స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ.. దేశంలో ఉత్సాహం నెలకొనాల్సిన సమయంలో చాలా మందిలో ఏదో అసంతృప్తి. స్వాతంత్య్ర ఫలాలను అనుభవించలేకపోతున్నామన్న నిరాశ. రాజ్యాంగం కల్పించిన సౌకర్యాలను కూడా అందుకోలేకపోతున్నామన్న బాధ. దీనికంతటికీ కారణం జాతీయస్థాయిలో నెలకొన్న ఒక విధమైన రాజకీయ శూన్యత. ఇది రాజకీయ సమతా స్థితి లేని పరిస్థితికి దారితీసి ప్రజాస్వామ్యానికే ముప్పు తెచ్చి పెడుతున్నది.
జాతీయస్థాయిలో రాజకీయ శూన్యత తొలగించాలన్న ఉద్దేశంతోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయ రంగప్రవేశం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన వద్ద ఉన్న విధానాలు, ప్రణాళికలు, వ్యూహాలను పరిశీలిస్తే ఈ నిర్ణయం సరైనదే అనిపిస్తున్నది. ప్రస్తుతం కావాల్సింది అందర్ని కలుపుకొని వెళ్లగలిగే సమ్మిళిత భావజాలం. ఆర్థికంగా, సామాజికంగానూ ఇది కనిపించగలగాలి. ఇందుకు సరికొత్త విధానాలు అవలంబించాలి. ఈ ఉద్దేశంతోనే ప్రత్యామ్నాయ పార్టీ కాదు.. ప్రత్యామ్నాయ విధానం తీసుకువస్తానని ఆయన గతంలోనే ప్రకటించారు. ఈ నూతన విధానానికి మూలాలు ఆయన కార్యాచరణలోనే ఉన్నాయి. దానినే దేశవ్యాప్తంగా విస్తరించాల్సి ఉన్నది.
శాంతిభద్రతలు ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. అది రాష్ట్రమైనా, దేశమైనా సరే. రాష్ట్రంలో ఎవర్నీ ద్వేషించింది లేదు. ఏ రాష్ట్రం అన్న దానితో సంబంధం లేకుండా ఎవరికి తగ్గ ఉపాధి వారు పొందుతున్నారు. ఈ సామరస్యం కారణంగానే హైదరాబాద్ ‘భాగ్యనగరం’ అన్న పేరును నిలబెట్టుకుంటున్నది. దేశంలో ఇంత అనుకూలమైన నగరం లేదంటూ పారిశ్రామికవేత్తలే చెప్తున్నారు. దేశమంతటా ఇదే వాతావరణం నెలకొంటే ప్రతిఒక్కరూ అభివృద్ధిలో భాగస్వాములవుతారు.
ఏ దేశానికైనా ప్రపంచంలో గౌరవం రావాలంటే సాంకేతికరంగంలో సాధించిన ప్రగతే కాదు, వ్యవసాయరంగం కూడా కొలమానం అవుతుంది. ఆహారోత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించకపోతే మిగిలిన రంగాల్లో ఎంత గొప్పతనం ఉన్నా ఉపయోగం ఉండదు. వ్యవసాయరంగం వృద్ధి చెందితే మిగతా రంగాలు ప్రగతిపథంలో నడుస్తాయని నిపుణులు చెప్తుంటారు. దేశం విశ్వ ధాన్యాగారం కావాలన్న విజన్ కేసీఆర్కు ఉన్నది. బలమైన రాజకీయ కూటమి ఏర్పాటుకు ఈ అంశమే కీలకం.
దేశంలో ప్రస్తుతం అసహనం రాజ్యమేలుతున్నది. ఈ పరిస్థితి భారత్కు విదేశాల్లోనూ ఇబ్బందులు కలిగిస్తున్న ది. ఎవరో కొందరు చేసిన అర్థం లేని వ్యాఖ్యల కారణంగా విదేశాంగ విధానమే సంక్షోభాన్ని ఎదుర్కొంటు న్నది. మిత్రదేశాల మధ్య చులకనయ్యాం. మనతో సత్సంబంధాలు కలిగి, మనవారికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించి, వాణిజ్య లావాదేవీలు నడిపే దేశాలు అసంతృప్తికి గురయ్యాయి. విద్వేషాన్ని ఇప్పుడే అరికట్టకపోతే భవిష్యత్తులో దుష్ఫలితాలుంటాయి. సామరస్యం నెలకొల్పడంలో నేర్పరితనం ఉన్న నేతలకే ఇలాంటి వాటిని చక్కదిద్దే సామర్థ్యం ఉంటుంది. స్వేచ్ఛ లేని చోట స్వాతం త్య్ర ఫలాలు సక్రమంగా అందవు. అందుకే రాజ్యాంగస్ఫూర్తిని పదిలపరిచేందుకు రాజ్యాంగంలోనే తగిన సవరణలు చేసి పటిష్ఠపరచాలంటూ కేసీఆర్ చెప్తున్నారు. ఇది కూడా ప్రత్నామ్నాయ విధానం కిందకే వస్తుంది.
రాజకీయాల్లో సిద్ధాంతాలు ఎంత ముఖ్యమో, నాయకుని వ్యక్తిత్వమూ అంతే ప్రధానం. వ్యక్తిత్వం కేసీఆర్కు ప్లస్ కానున్నది. అందరితో కలిసిపోయే తత్వం ఆయనది. అన్ని మతాల సారాంశాన్ని తెలుసుకొని గౌరవించే వ్యక్తి. మూడు భాషల్లో దిట్ట. ఆయన చేసే ప్రయత్నాలకు ఇవన్నీ సానుకూలంగా మారనున్నాయి.
(వ్యాసకర్త: గోసుల శ్రీనివాస్ యాదవ్, 98498 16817, గొల్లకురుమ (యాదవ) హక్కుల పోరాట సమితి, వ్యవస్థాపక అధ్యక్షులు)