ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది పాటు ఉద్యమించిన రైతు సంఘాలు తమ నిరసనలు విరమించుకున్నాయి. సుమారు 800 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. వారికి పంజాబ్, యూపీ తదితర రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివాదాస్పద సాగు చట్టాలతో పాటు, ‘విద్యుత్ సవరణ బిల్లు-2021’ ఉపసంహరించుకుంటామని హామీ ఇచ్చింది. కానీ అంతలోనే మాట మార్చింది. ఆ బిల్లును రాబోయే వానకాల పార్లమెంట్ సమావేశాల్లో తగు మార్పులతో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రమంత్రి ఆర్కే సింగ్ ప్రకటించారు.
ఉత్తరప్రదేశ్లోని మీరట్ ప్రాంతంలోని పలు గ్రామాలకు చెందిన 600 మంది రైతులు కోపోద్రిక్తులై తమ పంపుసెట్లకు బిగించిన స్మార్ట్ మీటర్లను పీకేశారు. వారానికి రూ.5-8 వేల వరకు బిల్లులు రావడమే రైతుల కోపానికి కారణం. ఆ మీటర్లను స్థానిక విద్యుత్ కార్యాలయంలో పడేసి రైతులు తమ నిరసనను ప్రకటించటం సంచలనమైంది. ఇటీవలే ఆ రాష్ట్ర ఎన్నికల్లో అధికార పార్టీ రైతులకు ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీకి స్మార్ట్ మీటర్ల బిగింపు వ్యతిరేకమైన చర్య.
యూపీ రైతుల కోపం సమర్థనీయమే అయినా తెలంగాణ రైతులకు ఆ దుస్థితి రాకపోవడం పట్ల సంతోషం వ్యక్తం చేయాలి. దానికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టి, దార్శనికత, తమ రైతుల పట్ల తనకున్న ప్రేమాభిమానాలు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ను యావత్ తెలంగాణ రైతాంగం అభినందించాలి. విద్యుత్ సవరణ చట్టం పరిణామాలను ముందే పసిగట్టిన సీఎం కేసీఆర్ ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ చట్టాన్ని ఆమోదించరాదని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేశారు. తెలంగాణలో రైతుల పంపుసెట్లకు మీటర్లు బిగించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. మీటర్లు పెట్టిన పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం పరిధిని పెంచుతామని కేంద్రం ఆశ చూపినప్పటికీ సవరణ చట్టాన్ని రైతు ప్రయోజనాల దృష్ట్యా నిర్దంద్వంగా ఆయన తిరస్కరించారు. ఆ నిర్ణయమే ఇప్పుడు రాష్ట్ర రైతాంగానికి వరంగా మారింది.
యూపీలో ఇచ్చినట్లుగా వారం రోజులకు రూ.5 వేల చొప్పున లెక్కకడితే నెలకు రూ.20 వేలు, ఏడాదిలో ఒక రైతు రూ.2 లక్షల 40 వేలు చెల్లించాలన్నమాట. ఈ లెక్కన మన రాష్ట్ర రైతాంగం ఎంత సౌకర్యవంతమైన పరిస్థితుల్లో వ్యవసాయం చేసుకుంటున్నదో అర్థం చేసుకోవచ్చు. యూపీ వలె మీటర్లు పెడితే భవిష్యత్లో దాపురించే పరిస్థితులను సులభంగానే ఊహించవచ్చు.
దేశంలోనే అత్యధికంగా మన రాష్ట్రంలో 25,72,652 వ్యవసాయ పంపుసెట్లున్నాయి. మొత్తం విద్యుత్ వినియోగంలో సుమారు 31 శాతం మేర వ్యవసాయ వినియోగానికే ఖర్చవుతున్నది. గత ఎనిమిదేండ్లలో 7 లక్షల 28 వేల 536 వ్యవసాయ పంపుసెట్లకు కొత్తగా కనెక్షన్లు ఇచ్చింది ప్రభుత్వం. ఇది ఏడాదికి సగటున 91 వేలకు పైమాటే. ఇంతపెద్ద ఎత్తున రైతులకు కనెక్షన్లు ఇస్తున్న రాష్ట్రం మరేదీ లేదు. కానీ కేంద్రం కోల్ ఇండియా లిమిటెడ్ను స్తబ్ధతలోకి నెట్టివేసి కృత్రిమ బొగ్గు కొరతను సృష్టించింది. దేశంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలు విధిగా పది శాతం అధిక ధరతో కూడిన విదేశీ బొగ్గును ఉపయోగించాలని ఆదేశాలు జారీచేసింది. దీంతో దేశవ్యాప్తంగా అనివార్యంగా పెరగనున్న విద్యుత్ ధరలు, కరెంటు కోతలు ప్రజలను వేధించనున్నాయి. ప్రభుత్వరంగంలోని విద్యుత్ కేంద్రాలను, డిస్కంలను ప్రోత్సహించి అండగా నిలబడాల్సిన కేంద్రం తద్విరుద్ధంగా వ్యవహరిస్తున్నది.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ రంగానికి ప్రాధాన్యం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం సహేతుకమైన రీతిలో బడ్జెట్ కేటాయింపులు జరిపి రైతాంగాన్ని ఆదుకున్నది. 2015-16 నుంచి 2018-19 వరకు వరుసగా ఏడాదికి రూ.5,940 కోట్ల చొప్పున నిధులను కేటాయించింది. 2019-20లో 10 వేల కోట్లు, 2020-21 నుంచి 2022-23 వరకు మూడేండ్లు ఏడాదికి 10,500 కోట్లు బడ్జెట్ కేటాయింపులు చేసింది. అంతేకాకుండా విద్యుత్ సంస్థలను బలోపేతం చేయడానికి ఈక్విటీల రూపంలో ఒకసారి 9,161 కోట్లు, మరొక్కసారి 7,792 కోట్లు మంజూరు చేసింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రూ.8,925 కోట్లను ఉదయ్ పథకం కింద కేటాయించింది. అంటే ఇప్పటివరకు విద్యుత్ సంస్థలను పటిష్ఠం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం రూ.91,138 కోట్ల నిధులను విడుదల చేసింది.
సీఎం కేసీఆర్ రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని భారీ నిధులు కేటాయించడం వల్లనే అన్నివర్గాల ప్రజలకు 24 గంటల నిరంతర, నాణ్యమైన విద్యుత్ను అందించడం సాధ్యమవుతున్నది. విద్యుత్ సంస్థల్లో భారీ ఎత్తున నియామకాలు కూడా చేపట్టింది ప్రభుత్వం. జెన్కో, ట్రాన్స్కో, డిస్కంలలో కలిపి 23,622 మంది ఆర్టిజన్లను రెగ్యులరైజ్ చేసింది. దీంతోపాటు 1,940 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులను, 708 సబ్ ఇంజినీర్లను, 304 జేఏఓలను, 4,603 జేఎల్లను 600 కు పైగా జూనియర్ అసిస్టెంట్లను, 269 ఆఫీసు సబార్డినేట్లతో పాటు అన్ని కేటగిరీలలో కలిపి 9,105 ఉద్యోగాలు భర్తీ చేసింది. విద్యుత్రంగంలో అపార అనుభవం కలిగిన డి.ప్రభాకర్రావును జెన్కో, ట్రాన్స్కో సీఎండీగా నియమించడం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న కీలకమైన నిర్ణయంగా పేర్కొనవచ్చు.
(వ్యాసకర్త: తుల్జారాంసింగ్ ఠాకూర్ , 78930 05313, అధ్యక్షులు, తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్, టీఎస్ఎస్పీడీసీఎల్)