సువిశాల భారతదేశంలో అపారమైన ఖనిజ సంపద, నీటి లభ్యత, మానవ వనరులు అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ రైతులకు సాగునీటి లేమి, అలవికాని విద్యుత్ కోతలు దేశ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దేశంలో యువతను నిర్వీర్యపరచే స్థాయిలో ఉన్న నిరుద్యోగం దేనికి సంకేతం? దేశంలో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకోవడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ప్రధాన వనరు బొగ్గు. మన దేశంలో సుమారు 356 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. ఇది ప్రపంచ నిల్వలలో సుమారు 10 శాతం. అయినప్పటికీ కేవలం 4 శాతం బొగ్గునిల్వలున్న ఇండోనేషియాతో పాటు, ఆస్ట్రేలియా నుంచి కూడా బొగ్గు దిగుమతి చేసుకొనే దుస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే దేశ ప్రజలు విద్యుత్ కోతలను ఎదుర్కొంటున్నారు. థర్మల్ విద్యుత్ కేంద్రాలు విధిగా 10 శాతం విదేశీ బొగ్గును వాడాలని కేంద్ర ఇంధనశాఖ ఇటీవల నిబంధన విధించింది. అందుకుగాను దేశీయ బొగ్గు ఉత్పత్తి కొరతను సాకుగా చూపించింది. అసలు బొగ్గు కొరత ఎందుకుందో, విద్యుత్ కోతలను ఎందుకు విధించాల్సి వస్తున్నదో ఒకసారి పరిశీలించాలి. వీటికి మన తెలంగాణ రాష్ట్రం మాత్రమే మినహాయింపుగా ఉండటం గమనార్హం.
విద్యుత్ డిమాండ్ పెరుగుదలను, కరోనా తదనంతర పరిస్థితులను అంచనా వేయడంలో మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం విఫలం చెందడమే ప్రధాన కారణం. గత నాలుగేండ్లలో బొగ్గు ఉత్పత్తి పెంపునకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం ఒక కారణమైతే, అంతర్జాతీయంగా పెరిగిన బొగ్గు ధరలు మరో కారణం. నిజానికి దేశంలో బొగ్గు కొరత లేదు. అంతా కృత్రిమ సృష్టే. 2014-15లో బొగ్గు ఉత్పత్తిలో 34 మిలియన్ టన్నులు, 2015-16లో 44 మిలియన్ టన్నుల పెరుగుదల నమోదైంది. 2016లో థర్మల్ కేంద్రాలకు బొగ్గు సరఫరాలో ఎలాంటి ఆటంకం ఏర్పడలేదు. ఒక దశలో బొగ్గును విదేశాలకు ఎగుమతి చేయాలని కోల్ ఇండియా లిమిటెడ్ భావించింది.
దేశవ్యాప్తంగా సుమారు 5 వేల హెక్టార్ల భూమి సేకరించి కొత్త బొగ్గు గనులను ప్రారంభించారు. రూ.35 వేల కోట్లతో కోల్ ఇండియా లాభాల దిశగా నడుస్తున్న సమయంలో ఏటా అదనంగా చేయాల్సిన బొగ్గు ఉత్పత్తిని నిలిపివేశారు. కోల్ ఇండియా వద్ద ఉన్న భారీ నగదు నిల్వలను ఫెర్టిలైజర్ పరిశ్రమలకు దారి మళ్లించారు. అదే సమయంలో ‘స్వచ్ఛభారత్’ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో మరుగుదొడ్లు కట్టే పనిని కాలరీస్ మేనేజర్లకు అప్పగించి మానవ వనరులను కూడా వృథా చేశారు. వెరసి కొత్త గనులు ప్రారంభం కాలేదు. 2018-19 నుంచి 2021 వరకు బొగ్గు ఉత్పత్తి 600 మిలియన్ టన్నులు దాటకుండా ఉద్దేశ పూర్వకంగా నియంత్రించారు. ఏటా 10 శాతం పెరుగుదల లక్ష్యాలను చేరుకున్నట్లయితే 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఉత్పత్తి సామర్థ్యం 800 మిలియన్ టన్నులకు చేరుకునేది. బొగ్గు కొరత అనే సమస్య ఉత్పన్నమయ్యేదే కాదు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా బొగ్గు కొరతను సృష్టించిన అనంతరం 38 మిలియన్ టన్నుల బొగ్గును విధిగా దిగుమతి చేసుకోవాలని, లేనిపక్షంలో దేశీయ బొగ్గు నుంచి 5 శాతం కోత విధించనున్నట్లు థర్మల్ కేంద్రాలకు తాఖీదులు పంపారు. దేశీయ మార్కెట్లో రూ.3 వేలకే టన్ను బొగ్గు దొరుకుతున్న సందర్భంలో, రూ. 25 వేలకు టన్ను విదేశీ బొగ్గును విధిగా కొనాలనడం దేనిని సూచిస్తున్నది? విదేశీ బొగ్గు కొనుగోలుకు జనరేటింగ్ స్టేషన్లు చెల్లించనున్న రూ.40 వేల కోట్ల అదనపు సొమ్మును ఎక్కడి నుంచి రాబట్టుకోవాలి. అంతిమంగా కరెంటు బిల్లులను పెంచి ప్రజల నుంచే వసూలు చేయాలి.
ఇక్కడే ఇంకో ఆసక్తికరమైన విషయం చెప్పుకోవాలి. ఇటీవల ద్వైపాక్షిక ఒప్పందాల్లో భాగంగా బొగ్గుపై విధించాల్సిన పన్నును ఆస్ట్రేలియా సున్నాకు తగ్గించింది. ఆస్ట్రేలియాలో అతిపెద్ద బొగ్గునిల్వలు అదానీకే ఉన్నాయి. విదేశాల్లో బొగ్గు నిల్వలు అత్యధికంగా ఉన్న అదానీనే భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తిదారుడు. అంటే ఇరువైపులా క్రయవిక్రయాలు జరిపేది ఒక్కరే అన్నమాట! విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలతో గతంలో డిస్కంలు కుదుర్చు కున్న కొనుగోలు ఒప్పందాలు (పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు -‘పీపీఏ’లు) ఏకపక్షంగా, అధిక ధరలతో ప్రజలకు భారంగా పరిణమించినందున సదరు ఒప్పందాలను పునఃసమీక్షించుకోవడానికి అవకాశం కల్పించమని కోరితే, కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ప్రస్తుతం బొగ్గుధరలు, తద్వారా ఉత్పత్తి వ్యయం పెరుగుతున్న దృష్ట్యా పీపీఏలను సమీక్షించుకోవడానికి ఆదేశాలివ్వడం కేంద్రప్రభుత్వ ద్వంద్వ ప్రమాణాలను సూచిస్తున్నది.
దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వరంగ, స్వతంత్ర (ప్రైవేట్) విద్యుత్ ఉత్పత్తిదారులు ఏడాదికి 38 మిలియన్ టన్నుల బొగ్గును అక్టోబర్ నెలాఖరులోగా కొనుగోలు చేయాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అల్టిమేటం జారీచేసింది. లేనిపక్షంలో దేశీయ బొగ్గు ఉత్పత్తి కొరత కారణంగా తలెత్తబోయే విద్యుత్తు కోతలకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. అధిక ధరలకు విదేశీ బొగ్గును కొనే ప్రసక్తే లేదని తెలంగాణ ట్రాన్స్కో సీఎండీ డి.ప్రభాకర్రావు తేల్చిచెప్పటం గమనించదగినది. బీజేపీ పాలనలో ఉన్న యూపీ ప్రభుత్వం కూడా విదేశీ బొగ్గు కొనుగోలుకు విముఖత వ్యక్తం చేసింది. రాబోయే జూలై, ఆగస్టు నెలల్లో మూడోసారి దేశంలో విద్యుత్ సంక్షోభం తలెత్తే ప్రమాదం పొంచి ఉన్నది. ఏటా సుమారు 49 మిలియన్ టన్నుల బొగ్గు కొరత ఏర్పడి విద్యుత్ వినియోగదారులు తల్లడిల్లిపోతున్నారు.
అయితే ఇక్కడ తాజా ఘటన ఒక్కటి చెప్పుకోవా లి. శ్రీలంకలో పవన విద్యుత్ ప్రాజెక్టు అదానీ సంస్థకు దక్కడం వెనుక భారత ప్రధాని మోదీ ఒత్తిడి ఉందని శ్రీలంక అధికారి, సీలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ చైర్మన్ ఎంఎంసీ ఫెర్డినాండో చెప్పడం గమనార్హం. ఈ నేపథ్యంలో, ఆస్ట్రేలియా నుంచి భారత్ బొగ్గు దిగుమతుల వెనుక కేంద్ర ప్రభుత్వ పరోక్ష తోడ్పాటు, అదానీకి ఆదాయాన్ని సమకూర్చే సయోధ్య లేదనుకోవటం సబబు కాదేమో.
అయినా పాలకులకు ముందుచూపు, చిత్తశుద్ధి, ప్రజల పట్ల ప్రేమ లేనప్పుడు పరిస్థితులను ఇంతకంటే మెరుగ్గా ఆశించలేమేమో.
(వ్యాసకర్త: తుల్జారాంసింగ్ ఠాకూర్ , 78930 05313, అధ్యక్షులు, తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్, టీఎస్ఎస్పీడీసీఎల్)