒక గుట్ట హనుమకొండ పట్టణంలో ఉన్నది. ఈ గుట్ట మీద 30 అడుగుల శాంతినాథ విగ్రహం, 15 అడుగుల పార్శ్వనాథ విగ్రహం, జైన మునులను పోలిన విగ్రహాలు, రాతిని తొలిచి కట్టిన గదులున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిరక్షించుకున్న వారసత్వ స్థలాల్లో ఇదొకటి. స్థానిక ఎమ్మెల్యే వినయ్భాస్కర్, అప్పటి కలెక్టర్ ఆమ్రపాలి చొరవ, అరవింద్ ఆర్య శ్రమ, తపన ఫలితంగా ఈ గుట్ట ఒక దర్శనీయ ప్రదేశంగా మారింది.
డా. ఎం.ఏ. శ్రీనివాసన్
81069 35000