ప్రజల సంక్షేమంపై పాలకులకు చిత్తశుద్ధి ఉంటేనే ఆ ప్రజలు అభివృద్ధి పథంవైపు అడుగులు వేస్తారు. ఆ దేశం కూడా అభివృద్ధి వైపు పరుగులు పెడుతుంది. బ్రిటిష్ పాలన నుంచి బయటపడిన తర్వాత భారత్లో స్వేచ్ఛా పాలనకు బీజం పడింది. స్వతంత్ర పోరాటంలో సబ్బండవర్గాలు తమ ప్రాణాలను అర్పించారు. వారి త్యాగాల స్మరణలో పాలన సాగుతుందని భావించడం సహజమే. స్వతంత్రం సిద్ధించిన తొలినాళ్లలోనే అమరుల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగింది. ఆ తర్వాత క్రమేణా ప్రజలకు పాలకులు దూరమైన పరిస్థితి. 1970వ దశకంలో కాంగ్రెస్ పార్టీలో వచ్చిన చీలికలతో కేంద్రంలో సంకీర్ణాల యుగం కొన్నాళ్లు నడిచింది.
1952 సాధారణ ఎన్నికల్లో 364 సీట్ల మెజారిటీతో ప్రారంభమైన కాంగ్రెస్ విజయయాత్ర 1977 నాటికి 153కి పడిపోయింది. 1952లో 44 శాతం ఓట్లను సాధించిన కాంగ్రెస్, 1977లో 34.52 శాతానికే పరిమితమైంది. 1975 నాటికి కాంగ్రెస్, ఇందిర విధానాలను వ్యతిరేకిస్తూ విపక్షాలు ఒక్కటయ్యాయి. 1967 తర్వాత కాంగ్రెసేతర కూటములకు బీజం పడింది. సంయుక్త విదాయక్దళ్ పేరుతో కాంగ్రెస్ వ్యతిరేక కూటమి ఏర్పడింది. పలు రాష్ర్టాల్లో ఎస్వీడీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. పశ్చిమబెంగాల్, కేరళ, ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో కాంగ్రెస్ వ్యతిరేక ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. రాష్ర్టాల్లో సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటుతో కేంద్రంలో కూడా ఆ ప్రయోగానికి అంకురార్పణ జరిగింది.
1977లో తొలిసారి భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది. జనతాపార్టీ నేతృత్వంలో అప్పటివరకు ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నవారంతా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఎమర్జెన్సీ సమయంలో జయప్రకాశ్ నారాయణ్ పోరాటంతో కొత్త నాయకత్వానికి నాంది పడింది. కాంగ్రెస్(ఓ), జన్ సంఘ్, సోషలిస్ట్ పార్టీ, భారతీయ లోక్దళ్ కూటమిగా ఏర్పడ్డాయి. 1977 జనరల్ ఎన్నికల్లో విపక్షాల కూటమి విజయం సాధించి మొరార్జీ దేశాయి ప్రధాని అయ్యారు. జనతాపార్టీ 271 స్థానాల్లో విజయం సాధించింది. ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, హర్యానా, హిమాచల్ప్రదేశ్ రాష్ర్టాల్లో కూడా జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. జగ్జీవన్రామ్, చరణ్ సింగ్ వంటి నేతల్లో నెలకొన్న వైరుధ్యాలతో చరణ్సింగ్ జనతాపార్టీని వీడి జనతా సెక్యులర్ పార్టీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత విశ్వాస పరీక్షలో జనతా పార్టీ ఓడిపోవడంతో మొరార్జీ దేశాయి ప్రధాని పదవికి రాజీనామా చేశారు. 1979లో చరణ్ సింగ్ నాయకత్వంలో రెండో సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది. జనతా సెక్యులర్, కాంగ్రెస్(యూ)లతో పాటు కాంగ్రెస్(ఐ) బయటనుంచి మద్దతు ఇవ్వడంతో చరణ్సింగ్ ప్రధాని అయ్యారు. తర్వాత కాంగ్రెస్(ఐ) మద్దతు ఉపసంహరణతో ప్రధాని పదవిని చరణ్ సింగ్ కోల్పోయారు.
1988లో వీపీ సింగ్ నేతృత్వంలో జన్మోర్చా, జనతాపార్టీ, లోక్దళ్, కాంగ్రెస్(ఎస్), టీడీపీ, డీఎంకే, అసోం గణ పరిషత్లు నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేశాయి. బీజేపీ, లెఫ్ట్ పార్టీలు కూడా బయటినుంచి మద్దతు ఇచ్చాయి. 1989లో సంకీర్ణ ప్రభుత్వంలో వీపీసింగ్ ప్రధాని అయ్యారు. బీజేపీ మద్దతు ఉపసంహరణతో వీపీసింగ్ ప్రభుత్వం 1990లో పడిపోయింది. జనతాదళ్ (ఎస్) నాయకుడు చంద్రశేఖర్ అన్నాడీఎంకే, బీఎస్పీ, ముస్లింలీగ్, నేషనల్ కాన్ఫరెన్స్, కేరళ కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ పార్టీ మద్దతుతో 1990లో నాలుగో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. చంద్రశేఖర్ 1991లో ప్రధాని పదవికి రాజీనామా చేశారు. 1991లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పీవీ ప్రధాని అయ్యారు. 1996లో ఐదో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. 13 పార్టీల మద్దతుతో దేవెగౌడ ప్రధాని అయ్యారు. 1997లో ఆరో సంకీర్ణ ప్రభుత్వం యునైటెడ్ ఫ్రంట్ పేరుతో ఐకే గుజ్రాల్ నేతృత్వంలో ఏర్పడింది. 1999లో ఏడో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. వాజపేయి ప్రధాని అయ్యారు. బీజేపీ, ప్రాంతీయ పార్టీలు భాగస్వామిగా ఉన్నాయి. 1999లో బీజేపీ మొదటిసారి నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ ఎన్టీయేను ఏర్పాటుచేసింది. 2004లో తొమ్మిదో సంకీర్ణ ప్రభుత్వం యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయెన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటైంది. ఆ తర్వాత బీజేపీకి పూర్తి మెజారిటీ రావటంతో దేశంలో మళ్లీ ఏకపార్టీ పాలన మొదలైంది. దీన్ని అడ్డం పెట్టుకొని మోదీ ప్రభుత్వం అనేక ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నది.
ఆర్థికరంగంలో కేంద్రం నిర్ణయాలు రాష్ర్టాల హక్కులకు, అధికారాలకు శరాఘాతంగా మారాయి. జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు, ప్రాయోజిత కార్యక్రమాలకు నిధుల తగ్గింపు, ఆర్థిక సంఘాల సిఫారసులు మొదలైనవన్నీ దీనిలో భాగమే. గత నాలుగేండ్లలో జీఎస్టీ ద్వారా రాష్ర్టాలు సుమారు రూ. 2 లక్షల కోట్లు నష్టపోయాయి. నష్ట నివారణ చేస్తామని కేంద్రం ప్రకటించిన్పటికీ, ఆచరణలో అమలుగాక, రాష్ర్టాలు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాయి. బీజేపీ ప్రభుత్వం సమాఖ్య విధానంపైనే కాకుండా, రాజ్యాంగ వ్యవస్థలు, సంస్థలపై కూడా దాడులు చేస్తున్నది. న్యాయవ్యవస్థ, ఎన్నికల కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వంటి రాజ్యాంగ సంస్థలపై ఒత్తిడి తెస్తున్నది. ప్రపంచంలోనే భిన్నత్వం కలిగిన దేశమైన భారతదేశం సమాఖ్యగా కొనసాగడానికి, బహుళత్వాన్ని పరిరక్షించుకోవడానికి రాజ్యాంగం దోహదపడుతున్నది. రాజ్యాంగంలో ప్రవేశపెట్టిన ‘రిజర్వేషన్ల’ ద్వారా సామాజిక న్యాయం కొనసాగుతున్నది. ఆ రిజర్వేషన్లపై కూడా బీజే పీ అగ్రనేతలు విషం గక్కుతునే ఉన్నారు.
ఈ నేపథ్యంలో దేశానికి కొత్త దిశ చూపించటానికి ప్రత్యామ్నాయ పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అందుకోసమే కేసీఆర్ ఆధ్వర్యంలోని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)ను ప్రజలు ఆహ్వానిస్తున్నారు.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
-బండారు జితేందర్
93935 41667