తిరిగి తిరిగి కథ కంచికి చేరిందో లేదో తెలియదుకానీ తెలంగాణ కథ మాత్రం తిరిగి తిరిగి బోధన్కు చేరుకుంది. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో అస్సక మహాజనపదం రాజధాని బోధన్. ఆ తర్వాత బోధన్, రాజధానిగా లేదు. తిరిగి క్రీస్తు శకం 750 ప్రాంతంలో మళ్ళీ తెలంగాణ చరిత్రలో వస్తున్న రాజకీయ మార్పులకు సాక్షిగా నిలిచింది. రాష్ట్రకూటుల పాలనలో ఒక ముఖ్య కేంద్రంగా మారింది.
రాష్ట్ర కూటులు హైదరాబాద్ పశ్చిమ ప్రాం తంలో అంటే నేటి సంగారెడ్డి, నల్గొండ జిల్లాలలో కృష్ణా-తుంగభద్ర ప్రాంతాలలో ప్రత్యక్ష పాలన మొదలుపెట్టిన తర్వాత.. మిగిలిన తెలంగాణ ప్రాంతాన్ని తమ సామంతులైన వేములవాడ చాళుక్యుల ద్వారా పాలించారు. ఈ వేములవాడ చాళుక్యుల ప్రస్థానం బోధన్లోనే మొదలైంది. అం దుకే వీరిని బోధన్ చాళుక్యులని కూడా అంటారు. బోధన్ మళ్ళీ కేంద్రంగా ఎలా మారిం ది? ఎందుకంటే మంజీర-గోదావరి మధ్య ఉన్న సారవంతమైన భూమి కాబట్టి.
క్రీ.శ.650 నుంచి ఒక వందేండ్లపాటు వేములవాడ చాళుక్య వంశ మొదటి పాలకులు సత్యాశ్రయ, పృథ్వీపతి, మహారాజ, రాజాదిత్యలు. ఆ తర్వాత వచ్చిన వినయాదిత్య యుద్ధమల్ల.. రాష్ట్రకూట రాజైన దంతిదుర్గ ఉత్తర భారతంలో చేసిన యుద్ధాల్లో పాల్గొని విజయాల్ని సంపాదించినందుకు బోధన్ ప్రాంతానికి రాజుగా నియమితుడయ్యాడని అనుకోవచ్చు. యుద్ధమల్ల గురించి, అతని పూర్వీకుల గురించి గుంటూరు జిల్లా కొల్లిపరలో దొరికిన రాగి రేకు శాసనం చెపుతుంది. సంస్కృత భాషలో, తెలుగు-కన్నడ లిపిలో ఉన్న ఈ శాసనాన్ని యుద్ద్ధమల్ల కొడుకైన మొదటి అరికేసరి జారీ చేశాడు.
నూనెలో స్నానం చేసిన ఏనుగులు
వేములవాడలో భీమేశ్వర ఆలయంలోని (దీనినే పాత బద్దెగేశ్వర ఆలయం అంటారు) ఒక స్తంభంపై 108 పంక్తుల శాసనం ఉంది. అందులో వేములవాడను లేంబులవాటక అనీ, యుద్ధమల్ల సపాదలక్ష దేశాన్ని పాలించాడని చెపుతుంది. సపాదలక్ష దేశం అంటే 1,25,000 గ్రామాలున్న దేశం అని అర్థం. సపాదలక్ష దేశం అంటే ఏమిటన్న దానిపై సవాలక్ష సందేహాలు, సిద్ధాంతాలు ఉన్నాయి. దానిని పక్కనపెడితే, యుద్ధమల్ల బోధన్ కేంద్రంగా మంజీర-గోదావరి ప్రాంతాల్ని పాలించాడని ఊహించవచ్చు.
ఇదే శాసనంలో పోదన (బోధన్)లో చెరువు నిండా తైలాన్ని నింపి దాంట్లో తన 500 ఏనుగుల్ని స్నానం చేయించేవాడని రాసి ఉంది. ఈ వర్ణనతో తెలిసేది.. ఆ కాలంలో ఏనుగులకు తేల్ మాలిష్ చేసి స్నానం చేయించేవాళ్ళని కాదు, ఇది యుద్ధమల్ల గజ బలగాన్ని, సైన్య బలాన్ని సూచిస్తుంది. ఇదే కాలంలో కన్నడ ఆదికవి పంప రాసిన విక్రమార్జున విజయంలో బోధన్ పేరు బహుధాన్యపురం అని రాసి ఉంది.
బోధన్ నుంచి ఎములాడ చేరిన రాజధాని
యుద్ధమల్ల తర్వాత రాజైన మొదటి అరికేసరి కాలంలో రాజధాని వేములవాడకు మారిందని చరిత్రకారుల అంచనా. ఇదే కాలంలో వేంగీ చాళుక్యులతో వేములవాడ చాళుక్యుల వైరం మొదలైంది. రాష్ట్రకూటుల సామంతులైనందున వేములవాడ పాలకులు.. రాష్ట్రకూటుల విరోధులైన వేంగితో (ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు సమీపంలోని రాజ్యంతో) ఎన్నో యుద్ధాలు చేశారు. వేములవాడతోపాటు కరీంనగర్ జిల్లాలోని గంగాధర కూడా వేములవాడ రాజ్య అధికార కేంద్రంగా కొన్ని సందర్భాల్లో ఉండింది. అందుకే ఇప్పటికీ వేములవాడ, గంగాధరలలో ఎన్నో ఆధారాలు మనకు దొరుకుతున్నాయి. మొత్తానికి బోధన్ నుంచి వేములవాడకు చేరిన వేములవాడ చాళుక్య రాజకీయం తెలంగాణ మధ్య యుగ చరిత్రలో ప్రముఖంగానే ఉండింది. ఎందుకంటే వేములవాడ చాళుక్యుల పతనం తర్వాత స్థానిక పాలక వర్గాలు, చిన్న చిన్న సామంత రాజ్యాలు ఏర్పడటం ఇక్కడి రాజకీయ పరిణతిని సూచిస్తున్నాయి. ఈ సామంత రాజ్యాల పునాదిపైనే 300 ఏండ్ల తర్వాత వచ్చిన కాకతీయ రాజ్య పునాది నిలిచింది.
మతం విషయంలో వేములవాడ చాళుక్య కాలం.. తెలంగాణలో శైవం, జైనం ప్రాభవం బాగా విస్తరిస్తున్న కాలం. మత విశ్వాసాల సహజీవనం, జైన, శైవ మతాల్ని రాజులు, పాలక వర్గం ఆదరించడంతో కొత్త శైవ మందిరాలు, జైన ఆలయాలు, బసదులు కట్టడం జరిగింది. బౌద్ధం క్రమంగా ప్రాభవం కోల్పోతున్న కాలంలో అప్పుడు ఏర్పడిన వైదికేతర మతం ఖాళీని జైనం పూర్తి చేసింది.
భాషా సాహిత్యాల విషయానికి వస్తే మధ్యయుగంలో వచ్చిన జైన సాహిత్యం ఈ కాలంలోనే పెద్ద ఎత్తున వచ్చింది. కన్నడ భాష వికసించింది. తెలుగు సాహిత్య ప్రక్రియలు మొదలవుతున్న కాలం అది. కన్నడ, తెలుగు సాహిత్యాలు కలిసి ప్రభవించిన కాలం. వేములవాడ చాళుక్యుల రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక, మత ప్రాభవాన్ని వచ్చే వారాల్లో విపులంగా చర్చించుకుందాం.
బోధన్ నుంచి వేములవాడకు చేరిన వేములవాడ చాళుక్య రాజకీయం తెలంగాణ మధ్య యుగ చరిత్రలో ప్రముఖంగానే ఉండింది. ఎందుకంటే వేములవాడ చాళుక్యుల పతనం తర్వాత స్థానిక పాలక వర్గాలు, చిన్న చిన్న సామంత రాజ్యాలు ఏర్పడటం ఇక్కడి రాజకీయ పరిణతిని సూచిస్తున్నాయి. ఈ సామంత రాజ్యాల పునాదిపైనే 300 ఏండ్ల తర్వాత వచ్చిన కాకతీయ రాజ్య పునాది నిలిచింది.
తిరుగులేని యుద్ధతంత్రం
వేములవాడ చాళుక్యులు తెలంగాణ చరిత్రలో ఎందుకు గుర్తుండిపోతారు? ఏ రాజ్యమైనా, సమాజంలో జరుగుతున్న మార్పుల్ని అందిపట్టుకుని వాటిని ముందుకు తీసుకుపోవాలి, లేదా కొత్త మార్గం వేయాలి. అప్పుడే వాళ్ళ ముద్ర చరిత్రలో నిలుస్తుంది. ఈ విధంగా చూసినప్పుడు వేములవాడ చాళుక్యుల విశిష్టతలు ఈ విధంగా కనిపిస్తాయి. అవి.. 1. శాతవాహనుల తర్వాత చాలా శతాబ్దాలకు ఉత్తర తెలంగాణాలో ఒక రాజధాని, కేంద్రం ఏర్పడింది. 2. దక్షిణ భారతంలో రాష్ట్రకూటుల ప్రధానబలం వేములవాడ చాళుక్యులు. రాష్ట్రకూటులకు వేంగి చాళుక్యులకు మధ్య జరిగిన యుద్ధాల్లో వేములవాడ చాళుక్యులు ప్రధానపాత్ర పోషించారు. ఉదాహరణకు వేములవాడ చాళుక్య రాజైన బద్దెగ ఎంతటి మహావీరుడంటే 42 యుద్ధాల్లో పరాజయం ఎరుగనివాడు. అందుకే సోలద గండ బిరుదాన్ని పొందినవాడు. వేంగి చాళుక్య రాజైన చాళుక్య భీముడిని బద్దెగ ఎలా ఓడించాడో చెప్పే వర్ణన ఉంది. నీటి నుంచి మొసలిని బయటికి లాగినట్టు చాళుక్య భీముడిని ఓడించాడని దాంట్లో చెప్పడం వేములవాడ చాళుక్య యుద్ధతంత్రాన్ని వెల్లడిస్తుంది.
–డా. ఎం.ఏ. శ్రీనివాసన్
81069 35000