ప్రశ్నల లోపమో లేక ప్రశ్నలే మంచివి కావో, ప్రశ్నించేవాళ్లే మనకు ప్రశ్నార్థకమో తెలియదు కానీ, కాలర్ పట్టుకొని అడిగినవాళ్లంతా కటకటాల పాలవుతున్నారు రాష్ట్రీయం, జాతీయం, అంతర్జాతీయం అనే తేడా లేకుండా ఓటర్లంతా నిక్కచ్చిగా నిలదీసి అడగలేకపోతున్నారు నాయకులను. ఏది అభివృద్ధి? ఎవరు మంచి, ఎవరు చెడు? ఏది రాజధాని? ఎక్కడ నిధులు? మద్యం నిషేధమా? లేక బాండ్ల సమస్యా? నిన్నటివరకు ఈ పార్టీలో రేపు మరో పార్టీలో? పరీక్ష రాసే విద్యార్థి మదిలోని అర్థంకాని చిక్కు ప్రశ్నల్లా!
ప్రజలకు ప్రశ్నలే మిగలకుండా పరిపాలించే నాయకులైతే మంచిదే గాని అసలు ప్రజలే లేకుండా, ప్రజలతో పనే లేకుండా చేసే పాలన గుర్తొస్తే మాత్రం కంగారే!
ప్రజలకు ఎన్నికల సమయంలో ఆ భయం లేదు, అభయమూ లేదు! ఇప్పుడు ఓటర్లు దైవస్వరూపాలు, దైవమే మనలో ప్రవేశించి సమాధానపరుస్తుంది. అడిగే నాయకులే అడ్డగోలు అన్నట్లుంటుంది. అధికారంలో ఉన్నప్పుడు మ్యానిఫెస్టోలను ఈస్టమన్ కలర్లో చూపించి, వెంటనే తూచ్ అంటూ మడిచి మన జేబులోనే పెట్టి దూరంగా జరిగి, తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చి అధికారానికి దూరమైతే నిరంతరం చేతిలో మైకుతో, రాత్రి పగలు తేడా లేకుండా అర్థమే కాని హామీలతో, కొత్త నినాదాలతో ఇరుకు సందులన్నీ ఒడుపుగా తిరుగుతూ, ప్రశ్నించే ప్రజలతో గొంతు కలిపే నైజాన్నీ ఓటరు ఒడిసి పట్టుకున్నట్టున్నాడు మరి! కాకుంటే ఇది కలికాలం! ఎలక్షన్ కాలంలో ప్రజలపై ప్రేమ అమాంతంగా పెరగడం సహజమే కదా అని సరిపెట్టుకుంటున్నాడు విధి లేక.
అన్ని రాష్ర్టాలు మా చేతుల్లోనే ఉండాలనే జాతీయం, అన్ని అసెంబ్లీ సీట్లు మేమే గెలవాలనే రాష్ట్రీయంతో రసవత్తరమైన రాజకీయం నడుస్తోంది. ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ మన దేశం 5వ స్థానంలో ఉంచామని చెప్తున్న కొందరు నాయకులకు తాము గెలిచి దేశాన్ని మరింత ముందుకు తీసుకుపోయేందుకు ప్రజలు కాకుండా మందిరాల్లో, మసీదుల్లో ఎజెండాలు కావచ్చు. సరిహద్దులు, యుద్ధాలు, ఆక్రమణలు, పోరాటాలు, విజయాలు, పాత చరిత్రల చుట్టూ అల్లుకుంటున్న వివాదాస్పద కొత్త సినిమాలపై కొందరి ప్రశ్నలు, మరికొందరి సమాధానాలు ఎన్నికల ఎజెండాలుగా రూపు మార్చుకోవచ్చు.
అడ్డు తగులుతున్న పక్షాల ప్రశ్నలు అసలు లేకుంటే అభివృద్ధిలో దేశాన్ని ఒకటో స్థానంలో నిలబెట్టే ఆలోచనా అందిపుచ్చుకోవచ్చు. మూడు రెట్లు పెరిగిన పెట్రోలు 3 రూపాయలు తగ్గినా, ముందు నెలలో వాచిపోయిన కరెంటు బిల్లు ఈ నెల్లో కొద్దిగా తగ్గినా, నకిలీలతో నాణ్యత లేకున్నా, సగటు మనిషి సరిపెట్టుకోవడమే.
ఎవరు జైలుకు వెళ్లినా మరెవరు బెయిల్పై బయటకు వచ్చినా, ఎవరు కక్షగట్టినా, మరెవరు కరుణ జూపినా, చట్టం, న్యాయం, ధర్మం అన్నీ కలగాపులగమైనా, ఎవరు మంచిచేసినా, మరెవరు మాయ చేసినా, ఎవరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినా, ‘చంపేదెవరు? చచ్చేదెవరు?’ అన్న సందేహం మనకు లేకుండా ‘అంతా నా ఇచ్ఛ ప్రకారమే జరుగుతుందన్న’ శ్రీకృష్ణ పరమాత్మ గీతా వచనాలను ఆదర్శంగా తీసుకొని ఓర్పుగా ఎదురు చూసే ప్రజలు అందరి నాయకులను సమానంగా ప్రతి ఐదేండ్లకోసారి 70 నుంచి 80 శాతం ఓట్ల వాన నీటితో కడిగి నచ్చిన నాయకులను పునీతులుగా చేసి మళ్లీ కడిగిన ముత్యంలా నిలబెట్టే ప్రజల వద్ద సరైన ప్రశ్నలు లేకపోవచ్చు, లేదా కొన్నిచోట్ల ఓటుకున్న రేటు, తీసుకున్న నోటుతో ఏదో జవాబు దొరికిందని సంతృప్తి పడవచ్చు.
కొత్త ట్రెండ్లో పాంచ్ పచ్చీస్ న్యాయాలు, సూపర్ సిక్స్ గ్యారెంటీలు, మేమంతా సిద్ధం, వికసిత్ భారత్లతో దేశవ్యాప్తంగా కనిపించని బ్రహ్మపదార్థమైన అభివృద్ధి కోసం ప్రశార్థకంగా ఎదురుచూసే ప్రజలకు రాష్ర్టాల్లోను, కేంద్రాల్లోను ప్రశ్నించేందుకు ప్రతిపక్షాలే అవసరం లేని ఎజెండాలతో జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలకు ప్రశ్నలే మిగలకుండా పరిపాలించే నాయకులైతే మంచిదే గాని అసలు ప్రజలే లేకుండా, ప్రజలతో పనే లేకుండా చేసే పాలన గుర్తొస్తే మాత్రం కంగారే!
-జోస్యుల వేణుగోపాల్
94404 36806