తెలంగాణ లో శాతవాహన కాలం నాటి ఇటుక, మట్టితో కట్టిన కోటలు కోటలింగాల, ధూళికట్ట వంటి చోట్ల శిథిలాలలో ఇప్పటికీ కనిపిస్తుంటే, మధ్య యుగపు కోటలకు భువనగిరి, ఓరుగల్లు, కౌలాస్, గోల్కొండ, కోయిలకొండ వంటి కోటలు సాక్ష్యంగా నిలుస్తాయి. ఇవే కాకుండా కొన్ని వందల చిన్న చిన్న రక్షణ దుర్గాలు, స్థానిక దుర్గాలు ఇప్పటికీ తెలంగాణ పల్లెల్లో ఉన్నాయి.
రెండు వేల మూడు వందల ఏండ్ల కింద మగధను బలమైన రాజ్యంగా తీర్చడం కోసం కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రంలో సప్తాంగ సిద్ధాంతంలో దుర్గం ఒకటి. అంటే రాజ్యం బలంగా ఉండాలంటే పటిష్ఠమైన దుర్గం ఉండాలి. అందుకు ఏమేం చేయాలో రాసినాడు కౌటిల్యుడు. మళ్ళీ మధ్య యుగంలో క్రీ.శ. 1127లో కళ్యాణి చాళుక్య చక్రవర్తి మూడవ సోమేశ్వరుడు రాసిన మానసోల్లాసం అనే సంస్కృత గ్రంథంలో నవ విధ దుర్గ లక్షణం అని తొమ్మిది రకాలైన కోటల గురించి చెపుతాడు. ఇప్పటికీ భారత దేశంలో చాలా చోట్ల మనకు మధ్యయుగం నాటి కోటలు కాలం పెట్టిన పరీక్షల్ని తట్టుకుని చరిత్రకు కాపలాదారుల్లాగా నిలబడి ఉన్నాయి. కాకతీయుల తొలి కోట అనుమకొండ ఆ తర్వాత కట్టుకున్న దుర్గమమైన కోట ఓరుగల్లు – రెండూ కాకతీయ రాజ్య బలానికి ఒక కారణమైనాయి.
జల (నీటి మధ్య), గిరి (గుట్టలు, కొండల పైన), పాషాణ (రాళ్లతో కట్టిన), ఇస్తిక (ఇటుకలతో కట్టిన), మృత్తిక (మట్టితో కట్టిన), వన (అటవీ ప్రాంతంలో), మరు (ఎడారి ప్రాంతంలో), దారు (వృక్షాలు, కట్టెలతో కట్టిన), నర (అస్త్ర, శస్త్ర ధారకులైన యోధులున్న) దుర్గాలలో గిరి, జల దుర్గాలు శత్రు దుర్భేద్యమైన ఉత్తమ దుర్గాలుగా వర్ణిస్తాడు సోమేశ్వరుడు. అనుమకొండ, ఓరుగల్లు రెండూ గిరి దుర్గాలే. మధ్య యుగాల్లో ఏదైనా రాజ్యాన్ని గెలుచుకోవాలంటే కోటను పట్టుకోవాల్సిందే. ఎందుకంటే రాజూ, రాజ్య పాలనా యంత్రాంగం, ఖజానా మొత్తం కోటలోనే ఉండటంతో కోటను పట్టుకుంటే రాజ్యమే వశమవుతుంది.
రాష్ట్రకూటుల కోట అనుమకొండ
కాజీపేట శాసనం రాష్ట్రకూట అమోఘవర్షుని పాలనలో ఉన్న అనుమకొండ విషయం గురించి చెపుతూ ‘శ్రీమదనుమకొండ’ అని వర్ణిస్తుంది. శ్రీమద్ అంటే మహా అని అర్థం. అంటే అనుమకొండ అప్పటికే ఒక విషయానికి (విషయం అంటే ఒక జిల్లా వంటి పరిపాలనా ప్రాంతం) పటిష్ఠమైన ముఖ్య పట్టణం. మరి దానికి రక్షణగా దుర్గం అంటే కోట ఉండాలి కదా! దాని కోసం హన్మకొండలో కొందరు చరిత్ర పరిశోధకుల దేవులాట, ఆర్కియాలజీ శాఖ చేసిన సర్వేలో అనుమకొండ కోట ఆనవాళ్ళు బయటపడ్డాయి. పద్మాక్షి గుట్ట, అగ్గలయ్య గుట్ట, సిద్దేశ్వర గుట్టల్ని కలుపుతూ అనుమకొండ కోట గోడల ఆనవాళ్లు ఉన్నాయి. ఈ గుట్టలపై మట్టితో, రాళ్లతో కట్టిన కోట గోడల శిథిలాలు ఇప్పటికీ కొద్దిగా మిగిలి ఉన్నాయి. సిద్దేశ్వర గుట్ట కింద ఉన్న భద్రకాళి చెరువు సైతం అనుమకొండ కోట ప్రాంతంలోనిదే.
తెలంగాణ రాష్ట్ర చిహ్నమైన కాకతీయ తోరణం వరంగల్ కోటలోని స్వయంభూ ఆలయం తోరణమే. అయితే ఓరుగల్లులోని అద్భుతమైన తోరణానికి మునుపటి రూపం అనుమకొండ కోట ప్రాంతంలోని తోరణాల్లో కనిపిస్తుంది. అనుమకొండ కోటలో నాలుగు తోరణాలు, ఒకటి ప్రవేశం దగ్గర, మూడు భద్రకాళి చెరువు మార్గంలో ఉన్నట్టు ఇప్పటికీ నిలిచి ఉన్న తోరణాల వల్ల తెలుస్తున్నది. పద్మాక్షి గుట్ట చేరాలంటే ఉత్తరం దిక్కున ఉన్న తోరణం నుండి వెళ్లాల్సిందే. ఈ తోరణాలు తొలి కాకతీయ రాజుల్లో ఒకడైన మొదటి బేత కాలంలో ఏర్పాటు చేసినట్టు భావిస్తున్నారు కొందరు పరిశోధకులు. ఈ తొలినాళ్ళ తోరణాలే కాకతీయులు స్వతంత్రులైనాక ఓరుగల్లు కోటలోని కీర్తి తోరణాలు చెక్కించడానికి ప్రేరణగా నిలిచాయని అనిపిస్తుంది. మొదటి బేత కాలం నుండి రుద్రదేవుడు స్వతంత్రుడయ్యే వరకు అనుమకొండ కోట పాలనా కేంద్రంగా ఉండింది.
హనుమకొండ కొనసాగింపు ఓరుగల్లు కోట.
దీని గురించి వచ్చే వారం వివరంగా తెలుసుకుందాం.
డా. ఎం.ఎ. శ్రీనివాసన్
81069 35000