సోషల్ మీడియా పేరుతో నడుస్తున్న నిత్య అయోమయ సత్యానంతర కాలంలో సత్యాన్ని దొరకబుచ్చుకోవడం సవాల్గా మారింది. ఆ దిశగా మనల్ని మనం వాస్తవాల్లో నిలబెట్టుకోవడం అత్యంత కష్టమైన పని అయ్యింది. నోటికచ్చినట్టు నిరాధార ఆరోపణల నేపథ్యంలో.. సత్యాన్వేషణ అనేది నేటి సామాజిక సవాల్గా మారింది.
తెలంగాణ వచ్చిన నాటి నుంచే స్వయం పాలన మీద ప్రారంభమైన ఈ అబద్ధాల దొంగ దాడి నేడు తారాస్థాయికి చేరింది. వాస్తవాలకు మసిబూసి ఏదోరకంగా తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ మీద, ప్రభుత్వం మీద ప్రజల్లో విశ్వాసం తగ్గించేలా చేయడమే లక్ష్యంగా తొండికూతల దాడి జరుగుతున్నది. ‘అదిగో పులి’ అని ఒకరంటే ఇదిగో తోక అనే మరొకలంటూ లేని పులిని ఉన్నట్టుగా, గాలినీడల చీకట్లను సృష్టించే కార్యక్రమాన్ని తెలంగాణలో ప్రతిపక్షాల పేరుతో కొంతమంది ముందలేసుకున్నరు. వీరి త్రీడీ అబద్ధాలకు ఇటీవలి టీఎస్పీఎస్సీ ఉదంతంలోకి మంత్రి కేటీఆర్ను, ఆయన పీఏను గుంజడం సాక్ష్యంగా నిలిచింది.
ఈ దేశంలో ఒక రాజకీయ విచిత్రమైన పరిస్థితి రెండు వైరుధ్యాలున్న పాయలుగా నడుస్తున్నది. అందులో ఒక పాయ కేంద్ర ప్రభుత్వ ‘అధికార దుర్వినియోగం’ కాగా, రొండోది రాష్ట్రంలో ‘భావప్రకటనా స్వేచ్ఛ దుర్వినియోగం’. ఈ రెండింటి విచ్చలవిడితనం తెలంగాణలో రోజురోజుకూ పెరిగిపోతున్నది. ‘ఒకే దేశం, ఒకే పార్టీ, ఒకే అధికారం’ అనే ఏకచ్ఛత్రాధిపత్య ధోరణితో కన్నూ మిన్నూ గానక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అందినకాడికి అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంటే.. రాష్ట్రంలో అందని అధికారం కోసం గంతులేస్తూ ప్రతిపక్షాల పేరుతో భావప్రకటనా స్వేచ్ఛ దుర్వినియోగం కొనసాగుతున్నది.
గమ్మత్తేమంటే.. కేంద్రంలో అధికారాన్ని వెలగబెడుతూ, తనకు నచ్చని రాష్ట్ర ప్రభుత్వాలను కూలుస్తున్న అధికార బీజేపీ కూడా తెలంగాణలో ప్రతిపక్షం ముసుగేసుకున్నది. తన కుట్రలను ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఈ ముసుగులోంచే అమలు పరుస్తుండటం ఆందోళన కలిగించే అంశం. ఈ ధోరణులు తెలంగాణ ప్రజలకే కాకుండా దేశ ప్రజలందరికీ ఆందోళన కలిగించేవే. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారుతున్నది. ఈ పరిస్థితుల నుంచి భారత సమాజాన్ని పరిరక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ రెండు వైరుధ్యాల న డుమ ఇరుక్కొని ఏది అబద్ధమో, ఏది నిజమో అర్థంగాక జుట్టు పీక్కుంటున్న పరిస్థితి తెలంగాణ ప్రజలది.
ఎటువంటి అడ్డంకుల్లేకుండా, అతి సులువుగా, చౌకగా సామాన్యులకు తమ గొంతును వినిపించే వేదికగా ఉన్న సోషల్ మీడియాను తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగపరచడమనేది ప్రజాస్వామిక వ్యవస్థకు పెద్ద ప్రమాదం. వీళ్లు మాట్లాడే మాటలు, చేసే చేష్టలను భేషరతుగా సమర్థిస్తున్న వాళ్లు, ఈ వైరుధ్యాన్ని లోతుగా అర్థం చేసుకుంటే తప్ప మేధావులు కాలేరు. గ్లాసులో సగం ఖాళీని చూడటమే మేధావితనం కాదనేది మనందరం గుర్తెరగాలి.
ఒక నూతన రాష్ట్రంగా ఇంతపెద్ద వ్యవస్థలో ఇద్ద రు వ్యక్తులు చేసిన తప్పును ప్రభుత్వానికి రుద్దాలని చూడటం, భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో చెలరేగడం గర్హనీయం. జర్నలిజం, మేధావితనం, ప్రతిపక్షం ముసుగులో కొనసాగుతున్న యథేచ్ఛ దాడి ని ప్రతి ప్రజాస్వామికవాది తీవ్రంగా ఖండించాలి. రాజకీయ అధికారంపై కన్నేసిన కొన్ని శక్తులు సామాజిక మాధ్యమాల్లో చెలరేగిపోతూ అప్రజాస్వామిక చర్యలకు దిగుతుండటం దురదృష్టకరం. ఆర్ఎన్ఐ గుర్తింపు పొంది, సమాజంలో పేరుగాంచిన పెద్ద పత్రికల్లో, మెయిన్ స్ట్రీం మీడియాలో కూడా ఇటువంటి ధోరణులు మితిమీరుతుండటం శోచనీయం. దీనికి అడ్డుకట్ట వేయకుంటే ఈ పెడ ధోరణులను కొనసాగించిన వాళ్లుగా మిగిలిపోవడం ఖాయం. తద్వారా మనం కూర్చున్న ప్రజస్వామిక వృక్షాన్ని గొడ్డలితో మనమే నరుక్కున్న వాళ్లమవుతాం. భావప్రకటనా స్వేచ్ఛ కల్తీ అయితే తలెత్తే పర్యవసానాలెట్లుంటయి? రేపటి తరానికి మనం ఏం సమాధానమిస్తాం? అటువంటి భవిష్యత్తును ఊహించగలమా?
రమేశ్ హజారి