భారతదేశ పరిస్థితికి, ఈ దేశ పాలకులకు ‘ఇంట్లో ఈగల మోత.. వీధిలో పల్లకీల మోత..’ సామెత సరిగ్గా సరిపోతుంది. మాటలు కోటలు దాటుతాయి కానీ, చేతలు పేదోడికి ఒక పూట తిండి కూడా పెట్టడం లేదు. ఫలితంగా ‘ప్రపంచ ఆకలి సూచీ-2022’లో భారతదేశ స్థానం మరింత దిగజారింది. మోదీ ప్రధాని అయిన 2014లో భారత్ ర్యాంకు 55కాగా, ఈ ఏడాది 107కు చేరుకున్నాం.
తమను మించిన పాలకుల్లేరని గొప్పలకు పోవడం మోదీ సర్కారుకు అలవాటైపోయింది. ‘మోదీ ఆహా.. ఓహో..’ అంటూ వచ్చే నివేదికలను స్వయంగా పాలకులే ప్రచారం చేసుకుంటారు. కానీ, దేశ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని ఓ అంతర్జాతీయ సంస్థ చెప్తే మాత్రం కేంద్రంలోని బీజేపీ సర్కారుకు, ఆ పార్టీ నాయకులకు మింగుడుపడటం లేదు. ఈ మధ్య ‘ప్రపంచ ఆకలి సూచీ-2022’ నివేదిక విడుదలైంది. మన పొరుగు దేశాలైన పాక్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ కంటే భారత్ తక్కువ ర్యాంకులో ఉన్నది. మొత్తం 121 దేశాలను పరిగణనలోకి తీసుకొని ర్యాంకులను నిర్ధారిస్తే, అందులో భారత్ 107వ స్థానంలో నిలిచింది.
‘పోషకాహార లోపం, శిశువుల్లో తీవ్ర పోషకాహార లోపం, వయస్సుకు తగిన ఎత్తు లేకపోవడం, చిన్నారుల మరణాలు’ అనే నాలుగు సూచికల ఆధారంగా ‘ప్రపంచ ఆకలి సూచీ’ని రూపొందిస్తారు. దేశాల్లో పరిస్థితులను బట్టి సున్నా నుంచి 100 వరకు స్కోర్ కేటాయిస్తారు. స్కోరు పెరగటం అంటే ఆకలి కేకలు పెరిగినట్లు. సున్నా స్కోరు సాధించిన దేశం అత్యుత్తమైనదని అర్థం. 2014లో మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు భారత్ స్కోరు 28.2కాగా, ర్యాంకు 55. ప్రస్తుతం స్కోరు 29.1. ర్యాంకు 107. అంటే దేశంలో ఆకలితో అలమటిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నదన్న మాట.
2030 నాటికి ప్రపంచంలో ఆకలితో అలమటించేవారు ఉండకూడదనే లక్ష్యంతో ‘ప్రపంచ ఆకలి సూచీ’ని 2006 నుంచి విడుదల చేస్తున్నారు. ఇప్పుడు విడుదలైనది 17వ నివేదిక. ఒక ఏడాది స్కోరు పెరిగితే మరో ఏడాది తగ్గించుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. కానీ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. ప్రజల ఆకలి కేకలు అరికట్టడంలో బెలారస్ మొదటి స్థానంలో ఉండగా చైనా, తుర్కియే, లిథువేనియా, సెర్బియా, రొమానియా, కువైట్, ఉరుగ్వే, చిలీ దేశాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
2014లో భారత చిన్నారుల్లో పోషకాహార లోపం 15.1 శాతంగా ఉండగా, తాజా నివేదికలో ఇది 19.3 శాతానికి పెరిగింది. ‘ప్రపంచ ఆకలి సూచీ’ ప్రకారం భారత్లో పౌష్టికాహార లోపం 2018-2020 మధ్య 14.6 శాతంగా ఉండగా, 2019-2021 మధ్య ఇది 16.3 శాతానికి పెరిగింది. ప్రపంచంలోని మొత్తం 82.8 కోట్ల మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతుండగా, ఇందులో 22.4 కోట్ల మంది భారతీయులే. భారత్ సహా 44 దేశాల్లో పరిస్థితి అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్నదని తాజా నివేదిక స్పష్టం చేస్తున్నది.
‘భారత్ భేష్’ అంటూ.. కొన్ని సంస్థలు నివేదికలు ఇవ్వగానే జబ్బలు చరుచుకునే మోదీ సర్కారు.. ‘ప్రపంచ ఆకలి సూచీ-2022’ను మాత్రం జీర్ణించుకోలేకపోతోంది. తమ వైఫల్యాలు బయటపడ్డాయనే అక్కసుతో నివేదిక బోగస్ అంటూ కొత్త రాగం అందుకున్నది. కావాలనే భారత్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా నివేదిక ఇచ్చారని స్వయంగా కేంద్ర ప్రభుత్వ మహిళా, శిశు అభివృద్ధి సంక్షేమ శాఖ ప్రకటన విడుదల చేయడం విడ్డూరం. ఏదైనా సరే బాగుందంటే నెత్తిన పెట్టుకోవడం, బాగాలేదని చెప్తే తులనాడటం బీజేపీ పాలకులకు మొదటినుంచి అలవాటు కదా?
దేశ సంపదను కేంద్రం కార్పొరేట్లకు ధార పోస్తున్నదనేది జగమెరిగిన సత్యం. అప్పుల భారం తీర్చుకోవడానికి ప్రభుత్వరంగ సంస్థలను తన మిత్రులకు అప్పనంగా కట్టబెడుతున్నది. అక్కడినుంచి తెచ్చిన డబ్బులు ఏమయ్యాయో ఎవరికీ తెలియదు. పైగా మోదీ ప్రధాని అయ్యాక ఎనిమిదేండ్లలో వంద లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చారు. అయినా దేశ పరిస్థితి ఆందోళనకరంగా తయారవుతున్నది.
‘ఆకలి కేకల’కు కారణమేమిటి?:
భారత్ పేద దేశం కాదు, అభివృద్ధి చెందుతున్న దేశం. అగ్రదేశాల సరసన తామున్నామని పాలకులు గొప్పగా చెప్పుకొంటున్న దేశం. అయితే ఈ సుసంపన్న దేశంలో పేదలకు ఎందుకు పిడికెడు మెతుకులు దొరకడం లేదు? జీడీపీలో భారత్, బ్రిటన్ను అధిగమించి ప్రపంచంలోనే అయిదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది.
ఈ ఏడాది మార్చి చివరి నాటికి భారత ఆర్థిక వ్యవస్థ విలువ 854.7 బిలియన్ డాలర్లు, బ్రిటన్ ఆర్థికవ్యవస్థ విలువ 816 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు బ్లూమ్బర్గ్ నివేదిక తెలిపింది. 2022లో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 6.8 శాతంగా ఉంటుందని ఇటీవల ఐఎంఎఫ్ విడుదల చేసిన నివేదిక పేర్కొన్నది. అగ్రదేశాలన్నింటి కంటే భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని కేంద్రం కూడా చెప్పుకొంటున్నది. కానీ ఈ ఆర్థిక వ్యవస్థలో నలుగురైదుగురు కార్పొరేట్ల వాటా ఎంత? మిగతా జనం వాటా ఎంత? అనేది మాత్రం కేంద్రం పట్టించుకోవడం లేదు.
దేశ సంపదను కేంద్రం కార్పొరేట్లకు ధార పోస్తున్నదనేది జగమెరిగిన సత్యం. అప్పుల భారం తీర్చుకోవడానికి ప్రభుత్వరంగ సంస్థలను తన మిత్రులకు అప్పనంగా కట్టబెడుతున్నది. అక్కడినుంచి తెచ్చిన డబ్బులు ఏమయ్యాయో ఎవరికీ తెలియదు. పైగా మోదీ ప్రధాని అయ్యాక ఎనిమిదేండ్లలో వంద లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చారు. అయినా దేశ పరిస్థితి ఆందోళనకరంగా తయారవుతున్నది. అయినా మేం గొప్పవాళ్లం, దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నామంటూ పాలకులు చెప్పుకోవడం సిగ్గుచేటు. దేశం ఆర్థికంగా కుదేలవుతున్నదని తెలిసినా కేంద్రంలోని పాలకులు అంతా బాగానే ఉందని ప్రచారం చేసుకుంటున్నారు. పరిస్థితి నానాటికి దిగజారుతున్నదని చెప్పినా పట్టించుకోవడం లేదు. ఫలితంగా భవిష్యత్లో దేశం పూర్తిగా ప్రమాదంలో పడనున్నది.
(వ్యాసకర్త: చైర్మన్, టీఎస్ రెడ్కో)
వై.సతీష్రెడ్డి
96414 66666