ప్రపంచ యుద్ధాల తర్వాత అన్ని దేశాలు సామాజిక భద్రతకు ప్రాధాన్యతనిచ్చాయి. వృద్ధుల సంక్షేమం, ఆరోగ్య బీమా పథకాలపై దృష్టి సారించాయి. ఇవాళ ప్రపంచంలో నాలుగింట 3 వంతుల మంది వృద్ధాప్య పింఛను, మూడింట 2 వంతుల జనాభా ఆరోగ్య బీమా పొందుతున్నారు. నిరుద్యోగం(18.6%), శిశు సంక్షేమం(26.4 %), శ్రామిక పింఛన్లు(32.5 %), దివ్యాంగుల సంక్షేమం(35.4%), మాతా, శిశు సంరక్షణ(44.9 %) పథకాలకు ప్రపంచ దేశాలు ప్రాధాన్యం ఇస్తున్నాయి.
భారత్లో దివ్యాంగుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేశారు. ప్రపంచ సగటును పరిశీలిస్తే మూడో వంతు జనాభా ఈ తరహా పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు. కానీ మన దేశంలో మాత్రం సగటున 20 మంది దివ్యాంగుల్లో ఒక్కరు మాత్రమే లబ్ధి పొందుతున్నారు. ఇక శ్రామికుల పింఛన్లను పరిశీలిస్తే ప్రపంచ సగటులో సగం మందికి కూడా పింఛన్లు అందించడం లేదు.
కీలకమైన అంశాల్లో ప్రజలకు సామాజిక భద్రత కల్పించడంలో మన దేశం వెనకబడి ఉన్నది. నిరుద్యోగం(0 శాతం), దివ్యాంగుల సంక్షేమం (5.6 శాతం), కార్మికులకు పింఛన్లు (15.5 శాతం), దుర్బలుల (16.4 శాతం) విభాగాల్లో తక్కువ శాతం మంది ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నారు.
భారత్లో సామాజిక భద్రత కార్యక్రమాలకు అత్యల్ప ప్రాధాన్యం ఇస్తున్నారన్న దిగ్భ్రాంతికర వాస్తవాలు అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్వో) తాజా నివేదికల ద్వారా వెల్లడయ్యాయి. కనీసం ఏదో ఒక సామాజిక భద్రత కార్యక్రమం ద్వారా లబ్ధి పొందుతున్న భారతీయుల శాతం 24.4 మాత్రమే. ఇది ఆసియా-పసిఫిక్ ప్రాంత సగటు 44.1 శాతం కన్నా, ప్రపంచ సగటు 46.9 శాతం కన్నా చాలా తక్కువ. థాయ్లాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, వియెత్నాం తదితర దేశాలు మన కన్నా మెరుగ్గా సామాజిక భద్రత కార్యక్రమాలను అమలు పరుస్తున్నాయి. మిగతా బ్రిక్ దేశాలను పరిశీలిస్తే అక్కడ 70-90 శాతం జనాభా ఈ తరహా పథకాలను పొందుతున్నారు. ఫ్రాన్స్, జర్మనీలలో వంద శాతం జనాభాకు సామాజిక భద్రత పథకాలున్నాయి.
భారత్లో ప్రాథమ్యాలు కొంచెం వేరుగా ఉన్నాయి. ఇక్కడ సార్వత్రిక ఆరోగ్య బీమా పథకం, వృద్ధుల సంక్షేమ పథకాల ఫలితాలను 55 శాతం జనాభా పొందుతున్నది. మాతా-శిశు సంరక్షణ కార్యక్రమాల ప్రయోజనాలు 41.5 శాతం జనాభాకు లభిస్తున్నాయి. పని ప్రదేశాల్లో గాయపడిన వారికి లభించే పరిహారం మాత్రం భారత్లో ఎక్కువగానే ఉంది. దేశ జనాభాలో మూడో వంతు మందికి ఈ పథకం వర్తిస్తోంది. చిన్నారుల సంక్షేమ పథకాలు 25 శాతం జనాభాకు అందుతున్నాయి. ఈ విషయంలో మనం ప్రపంచ సగటుకు దగ్గరగా ఉన్నాం. పేద-మధ్య ఆదాయ దేశాల కన్నా మెరుగ్గా ఉన్నాం. మధ్యాహ్న భోజన పథకం సాధించిన సత్ఫలితాలు మనం సాధించిన అతి పెద్ద విజయం.
ప్రపంచ జనాభాలో అయిదో వంతు మంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి లాంటివి అందుతున్నాయి. పేద-మధ్య ఆదాయ దేశాల్లో నిరుద్యోగ సంక్షేమ పథకాలు పరిమితంగా అమలవుతున్నాయి. భారత్లోని నిరుద్యోగులకు మాత్రం ఇటువంటి పథకాలేవీ అమలు కాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ధనిక దేశాల్లో 50 శాతానికి పైగా జనాభాకు నిరుద్యోగ సంక్షేమ పథకాల ఫలితాలు అందుతున్నాయి. జర్మనీ, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో అందరికీ నిరుద్యోగ సంక్షేమ పథకాలను వర్తింపజేశారు. కరోనా, ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పుల నేపథ్యంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో నిస్సహాయులకు తక్షణమే సామాజిక భద్రత పథకాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది.
దేశంలో మొదటి సామాజిక భద్రతా పథకం 1952లో అమలైంది. అయినా నాటి నుంచి నేటి వరకు సామాజిక భద్రత పథకాల అమలు నిరాశాజనకంగా ఉంది. ఈ పథకాలకు తగినన్ని నిధులు కేటాయించక పోవడమే ఇందుకు కారణం. అంతర్జాతీయ కార్మిక సంస్థ అంచనా ప్రకారం భారత్ స్థూల జాతీయోత్పత్తిలో 1.4 శాతం మాత్రమే ఈ సంక్షేమ పథకాలకు ఖర్చు పెడుతున్నారు. ఇవి కాకుండా ఒక శాతం నిధులను ఆరోగ్య రంగంపై ఖర్చు పెడుతున్నారు. ప్రపంచ జీడీపీలో సామాజిక సంక్షేమ పథకాలకు 12.9 శాతం నిధులు ఖర్చు చేయడం గమనార్హం. పేద -మధ్య ఆదాయ దేశాలు 8 శాతం, బ్రెజిల్, రష్యా, చైనాలు 15.7 శాతం, ఫ్రాన్స్లో అత్యధికంగా 23.9 శాతం నిధులను ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నాయి.
వివిధ వర్గాల ప్రజలకు అందిస్తున్న సామాజిక భద్రతా కార్యక్రమాలను పరిశీలిస్తే ప్రపంచ సగటుకు మన దేశానికి చాలా వ్యత్యాసం ఉండటం బాధను కలిగిస్తుంది. ప్రపంచ స్థాయిలో చూస్తే వృద్ధుల సంక్షేమం కోసం 7 శాతం, పని చేసే సామర్థ్యం ఉన్న జనాభాకు 3.6 శాతం, చిన్నారుల కోసం ఒక శాతం సంక్షేమ పథకాల నిధుల కేటాయింపు జరుగుతున్నది. పేద-మధ్య ఆదాయ దేశాలైతే తమ జీడీపీలో వరుసగా 1.4 శాతం, 0.8 శాతం, 0.2 శాతం నిధులను ఖర్చు చేస్తున్నాయి. కానీ భారత్ మాత్రం తన జీడీపీలో వీటికి 0.3 శాతం, 0.3 శాతం. 0.1 శాతం నిధులను ఖర్చు చేస్తోంది. ఆర్థిక, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే స్థోమత ప్రజల్లో లోపించడానికి సామాజిక భద్రత పథకాలకు తగినంత బడ్జెట్ కేటాయించకపోవడమే కారణం.