కరోనాతో ప్రపంచ ఆర్థికవ్యవస్థ కుదేలైంది. పుండు మీద కారం చల్లినట్లు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఎరువులు, ఇంధన ధరలు పెరిగాయి. వాతావరణ మార్పులు, అధిక జనాభా, భూసారం తగ్గిపోవడం, సాగుభూమి తగ్గడం, నదులు ఎండిపోవడం తదితర కారణాల వల్ల ప్రపంచం ఆహార సంక్షోభ కోరల్లో చిక్కుకున్నది. వ్యవసాయాన్ని ప్రోత్సహించి అధిక దిగుబడులు సాధించడమే దీనికి పరిష్కారం.
ప్రస్తుతం 93 శాతం పేద, మధ్య తరగతి దేశాలు, 89 శాతం మధ్య ధనిక దేశాలు ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నాయని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచ ఆహార కార్యక్రమం నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 34.5 కోట్ల మంది ఆహార కొరతతో బాధపడుతున్నారు. వ్యవసాయం గిట్టుబాటు కాక గ్రామీణులు పట్టణాలకు, నగరాలకు వలసవెళ్లడం, వాతావరణ మార్పులు వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో పడేశాయి. దీనికి తోడు అధిక ద్రవ్యోల్బణం వల్ల నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పేదలకు అందకుండా పోతున్నాయి.
భారత్లో పరిస్థితిని పరిశీలిస్తే.. ఇటీవల సేద్యం ఖర్చులు బాగా పెరిగిపోయాయి. భూసారం తగ్గటం, వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడం తదితర కారణాల వల్ల 1991-2011 మధ్యకాలంలో సుమారు 1.4 కోట్ల మంది వ్యవసాయాన్ని విడిచిపెట్టారు. 2021 సిచ్యుయేషన్ అసెస్మెంట్ సర్వే ప్రకారం 2014 నుంచి వ్యవసాయాధారిత కుటుంబాల ఆదాయం దిగజారడం ప్రారంభమైంది. పంట దిగుబడి కూడా 2014లో 48 శాతం ఉంటే, 2021 నాటికి 37 శాతానికి తగ్గింది. ఇదే సమయంలో వ్యవసాయ కార్మికులకు చెల్లించే వేతనాలు కేవలం 8 శాతం పెరిగాయి. ఈ నేపథ్యంలో భారత వ్యవసాయరంగం పెను ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నది. రాబోయే కొన్నేండ్లలోనే ఇండియా జనాభా 150 నుంచి 200 కోట్లు పెరిగే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో అందరికీ మూడుపూటలా ఆహారం సమకూర్చడం పెద్ద సవాల్. ఈ నేపథ్యంలో ఇకనైనా కేంద్ర ప్రభుత్వం మేల్కొని వ్యవసాయరం గాన్ని బలోపేతం చేయాలి.
ప్రపంచంలో అమెరికా తర్వాత, ఇండియాలోనే అధికంగా సాగు భూమి ఉన్నది. అయితే వ్యవసాయరంగాన్ని వసతుల కొరత వెంటాడుతూనే ఉన్నది. ఆహార సంక్షోభ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో వ్యవసాయాన్ని ప్రభుత్వం లాభసాటిగా మార్చాలి. రాయితీ ధరలకు విత్తనాలు, ఎరువులు, విద్యుత్తు, వ్యవసాయ పనిముట్లు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తేవాలి. విత్తనాలు, ఎరువుల్లో నకిలీల బెడదను తొలగించాలి. పంట మార్పిడి విధానాన్ని ప్రోత్సహించాలి. యువత వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకునేలా ప్రోత్సహించాలి. సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలి. గోధుమలు, పప్పుధాన్యాలు, నూనె గింజల ఉత్పత్తిని పెం చాలి. తరచూ భూసార పరీక్షలు నిర్వహించాలి. వానకాలంతో సమానంగా ఎండకాలంలోనూ పంటలు పండించేలా ప్రణాళికలు రూపొందించాలి. ప్రస్తుతం ఎండకాలంలో నాలుగో వంతు భూమినే సాగుచేయడం గమనార్హం. రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా చేపలు, గొర్రెలు, కోళ్లు, పందుల పెంపకాన్ని ప్రోత్సహించాలి. దీనివల్ల రైతులకు లాభాలు రావడమే కాకుండా ప్రజలకు పోషకాహారం దొరుకుతుంది. మిగులు ఉత్పత్తి లేకుండా ఏ దేశం అభివృద్ధి సాధించలేదని భారత్ గ్రహించాలి. ఎగుమతులు పెంచి, దిగుమతులను తగ్గించుకోవాలి.
పంట ఉత్పత్తులు నిల్వ చేసుకోవడానికి శీతల గిడ్డంగులను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేయాలి. రవాణా సౌకర్యాలు, మార్కెటింగ్ సదుపాయాలు మెరుగుపరిచి రైతులకు తగిన ఆదాయం వచ్చేటట్లు చూడాలి. వ్యవసాయ పరిశోధనలు, అభివృద్ధికి అధిక నిధులు కేటాయించాలి. ప్రస్తు తం మన దేశంలో వ్యవసాయ పరిశోధనలకు 0.3 శాతం నిధులు ఖర్చుచేస్తున్నది. దీన్ని మరింత పెంచాలి. వ్యవసాయంలో శాస్త్ర సాంకేతిక వినియోగాన్ని పెంచాలి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నీటి సామర్థ్యం పెంపొందించుకోవడం, పశువుల ద్వారా ఆదాయం పొందడం, కంపోస్టు ఎరువుల ఉపయోగం, పెరటి తోటల పెంపకం లాంటి లక్ష్యాలు విధించుకొని ఆయా లక్ష్యాల్లో కొత్త ప్రయోగాలు చేస్తూ కొత్త ఒరవడిని సృష్టిస్తున్నది. ఇతర రాష్ర్టాలు కూడా ఇలాంటి విధానాలు అవలంబించాలి. 2021 ప్రపంచ ఆహార వృథా నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 19.3 కోట్ల టన్నుల ఆహార వృథా జరిగింది. సగటున ఏటా ఒక్కో కుటుంబం 50 కేజీల ఆహారాన్ని వృథా చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఆహార వృథాను తగ్గించడంపై దేశ ప్రజలందరూ దృష్టిసారించాలి.
పంటలు పండించడం ఎంతో కష్టం. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని విలువైన ఆహారాన్ని వృథా కాకుండా చూడాలి. ఆహారభద్రత చట్టం ముఖ్య ఉద్దేశం అందరికీ ఆహారం అందించటమే కాదు, ఆహారానికి సంబంధించిన అన్ని విషయాల్లో ప్రజలందరికీ భాగస్వామ్యం కల్పించడం కూడా అని గ్రహించాలి. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ప్రపంచ దేశాలు ఇప్పటినుంచే సరైన ప్రణాళికలు రూపొందించుకొని యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. వ్యవసాయానికి అధి క నిధులు కేటాయించి రైతులకు అండగా నిలువాలి.