‘పాశిగామ’(పాషాయిగాం)గా పిలుచుకొనే చిన్న పల్లె జగిత్యాల జిల్లాలోని వెల్గటూరు మండలానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నది.ఎవరి దృష్టినీ ఆకర్షించని ఈ పల్లె ఒకనాడు, బౌద్ధ భిక్షువుల పాద స్పర్శలతో పులకరించింది. బుద్ధుని శాంతి సందేశాన్ని నలుచెరుగులా చాటింది. అంతేకాదు సుప్రసిద్ధ చరిత్రకారుడు డాక్టర్ వి.వి.కృష ్ణశాస్త్రిచే జిఙ్ఞానుడు నడయాడిన నేలగా గుర్తించబడింది.
ఆశ్చర్యకరమైన విషయమేమంటే చరిత్రపుటల్లో అద్భుతమైన ఈ మలుపు వెనుకాల ఒక సామాన్యుడి కృషి దాగి ఉన్నదని చాలా మందికి తెలియదు. ఆ సామాన్యుడేధర్మపురి పుణ్యక్షేత్రానికి చెందిన కీ.శే.సంగనభట్ల నరహరి. నిజానికి ఆయన చరిత్రకారుడు కాదు. వృత్తిరీత్యా ఆయన ఒక పోస్టుమాస్టర్. అయితే నాణేల సేకరణ, వాటిపై పరిశోధన ఆయన హ్యాబీ.
జిఙ్ఞానుడు ప్రసిద్ధ బౌద్ధ తార్కికుడు. తమిళనాడుకు చెందిన సింహవక్త నగరానికి చెందినవాడు. ఆయన జీవితం గురించి భిన్నాభిప్రాయాలున్నాయి. ఆయన కాళిదాసు కాలానికి చెందినవాడని చరిత్రకారుల అభిప్రాయం. అంతేకాదు, కాళిదాసుతో విభేదించేవాడనీ చెప్తారు. తమిళనాడులో ఆయన ప్రతిపాదించిన తర్కవాద సిద్ధాంతాలకు ఆదరణ లభించకపోవడంతో, ఆ ప్రాంతాన్ని వదిలి, ఇప్పటి మన తెలంగాణలోని పాశిగామలో స్థిరపడ్డాడని చరిత్రకారుల అభిప్రాయం.
జిఙ్ఞానుడు రచించిన గ్రంథాలు ‘ప్రమాణ సముచ్చయ’, ‘హేతుచక్ర’, ‘ఆలంబన పరీక్ష’, ‘అభిధర్మకోశ మర్మ ప్రదీపిక’, ‘త్రికాల పరీక్ష’, ‘న్యాయముఖ’.. ఇవన్నీ విశేష ప్రజాదరణ పొందాయి. ముఖ్యంగా ‘ప్రమాణ సముచ్చయ’ అన్న గ్రంథం ఆయన తార్కిక సిద్ధాంతాన్ని విశదంగా వివరిస్తుంది. బౌద్ధ సాహిత్యంలో పేర్కొనబడి బుద్ధునితో సంభాషించిన పాయసికి పాశిగామతో సంబంధం ఉండవచ్చని, ఆయన గ్రామం పాశిగామ కావచ్చుననే అభిప్రాయాన్ని డాక్టర్ మలయశ్రీ వెలిబుచ్చారు ఇక తవ్వకాల విషయాలను పరిశీలిస్తే… శాతవాహన చక్రవర్తుల తొలిరాజధానిగా గుర్తించిన కోటిలింగాల పుణ్య క్షేత్రానికి సమీపంలో ఉన్నందువల్ల, ఉమ్మడి ఏపీ పురావస్తుశాఖ వారు కోటిలింగాలతోపాటు ఇక్కడ చేపట్టిన తవ్వకాలతో పాశిగామ విశిష్టత ప్రపంచానికి తెలిసింది.
ఈ తవ్వకాలు రెండు దశల్లో జరిగాయి. మొదటి దశ తవ్వకాలు (1979- 83) మధ్యకాలంలో జరగగా, రెండవ దశ తవ్వకాలు 2009లో జరిగాయి. ఈ తవ్వకాలకు ముందు ఆంధ్రుల చరిత్ర శాతవాహనులతోనే ప్రారంభమైందని చరిత్రకారులు భావించారు. అయితే ఈ తవ్వకాల్లో వెలుగులోకి వచ్చిన ఆధారాలతో ఆంధ్రుల చరిత్ర
శాతవాహనులతోనే ప్రారంభం కాలేదని, అది ఎంతో ప్రాచీనమైనదని తెలిసింది. ఒకవిధంగా చెప్పాలంటే ఈ తవ్వకాలు ఆంధ్రుల చరిత్రను ఒక మలుపుతిప్పాయి.
పాశిగామలో జరిపిన తవ్వకాల్లో ఒక స్థూపచైత్య, చైత్య గృహ ఆనవాళ్లు బయటపడ్డాయి. ఇక్కడ లభించిన ఒక శిలాఫలకంపై ఎదురెదురుగా నిల్చొని ఉన్న సింహాలు, మధ్యలో తామరపూవు చెక్కి ఉన్నాయి. ఈ ఫలకాన్ని బౌద్ధస్థూపంపై అమర్చినట్టుగా రుజువైంది. అంతేకాకుండా ఇక్కడ ఒక నాగ శిల్పం, బుద్ధపాదం బయటపడ్డాయి. ఇక్కడి చైత్యగృహం తూర్పు ముఖంగా గజ పుష్పాకారంలో ఉన్నది. ఇది ఒక బౌద్ధ స్థావరమని రుజువైంది. అంతేగాక బౌద్ధ భిక్షువులు నివసించడానికి గదులూ ఉండేవని తెలుస్తున్నది. చైత్యం రెండు వరసల ఇటుకరాళ్లతో పేర్చి ఉన్నది. పాశిగామకు సమీపంలోని స్తంభంపల్లిలో ఆయక స్తంభాలతో నిర్మించబడిన ఒక నిర్మాణం ఉండేదని అందువల్లనే దానికి స్తంభంపల్లి అన్న పేరు వచ్చిందని చరిత్రకారుల అభిప్రాయం.
శ్చర్యకరమైన విషయమేమంటే చరిత్రపుటల్లో అద్భుతమైన ఈ మలుపు వెనుకాల ఒక సామాన్యుడి కృషి దాగి ఉన్నదని చాలా మందికి తెలియదు. ఆ సామాన్యుడే ధర్మపురి పుణ్యక్షేత్రానికి చెందిన కీ.శే.సంగనభట్ల నరహరి. నిజానికి ఆయన చరిత్రకారుడు కాదు. పట్టా పొందిన పండితుడు అంతకన్నా కాదు. వృత్తిరీత్యా ఆయన ఒక పోస్టుమాస్టర్. అయితే నాణేల సేకరణ, వాటిపై పరిశోధన ఆయన హ్యాబీ. ఉద్యోగరీత్యా ఆయన కొంతకాలం కోటిలింగాలకు సమీపంలోని కప్పార్రావుపేటలో ఉండేవాడు. వీలు దొరికినప్పు డల్లా కోటిలింగాల ప్రాంతంలోని నాణేలను సేకరించేవాడు. అయితే ఒకరోజు ఆయనకు లభించిన నాణేలను పరిశోధిస్తున్నప్పుడు అవి చిముక చక్రవర్తికి చెందిన నాణేలుగా గుర్తించాడు.
చరిత్రకారుల దృష్టిలో అదొక అద్భుతం. ఈ విషయం గుర్తించిన నరహరి ఏ మాత్రం జాగు చేయకుండా కరీంనగర్కు వెళ్లి అప్పటి పురావస్తు శాఖాధికారులకు ఆ నాణేలను అందజేశాడు. వాటిని పరిశీలించిన ఆ అధికారులు వాటి విశిష్టతను గుర్తించి కోటిలింగాల, పాశిగామ ప్రాంతాల్లో తవ్వకాలను ప్రారంభించారు. ఫలితంగా కోటిలింగాల ఘన చరిత్ర ఆవిష్కరింపబడటంతోపాటు, పాశిగామలోని బౌద్ధ ఆనవాళ్లు బయటపడ్డాయి. కానీ దురదృష్టవశాత్తు, 1998 ప్రాంతంలో కరీంనగర్ లక్షెట్టిపేట రోడ్డు విస్తరణలో భాగంగా, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా బౌద్ధస్థూప, చైత్యాల ఆనవాళ్లు నేలమట్టమై, ఒకప్పుడు ఇక్కడ బౌద్ధం వెల్లివిరిసిందనేదానికి ఆధారాలు లేకుండా కనుమరుగయ్యాయి.
ఆ తర్వాత కొందరు చరిత్రకారుల కృషి ఫలితంగా స్థూపచైత్య, చైత్యగృహ నమూనాలు రూపొందించబడి అవి కరీంనగర్ మహాత్మా గాంధీ మ్యూజియంలో ఉన్నాయి. ఈ పరిణామ క్రమాలన్నీ పరిశీలిస్తే.. ఇక కొన్ని దశాబ్దాల్లో పాశిగామ గత వైభవం చరిత్ర పుటల్లో మరుగున పడిపోతుందనే దానికి సందేహం లేదు. ఇక్కడ ఒకప్పుడు బౌద్ధం వెల్లివిరిసిందని చెప్పినా ఎవరూ నమ్మలేకపోవచ్చు. అందువల్ల బౌద్దానికీ, పాశిగామకూ గల అనుబంధాన్ని మన భవిష్యత్తరాల వారు మరువకుండా ఉండేందుకు, బౌద్ధ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, బౌద్ధ మతాభిమానులు, చరిత్రకారులు చొరవ తీసుకొని ప్రభుత్వ సహకారంతో ఇక్కడ ఒక పెద్ద బుద్ధ విగ్రహాన్ని రోడ్డుకు అభిముఖంగా స్థాపించాలి. అప్పుడే ఇక్కడి పవిత్ర నేలకు న్యాయం చేసినట్టవుతుంది. ఇక ఆ బుద్ధ విగ్రహ దర్శనంతో కలిగే పవిత్ర అనుభూతి, ఆయన శాంతి సందేశ సౌరభాన్ని నేల నలుచెరుగులా వ్యాప్తి చేస్తుందనడంలో సందేహంలేదు. ఆ మంచిరోజు త్వరలో రావాలని, వస్తుందని ఆశిద్దాం.
-బసవరాజు నరేందర్రావు
99085 16549