బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సేవలు ఎనలేనివి. ఈ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహోన్నత వ్యక్తి మన బాబాసాహెబ్. దేశ భవిష్యత్తు, ప్రజల కోసం ఆయన సారథ్యంలో అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగంతోనే పేద ప్రజలకు స్వాతంత్య్ర ఫలాలందుతున్నాయి.
‘1950 జనవరి 26న మనం వైరుధ్యాలమయమైన జీవితంలోకి ప్రవేశించబోతున్నాం. రాజకీయాల్లో మనకు సమానత్వం ఉంటుంది. ఆర్థిక జీవనంలో అసమానత ఉంటుంది. మన ఆర్థిక రాజకీయ వ్యవస్థ మూలంగా మన సామాజిక, ఆర్థిక జీవనంలో మనం ఒక మనిషికి ఒకే విలువ అన్న సూత్రాన్ని నిరాకరిస్తూనే ఉంటాం. ఈ వైరుధ్యాన్ని వీలైనంత త్వరగా తొలగించితీరాలి. లేకపోతే, ఎంతో శ్రమించి నిర్మించిన రాజకీయ ప్రజాస్వామ్య సౌధాన్ని అసమానతలు అనుభవిస్తున్నవారు ధ్వంసం చేస్తారు’. 1949 నవంబర్ 26న బాబాసాహెబ్ అంబేద్కర్ అన్న మాటలివి.
స్వాతంత్య్రం వచ్చిన సమయంలో పాలనా వ్యవస్థ క్లిష్టమైన వాతావరణంలో ఉన్నప్పుడు మన రాజ్యాంగ రచన జరిగింది. స్వాతంత్య్ర భారతదేశం భవిష్యత్కు దిక్సూచిగా తన ఆత్మనే రాజ్యాంగ గ్రంథంగా రాసుకున్నారు అంబేద్కర్. భారతజాతికి ఆయన ఇచ్చిన ఈ బహుమతి కులమత, వర్గాలన్నింటినీ ఏకంజేసింది. ప్రతి పౌరుడికీ సమానమైన గుర్తింపునిచ్చింది. అందుకే అంబేద్కర్ అందరివాడయ్యారు.
భారత స్వాతంత్య్ర పోరాటకాలంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా, న్యాయవాదిగా, సామాజిక కార్యకర్తగా, ఆర్థికవేత్తగా, న్యాయమంత్రిగా.. ఎన్నో బాధ్యతలను నిర్వర్తించారు. ఆయన జీవిత చరిత్ర ప్రతి ఒక్కరిలోనూ ఎంతో ప్రేరణ కలిగిస్తుంది. ఈ సందర్భంగా ఓ చిన్న విషయాన్ని చర్చించుకుందాం. అంబేద్కర్ యువకుడిగా ఉన్న కాలంలో ఎవరైనా విదేశాలకు వెళ్తే వారు తిరిగి వచ్చేటప్పుడు కొన్ని పుస్తకాలు తెమ్మని అంబేద్కర్ కోరేవారు. అలా విదేశాలకు వెళ్లకుండానే అక్కడి లైబ్రరీల్లోని ఎన్నో పుస్తకాలను చదివారు. చదువంటే అంబేద్కర్కు అంత మమకారం. అందుకే రాజ్యాంగ నిర్మాతగా ఆయనే సరైనవాడని అంతా భావించారు. ఇలాంటి ఎన్నో ఘటనల్ని ఆయన జీవితం నుంచి ఆదర్శంగా తీసుకోవచ్చు.
అంబేద్కర్ దేశంలో పటిష్టమైన వ్యవస్థలను నిర్మించేలా రాజ్యాంగంలో నిర్దేశించారు. ఏ వ్యవస్థ తప్పు చేసినా మరో వ్యవస్థ దాన్ని సరిదిద్దేలా అద్భుతమైన నిర్మాణాన్ని ఏర్పాటుచేశారు. ఏ వర్గాన్నీ పాలకులు నిర్లక్ష్యం చేసే అవకాశం లేకుండా చేశారు. పాలకులు దారితప్పితే ప్రజలు ప్రశ్నించే హక్కునిచ్చారు. హక్కులతో పాటు ప్రభుత్వాలను గైడ్ చేసేలా ఆదేశిక సూత్రాలను ఇచ్చారు. దేశంలో మత, కుల, లింగ వివక్ష లేకుండా అందరూ సమానంగా జీవించే స్వేచ్ఛనిస్తూ దాన్ని రాజ్యాంగబద్ధం చేశారు. ఆర్టికల్-14, 15, 16లలో సమానత్వ హక్కులు కల్పించారు. ఈ చట్టాలే దశాబ్దాలుగా దేశంలో మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రక్షణ కవచాలుగా నిలుస్తున్నాయి. అంటరానితనాన్ని రూపుమాపేందుకు అంబేద్కర్ అనేకరకాల పౌరస్వేచ్ఛలకు రాజ్యాంగ హామీలు, రక్షణలను అందించారు. అలాగే పౌరసేవలు, పాఠశాలలు, కళాశాలల్లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారికోసం ఉద్యోగాల రిజర్వేషన్ల వ్యవస్థను తీసుకొచ్చి, దాన్ని చట్టసభల్లో ఆమోదించుకోవడంలో కూడా విజయం సాధించారు.
సాంస్కృతిక, సమైక్యతతోపాటు సామాజిక సమైక్యత అవసరమని తెలియజేస్తూ భారత రాజ్యాంగం ద్వారా సామాజిక సమానత్వం అనే అమృతాన్ని అందించారు మన అంబేద్కర్. బలమైన సమైక్య భారతం అవసరమని భావించి బలమైన కేంద్రంగల భారతరాజ్యాంగాన్ని మనకు అందించారు. దేశంలోని ప్రజలకు తిండి, బట్ట, ఉద్యోగం ఇవ్వాల్సిన బాధ్యతను ప్రభుత్వాలపై పెట్టారు. మహిళలకు రాజకీయ స్వాతంత్య్రం ఉండాలని చెప్పిన అరుదైన నాయకుడు అంబేద్కర్. దళితుల కోసమే కాదు, దేశంలోని అన్నివర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడిన అసమాన నాయకుడు బాబా సాహెబ్.
దేశానికి దిశా నిర్దేశం చేసి, దారిచూపిన దార్శనికుడు అంబేద్కర్. ప్రజాస్వామ్యం ఆయన లక్ష్యం. సమానత్వం ఆయన ఎంచుకున్న మార్గం. అందుకే ఆ మహనీయుడి ఆశయాల సాధన కోసం కొత్త పార్లమెంట్ భవనానికి ‘అంబేద్కర్’ పేరు పెట్టాలని యావత్ దేశం పరితపిస్తున్నది.
తీగల అశోక్కుమార్ 79891 14086