‘ఇండియా అంటే భారత్ – ఇది రాష్ర్టాల సమాఖ్యగా ఉంటుంది’ అనే వాక్యంతో భారత రాజ్యాంగం ప్రారంభమవుతుంది. కానీ ఆచరణలో కేంద్రం దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ‘దేశమంతా ఒకే భాష, ఒకే సంస్కృతి’ అనే నినాదంతో హిందీ భాషా సంస్కృతుల్ని మిగతా భాషా జాతులపై రుద్దే ప్రయత్నం చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థల బోధనలో, జాతీయ స్థాయి ఉద్యోగాల నియామక పరీక్షల్లో హిందీకి ప్రాధాన్యం ఇవ్వడం ఇందుకు ఉదాహరణ. ఇది పైకి భాషకు సంబంధించిన విషయంగా కనిపించినా, వాస్తవానికి ఆధిపత్య స్థాపన కోసం అధికారాన్ని దుర్వినియోగం చేసే చర్యగా అర్థం చేసుకోవాలి.
భాషా ఆధిపత్యం ఇతర భాషా జాతుల ప్రజల ఉద్యోగ, ఉపాధి, వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రఖ్యాత భాషా శాస్త్రవేత్త నోమ్ చోమ్స్కీ చెప్పినట్లు ఆర్థిక, సాంస్కృతిక ఆధిపత్యానికి, జాతి పురోగతికి, విముక్తికీ భాష ఉపకరణం. ఈ కారణం వల్లనే తమ ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకోడానికి కేంద్ర పాలకులు తమ భాషను బలవంతాన అన్ని భాషా జాతుల ప్రజలపై రుద్దే ప్రయత్నం తీవ్రతరం చేస్తున్నారు. సాధారణంగా కేంద్ర ప్రభుత్వ చట్టాలు, ఉత్తర్వులు, వివిధ ప్రభుత్వ కార్యాలయాల నమూనా పత్రాలు, ప్రొ ఫార్మాలన్నీ ఇంగ్లీషుతో పాటు హిందీలోనూ ప్రచురితమవుతాయి. మిగతా భాషల వారికి ఇవి అర్థం కావు. ఈ పత్రాలన్నీ ఇతర భాషల్లోనూ ప్రచురించాలని చాలా ఏండ్లుగా డిమాండ్లు వినిపిస్తున్నా పాలకులు వాటిని పట్టించుకోవడం లేదు.
అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల వంటి సంస్థల్లో హిందీ తప్పనిసరి చేసి, ఆ భాషా పరీక్షలు ఉత్తీర్ణులైనవారికి పదోన్నతులతో సహా అనేక ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. రైల్వే, బ్యాంకు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా జరిగే భర్తీల్లో 95 శాతం ఉద్యోగాలు హిందీ బాగా వచ్చిన ఉత్తరాది వారికే దక్కుతున్నాయి. డిసెంబర్ 2017 నుంచి జేఈఈ పరీక్ష ప్రశ్నా పత్రం గుజరాతీ భాషలోనూ ఇవ్వడం మొదలు పెట్టారు. మిగతా భాషలన్నింటిలోనూ ప్రశ్నాపత్రం ఇవ్వాలని ప్రజాస్వామిక వాదులు ఎంత పోరాటం చేసినా కేంద్రం దాన్ని అమలు చేయడం లేదు.
2020లో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త విద్యా విధానం కూడా కొత్త వివాదాలకు తెర లేపింది. ఈ విధానంలో దేశ అధికార భాష హిందీతోబాటు సంస్కృతాన్ని తప్పనిసరి భాషగా చేర్చారు. వాస్తవానికి, సహజంగా ఏ ఇద్దరూ మాట్లాడుకోని సంస్కృతాన్ని విద్యార్థులపై రుద్దడం, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, జాతీయ స్థాయి వైద్య, సాంకేతిక విద్యాలయాలన్నిటా హిందీనే బోధనా భాషగా రుద్దడం హిందీయేతర ప్రాంతాలవారి హక్కుల్ని దెబ్బ తీయడమే.
తాజాగా కేంద్ర మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలోని అధికార భాషా సంఘం పార్లమెంటరీ కమిటీ రాష్ట్రపతికి సమర్పించిన నివేదిక మరింతగా హిందీ భాషేతర ప్రజానీకంపై అణచివేతకు పాల్పడే విధంగా ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతున్నది. అధికారికంగా ప్రకటించకపోయినా వెల్లడైన వివరాల ప్రకారం, పాలనా భాషగా దేశ వ్యాప్తంగా హిందీనే ఉండాలని, అన్ని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాల్లో తీర్పుల నమోదులు హిందీలో జరిపి భద్రపరచాలని, హిందీ మాట్లాడడం రాని కేంద్ర ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని, వారికి పదోన్నతులు, ఇంక్రిమెంట్లు ఇవ్వకూడదనే ప్రతిపాదనలు అమలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
అన్ని ఉద్యోగ పోటీ పరీక్షల బహుళ ఐచ్చిక ప్రశ్నపత్రాలతో సహా ప్రశ్నపత్రాలన్నీ హిందీలోనే ఉండాలని, ఉద్యోగులందరికీ హిందీ భాష వచ్చి తీరాలని కూడా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇవి చట్ట రూపం దాలిస్తే హిందీ రాని వారికి తీవ్ర నష్టం కలుగుతుంది. ఈ నేపథ్యంలో హిందీని దేశ మంతటా బలవంతంగా రుద్దడంపై దక్షిణాది రాష్ర్టాల నుంచి తీవ్ర ప్రతిఘటన వస్తున్నది. వివిధ భాషా జాతుల ప్రజల మధ్య విభేదాలు రాకుండా ఉండాలంటే ప్రతి రాష్ర్టానికీ ఆయా రాష్ట్ర జనాభాను బట్టి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్ కల్పించాలి. అఖిల భారత సర్వీసులు, రైల్వే, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాలతో సహా అన్నింటా ఈ విధానం అమలు పరచాలి. మెడికల్, ఇంజనీరింగ్ తదితర విద్యా ప్రవేశ పరీక్షలను అఖిల భారత స్థాయిలో జరిపినా, జనాభా దామాషాను బట్టి ఆయా రాష్ర్టాల అభ్యర్థులకు రిజర్వేషన్ వాటా కల్పించాలి లేదా ఆయా రాష్ర్టాలకే నియామక పరీక్షలు జరుపుకునే విధానాన్ని పునరుద్ధరించాలి.
-అనిసెట్టి సాయికుమార్ , 94407 70531