అటవీహక్కుల చట్టం గురించి మళ్లా చర్చ జరుగుతున్నది. చట్టం చేసి పద్నాలుగేండ్లు దాటుతున్నా దాని
పరిమితుల్లోనూ గిరిజనులకు భూమి దక్కకపోవడంతో చట్టం ప్రశ్నార్థకమైంది. చట్టం అమలు పట్ల అనేక
విమర్శలు వెల్లువెత్తుతున్న సందర్భంగా నాటి వలస పాలకుల నుంచి నేటి దేశీయ పాలకుల వరకు చేసిన చట్టాలను సమీక్షించాల్చిన అవసరం ఎంతైనా ఉన్నది.
బ్రిటిష్ వలస పాలకుల నుంచి విముక్తి పొందిన తర్వాత దేశాన్ని పాలించిన భారత పాలకులు అన్ని వ్యవస్థల్లోనూ బ్రిటిష్ విధానాలనే అమలు చేస్తున్నారు. అటవీ హక్కుల చట్టం అందుకనుగుణమైనదే. 1855లో భారత గవర్నర్ జనరల్గా ఉన్న డల్హౌసీ తొలిసారి గిరిజనులకు వ్యతిరేకంగా అటవీ విధానాన్ని ప్రకటించి, అటవీ సంపదలన్నీ ప్రభుత్వ ఆస్తిగా అధికారికంగా ప్రకటించాడు. 1864లో అటవీ ఇన్స్పెక్టర్ జనరల్ నియామకంతో అడవిపై బ్రిటిష్ ప్రభుత్వ పెత్తనం ప్రారంభమైంది. 1865లో మరో చట్టం ద్వారా పూర్తిగా అడవులను తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు బ్రిటిష్ ప్రభుత్వం హక్కును పొందింది.
దేశీయ పాలకులు వలస పాలకుల అటవీ విధానాన్నే అమలుచేస్తున్నారు. 1952లో ప్రకటించిన అటవీ విధానమే అందుకు నిదర్శనం. ఈ విధానం ద్వారా రిజర్వ్, రక్షిత, గ్రామ అడవులుగా అటవీ ప్రాంతాన్ని విభజించారు. దాని ఫలితంగా అడవిపై గిరిజనుల హక్కు పరిమితమైంది. 1973 లో ‘టైగర్ ప్రాజెక్టు’ పేరుతో గిరిజనులను అడవినుంచి వెళ్లగొట్టేందుకు పూనుకున్నది. 1980లో కేంద్రం తెచ్చిన మరో గిరిజన వ్యతిరేక చట్టం ద్వారా గిరిజనులను అడవి నుంచి ఖాళీ చేయించే చర్యలు చేపట్టింది. 1996లో సుప్రీంకోర్టు తీర్పు లో యాజమాన్యం, గుర్తింపు, వర్గీకరణతో సం బంధం లేకుండా ప్రభుత్వ రికార్డుల్లో నమోదైన అన్ని ప్రాంతాలకు చట్టాన్ని వర్తింపజేయడం వల్ల గిరిజనుల హక్కులకు తీవ్ర అన్యాయం జరిగింది.
అడవిపై గిరిజనుల హక్కులను హరించే చట్టాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు జరిగాయి. 1830లో బీహార్, బెంగాల్లలో కోల్ తిరుగుబాటు, 1855-56లో సంతాల్ తిరుగుబాటు, 1802-03లో రంప తిరుగుబాటు, 1922-24లో అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో జరిగిన మన్యం తిరుగుబాటు, కుమ్రం భీం నాయకత్వంలో 1940లో గోండుల తిరుగుబాటు, 1967 నక్సల్బరీ గిరిజన రైతాంగ పోరాటం, 1968-70లో శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరా టం ముఖ్యమైన గిరిజన పోరాటాలు.
గిరిజన పోరాట ఫలితంగా కొన్ని చట్టాలు తప్పలేదు. 1917లో చేసిన భూ బదలాయింపు క్రమబద్ధీకరణ చట్టం ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు భూములు కలిగి ఉండవచ్చు. ఏజెన్సీ ప్రాంతంలో చాలాకాలంగా నివసిస్తున్నవారిని గిరిజనులుగా గుర్తించడం ద్వారా గిరిజనేతరుల భూములకు రక్షణ ఏర్పడింది. అలాగే గిరిజనుల భూములు అన్యాక్రాంతం కాకుండా చట్టం అవకాశం కల్పించినట్లయింది. హైదరాబాద్ రాష్ట్రంలో ట్రైబల్ ఏరియాస్ రెగ్యులేషన్ 1359 ఫసలీ (కరస్పాండింగ్ టు 1949) అనే చట్టం చేయబడింది. ఈ చట్టం గిరిజనేతర ప్రాంతాల నుంచి వలస వచ్చినవారికి గిరిజన ప్రాంతాల్లో భూములు ఉం డటాన్ని నిషేధించింది. శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటం ఫలితంగా 1970లో 1/70 చట్టం వచ్చింది. ఈ చట్టం ప్రకారం గిరిజన ప్రాంతాలలో భూములు అమ్మకూడదు, కొనకూడదు. కానీ ఈ చట్టంలో అనేక మార్పులు జరుగడం వల్ల గిరిజన ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది.
అటవీ చట్టాలను పాలకులు నీరుగార్చారు. కోర్టులు సైతం గిరిజన హక్కులపై పరస్పర విరుద్ధ తీర్పులిచ్చాయి. ఒకే న్యాయమూర్తి గిరిజనులకు అనుకూలంగా, వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చిన సందర్భాలున్నాయి. ఇలా చట్టంలోని లొసుగుల వల్ల గిరిజనులకు చెందాల్సిన వేల ఎకరాల భూములు గిరిజనేతరుల పాలయ్యాయి. భద్రాచలం డివిజన్లో 29,55 4.16 హెక్టార్లు, ఖమ్మం జల్లా ఏజెన్సీలో 4,07,368 ఎకరా లు, వరంగల్ జిల్లా ములుగు మండలంలో 1200 ఎకరాలను గిరిజనేతరులు కబ్జా చేశారు.
అడవి నుంచి గిరిజనులను వెళ్లగొట్టేందుకు పాలకులు తీవ్ర నిర్బంధం ప్రయోగించినా వారు పోరాటం ఆపలేదు. దీంతో తామే భూములు పం చుతామని యూపీఏ ప్రభుత్వం 2005లో అటవీ హక్కుల బిల్లును విడుదల చేసి 2006 పార్లమెంట్ ఆమోదంతో చట్టంగా మార్చింది. ఈ బిల్లులో 1980కి పూర్వం గిరిజనుల ఆక్రమణలో ఉన్న భూములనే క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పటంతో గిరిజనులు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. తిరిగి బిల్లులో మార్పులు చేసి 2005కు పూర్వం వారి అధీనంలో ఉన్న భూములను క్రమబద్ధీకరిస్తామని చెప్పి 2006 డిసెంబర్లో బిల్లును చట్టసభల్లో ఆమోదింపజేసి చట్టంగా ప్రకటించారు. 2008 జనవరి నుంచి జమ్మూ-కశ్మీర్ మినహా దేశమంతటా అమలు జరుపుతున్నట్లు పాలకులు ప్రకటించారు. ఈ చట్టం ద్వారా గిరిజన కుటుంబానికి పదెకరాల అటవీ భూమికి పట్టాలి స్తామని యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది.
మోదీ ప్రభుత్వం అటవీహక్కుల చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు చట్టంలో అనేక సవరణలు ప్రతిపాదించింది. వివిధ రకాల రక్షిత భూములను చట్ట పరిధి నుంచి తప్పించింది. అటవీ ప్రైవేట్ భూములను చట్టపరిధి నుంచి తొలగించింది. 1980కి పూర్వం ఇతర సంస్థలు పొంది న భూములను మినహాయించాయి. ఆయా సంస్థలు రోడ్డు, ట్రాక్ చెట్లు, పచ్చదనం పెంచిన స్థలాలను చట్ట పరిధి నుంచి తప్పించాలి. నివాస, ఇతర ప్రాజెక్టుల అవసరాలకు 250 చదరపు మీటర్లలో నిర్మాణాలు అనుమతించాలి. ఇవీ మోదీ ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాలు. ఈ ప్రతిపాదనల ఆమోదం కోసం ప్రయత్నించి తీవ్ర వ్యతిరేకత రావటంతో వెనక్కి తగ్గడం కొసమెరుపు.
(వ్యాసకర్త: బొల్లిముంత సాంబశివరావు , 9885983526, రైతు కూలీ సంఘం, ఏపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు)