మహాత్మా గాంధీ, నెహ్రూ, భగత్సింగ్, ఆజాద్ వంటి ఎందరో వీరుల నాయకత్వాన సాధించిన స్వాతంత్య్ర ప్రసాదాన్ని అందుకోవడానికి 75 ఏండ్ల కింద ప్రారంభమైన పండుగ 1947 ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం. ఏటా ప్రజా విజయాన్ని, ప్రజాస్వామ్యాన్ని కీర్తించి నీరాజనాలు ఎత్తుతూ జరుపుకొనే పండుగగా వర్ధిల్లుతూ వస్తున్నది.
మూడు వందల ఏండ్లు బ్రిటిష్ సామ్రాజ్యవాదం, నిరంకుశత్వం కింద దారిద్య్రం, దైన్యాలతో ప్రజలు జీవించారు. ఆంగ్లేయులు మన దేశాన్ని జయించడానికి, సుదీర్ఘకాలం పాలించడానికి మన జాతి నైతిక పతనం ప్రధాన కారణం. నైతిక పతనం ఎంత సులువో, దాన్ని తిరిగి నెలకొల్పడం చాలా కష్టం. మన దేశంలో మహమ్మారిలా వ్యాపించి వ్యవస్థీకృతమైన మత మౌఢ్యాలు, ప్రజలను చీలికలు పేలికలుగా చేసిన కుల, వర్ణ వ్యవస్థలు, సాంఘిక దురాచారాలు, నీచ స్వార్థాలతో సింథియా, హోల్కర్లు వంటి కొందరి రాజుల, ఆర్కాట్ వంటి నవాబులు అరాచక, భోగ లాలస, వ్యక్తిగత అహంకారాల వల్ల యావత్ ఉపఖండం దాస్యంలోకి వెళ్లిపోయింది.
దేశ దాస్యాన్ని అనివార్యం చేసిన నైతిక పతనంలో కూడా అప్పుడప్పుడు తిరుగుబాట్లు చోటుచేసుకున్నాయి. 1757 ప్ల్లాసీ, ఆంగ్లో-మైసూర్ యుద్ధాలు,1800 ఆరంభంలో హిందూ సాధువులు సంప్రదాయ ఆయుధాలతో నిర్వహించిన సన్యాసి తిరుగుబాటు (ఈ ఉద్యమం ఇతివృత్తంగా బంకించంద్ర ఛటర్జీ ‘ఆనంద మఠం’ అనే నవల రాశారు), 1857లో ప్రజ్వలించిన ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం వీటిలో భాగమే. ఈ యుద్ధాల్లో మన ప్రజలనే సైన్యంగా మలచుకొని మన డబ్బుతొనే, మన పాలకులలో కొందరి ధనలోభం, అధికార వ్యామోహం, స్వామి ద్రోహంతో ఆంగ్లేయులు ఈ దేశభక్తియుత యుద్ధాలలో విజయం సాధించారు.
ఇవి జాతిలో తీవ్ర నైరాశ్యం, నిస్పృహలను కలిగించాయి. 1900 నుంచి స్వాతంత్య్ర సమర ఆకాంక్ష మళ్లీ మొగ్గ తొడిగింది. దీనికి పునాదులు వేసిన వారు సామాజిక సంస్కర్తలు, కవులు, కళాకారులు. వీరి విశేష కృషితో భారతజాతి నైతిక పునరుత్తేజం పొందింది. ఆంగ్లేయుల ఆధిపత్యంలో బానిసలుగా ఉండటం సిగ్గుచేటనే భావన ప్రబలింది. 1880 నుంచి గెలుపోటములతో నిమిత్తం లేకుండా అలలు అలలుగా, ఉప్పెనగా కొనసాగిన 1905, 1917, 1921, 1929, 1942, 1947 వరకు ప్రజా వెల్లువలతో స్వాతంత్య్రం సాకారమైంది.
స్వాతంత్య్ర పాలన తొలినాళ్ళలో వైజ్ఞానికవేత్త, సోషలిస్ట్ నెహ్రూ, సామాజిక విప్లవ నేత అంబేద్కర్ల నేతృత్వంలో ప్రజల ఆకాంక్షలకు అనువైన రాజ్యాంగాన్ని రూపొందించారు. పీడిత ప్రజాకోటి వికాసానికి అనేక రక్షణలు కల్పించారు. ప్రజల మౌలిక ప్రగతికి తోడ్పడే విద్య, వైద్యం,రవాణా, గనులు, శక్తి రంగాలను ప్రభుత్వ ఆధీనం లో ఉంచారు. చెల్లా చెదురైన దేశానికి నిర్దిష్ట రూపం తెచ్చా రు. విద్య, పాలన, ఆర్థిక విషయాల్లో వేల ఏండ్లుగా భాగస్వామ్యానికి నోచుకొనివారికి చోటుదక్కింది, వ్యవసాయ వైజ్ఞానిక రంగాల్లో స్వావలంబనతో పాటు అనేక విజయా లు సొంతం చేసుకున్నాం.
వేల ఏండ్లుగా భారత సమాజాన్ని అంధకారంలో ఉంచి న మత మౌఢ్యం, విశ్వాసాల ప్రాతిపదికతో ప్రజల ఐక్యతను చీల్చే రాజకీయాలు పురుడు పోసుకొని ప్రస్తుతం మహా విపత్తుగా మారాయి. జాతీయోద్యమంలో కానీ, సాంఘిక విప్లవాలతో కానీ సంబంధం లేని శక్తుల పాలనలో ప్రస్తుత జీవన ప్రామాణికత సూచికల్లో అన్నీ అధమ స్థానాలే. సాధించుకున్న అనేక హక్కులను, రాజ్యాంగ వ్యవస్థలను, రక్షణలను బలహీనం చేస్తున్నాయి. సమాఖ్యవ్యవస్థ స్ఫూర్తిని కాలరాస్తూ అప్రజాస్వామిక నియంత ధోరణులు చెలరేగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో స్వాతం త్య్ర సమరంలో అశేష త్యాగాలు చేసిన లక్షలాది ప్రజల ఆకాంక్షలను తిరిగి నెలకొల్పే బాధ్యతను విద్యావంతులు, ప్రజాస్వామికవాదులు తీసుకోవాలి. లౌకిక, సౌభ్రాతృత్వ విలువలను తిరిగి వికసింపజేయాలి.
అస్నాల శ్రీనివాస్, 96522 75560
(వ్యాసకర్త: తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఉపాధ్యక్షుడు)