రాష్ట్రంలోని అన్ని కులాల ప్రజలు ‘ఆత్మగౌరవ భవనాలు’ నిర్మించుకునేందుకు ప్రభుత్వం స్థలాలను కేటాయించడం ఆహ్వానించదగిన పరిణామం. ఆయా సామాజికవర్గ జనాభా ప్రాతిపదికన ఒక్కో వర్గానికి ఎకరం నుంచి ఐదెకరాల వరకు భూమిని కేటాయించడం హర్షించదగిన పరిణామం. ప్రపంచంలో, దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణులకు, గిరిజనులకు, ఓసీలకు, బీసీలకు ఆత్మగౌరవ భవన నిర్మాణాల కోసం స్థలాలతో పాటు, భవన నిర్మాణానికి కూడా డబ్బు కేటాయించడం పట్ల అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల నుంచి వచ్చిన ఆచరణ రూపమే ఆత్మగౌరవ భవన నిర్మాణాలు.
ఈ భవనాల నిర్మాణం కోసం కోకాపేట, ఉప్పల్ ప్రాంతాల్లోని కోట్ల రూపాయల విలువైన భూములను ప్రభుత్వం ఉచితంగా కేటాయించడం సీఎం ఉదార స్వభావానికి నిదర్శనం. రాష్ట్రంలోని 33 జిల్లాలకు రాజధాని హైదరాబాద్. ఇంజినీరింగ్, మెడికల్, ఉన్నత విద్యాలయాలు, వర్సిటీలు హైదరాబాద్ కేంద్రంగా ఉండటంతో రాష్ట్రంలోని నలుమూలల నుంచి విద్యార్థులు, ప్రజలు నగరానికి అనివార్యంగా రావాల్సిన పరిస్థితి. నిరుద్యోగ యువతీ, యువకులు హైదరాబాద్లోనే ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతారు. ఎందుకంటే ఇక్కడ విద్యార్థులకు కోచింగ్ సెంటర్లు అందుబాటులో ఉంటాయి. సిటీ సెంట్రల్ లైబ్రరీ, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, కృష్ణదేవరాయలు గ్రంథాలయం ఇంకా అనేక గ్రంథాలయాలు రాష్ట్ర రాజధానిలోనే ఉన్నాయి.
జిల్లాల నుంచి విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు హైదరాబాద్కు వస్తుంటారు. ఉస్మానియా, గాంధీ, నిమ్స్, ఇంకా అనేక ప్రైవేట్, ప్రభుత్వ, స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ దవాఖానాలు హైదరాబాద్లోనే ఉన్నా యి. వ్యాపార, వాణిజ్య సముదాయాలకు కేంద్రం హైదరాబాద్. ఇలా ఏ అవసరం వచ్చినా ఆయా సామాజిక ప్రజలు హైదరాబాద్కు రావాల్సి ఉంటుంది. చాలామందికి హైదరాబాద్లో బంధువులు లేకపోవడంతో నానా ఇబ్బందులు పడుతుంటారు. విద్యార్థులైతే హాస్టల్ ఫీజులు కట్టలేక మధ్యలోనే చదువు ఆపేసిన సందర్భాలు కూడా గతంలో అనేకంగా ఉన్నాయి. ఇలా ఎన్నో కష్టాలు అనుభవించిన రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్న ‘ఆత్మగౌరవ భవనాలు’ పెద్ద ఊరటగా నిలువనున్నాయి.
రాష్ట్రంలోని ఆరెకటిక కులాల రాష్ట్ర సంఘాలు సుమారు 15 ఉంటాయి. ఇవన్నీ కలిసి ఏకసంఘంగా ఏర్పడి ట్రస్ట్గా రిజిష్టర్ చేసుకున్నాయి. ఇలా ఈ ఒక్కటే కాదు, అన్ని కులాల్లోనూ ఇలానే రిజిష్టర్ చేసుకున్నవాటికే భూమిని కేటాయించి భవన నిర్మాణాల కోసం డబ్బు కేటాయిస్తామనే నిబంధనలను ప్రభుత్వం విధించింది. అందుకే అన్ని సామాజిక వర్గాలు గ్రూపులుగా కాకుండా ఏకమై ప్రభుత్వం వద్దకు వస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఆయా సామాజిక విద్యార్థులకు కావలసిన వసతి గృహాల నిర్మాణం, వృద్ధుల కోసం ఆశ్రమాలు నిర్మించడం వల్ల వారిలో ఆత్మగౌరవం పెరుగుతుందనడంలో సందేహం లేదు.
బ్రాహ్మణులు, బీసీ కులాలకు సంబంధించిన ఆత్మగౌరవ భవన నిర్మాణాలకు సంబంధించిన స్థలాల్లో భూమి పూజ కూడా జరిగింది. పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఇప్పటికే గిరిజన, ఆదివాసీలతో పాటు, పలు భవనాలు ప్రారం భమైనాయి. ఇవి ఆయా కులాల ప్రజలకు భవిష్యత్తులోనూ ఎంతగానో ఉపయోగపడ నున్నాయి. తమ తమ సామాజిక వర్గాలను అభివృద్ధి పర్చుకునే ప్రణాళికలపై చర్యలకు కేంద్రంగా ఈ ఆత్మగౌరవ భవనాలను ప్రజ లు ఉపయోగించుకోవాలి. ఆ దిశగా అడుగు లు పడాలని ఆశిద్దాం.
(వ్యాసకర్త: రాష్ట్ర ఆరె కటిక ట్రస్ట్ వ్యవస్థాపక సభ్యులు, మీడియా కార్యదర్శి)
డాక్టర్ , ఎస్.విజయభాస్కర్
92908 26988