మహమ్మద్ ప్రవక్తను కించపరిచిన వివాదంపై ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా తన గళం వినిపించారు. బీజేపీ నేతల వ్యాఖ్యల మూలంగా గల్ఫ్ దేశాల నుంచి దౌత్యపరమైన తీవ్ర నిరసన వ్యక్తమైన నేపథ్యంలో ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విజ్ఞత నెలకొంటుందని, ముస్లింలపై సాగుతున్న విద్వేష వెల్లువ సమసిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తన నటనతో అనేక బహుమతులు అందుకున్న ఈ విలక్షణ నటుడు ఒక న్యూస్చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ- ప్రధాని మోదీ చొరవ తీసుకొని విష ప్రచారం వ్యాపించకుండా అడ్డుకోవాలని సూచించారు.
విద్వేష భావజాలం వ్యక్తం చేస్తున్న వారిలో విజ్ఞత నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు. రుషీకేశ్లో జరిగిన ధర్మ సంసద్లో వ్యక్తపరిచిన విద్వేష భావజాలంతో తాను ఏకీభవిస్తున్నదీ లేనిదీ ప్రధాని తెలుపాలని ఆయన అన్నారు.
బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ, ఢిల్లీ మీడియా విభాగం ఇంచార్జి నవీన్ కుమార్ జిందాల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అంతర్జాతీయంగా నిరసన వ్యక్తమైంది. దీంతో బీజేపీ నాయకత్వం నూపుర్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. జిందాల్ను బహిష్కరించింది. ముస్లిం వర్గాల నుంచి నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ ఇరువురి వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని ప్రకటించింది. తాము అన్ని మతాలను గౌరవిస్తామని, ఏ మతాన్నయినా కించపరచడాన్ని ఖండిస్తామని పేర్కొన్నది. ఇరువురు బీజేపీ నాయకుల అభ్యంతరకర వ్యాఖ్యలు ట్విటర్ ద్వారా ప్రచారం కావడంతో, అరబ్ దేశాల్లో భారతీయ ఉత్పత్తులను బహిష్కరించాలని కొందరు పిలుపు ఇచ్చారు. అయితే నూపుర్, జిందాల్పై పార్టీ నాయకత్వం చాలా జాప్యం చేసి, అల్పమైన చర్య తీసుకున్నదని షా అన్నారు. విద్వేష ప్రచారాన్ని నిలిపివేయడానికి నిర్దిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. నూపుర్ వ్యాఖ్యలపై బీజేపీ నాయకత్వం స్పందిస్తూ వారు ప్రధాన స్రవంతి నాయకులు కాదని పేర్కొనడం పట్ల షా అభ్యంతరం వ్యక్తం చేశారు.
నూపుర్ పార్టీ అధికార ప్రతినిధి అని గుర్తుచేశారు. బీజేపీ నాయకత్వం గాయపడిన వారిని అనునయించడానికి చిత్తశుద్ధితో క్షమాపణ చెప్పడం లేదని, ద్వంద్వ ప్రమాణాలతో వ్యవహరిస్తున్నారని అన్నారు. నూపుర్ శర్మను చంపుతామని బెదిరించడాన్ని కూడా షా తప్పుబట్టారు. ఆ విధంగా ఆలోచించడమే తప్పు అన్నారు. అటువంటి ఆలోచనా విధానం వల్లనే పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ ఈ స్థితిలో ఉన్నాయని ఆ తోవలో మనం వెళ్ళవద్దని, కానీ అదే జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఆవును చంపారనే అనుమానంతో మనుషులను చంపుతున్నారు. ఇటువంటివి మొరటు ఇస్లామిక్ దేశాలలోనే తప్ప, మన దేశంలో జరగలేదని ఆయన అన్నారు.
షారూక్, అమీర్, సల్మాన్ ఖాన్లు ఎందుకు మౌనం వహిస్తున్న విషయాన్ని కూడా నసీరుద్దీన్ షా ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. ప్రస్తుతం రగులుతున్న అంశంపై వ్యాఖ్యానిస్తే వారికి ఎంతో నష్టం జరుగుతుండవచ్చునని షా అభిప్రాయపడ్డారు. ‘వారి తరఫున నేను మాట్లాడలేను, వారున్న స్థానంలో నేను లేను. ఈ విషయంపై నోరు విప్పితే తమకు నష్టం జరుగుతుందని వారు భావిస్తుండవచ్చు. కానీ వారు తమ అంతరాత్మకు ఎలా సమాధానం చెప్పుకొంటారో నాకు తెలియదు. అయితే ఈ విషయంపై మాట్లాడితే నష్టం జరిగే స్థితిలో వారు ఉండవచ్చు’ అని నసీరుద్దీన్ షా అన్నారు. షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ను వెంటాడిన ఉదంతాన్ని ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. ‘షారుక్ ఖాన్కు ఏమి జరిగిందో తెలుసు. అయినా ఎంతో హుందాగా పరిస్థితిని ఎదుర్కొనడం ప్రశంసనీయం. ఇది పచ్చి వేధింపు. షారుక్ నోరు బిగబట్టుకొని ఉన్నారు. ఆయన చేసిందల్లా తృణమూల్కు మద్దతు పలకడం, మమతా బెనర్జీని పొగడటం. సోనూసూద్పై కూడా దాడులు జరిగాయి. ఎవరు మాట్లాడినా స్పందన వస్తున్న ది. ఇప్పుడు నా వంతు కావచ్చు. అయినా నా దగ్గర వాళ్ళకేమీ లభించదు’ అని నసీరుద్దీన్ షా నవ్వుతూ అన్నారు.
‘జాతీయవాదం’ పేర సాగుతున్న ప్రాజెక్టులలో నటులు, సినీ నిర్మాతలు పాల్గొనడం గురించి కూడా నసీరుద్దీన్ షా మాట్లాడారు. వివేక్ అగ్నిహోత్రి కశ్మీర్ ఫైల్స్ గురించి అడిగినప్పుడు వారు గెలిచే వైపు ఉండాలనుకుంటున్నారు అని షా వ్యాఖ్యానించారు. కశ్మీర్ ఫైల్స్ గురించి చెబుతూ కశ్మీరీ హిందువుల బాధలపై తీసిన కాల్పనిక చిత్రమని, దీన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదన్నారు. కుహనా దేశభక్తి సినిమాలు ఇంకా రావచ్చునని కూడా ఆయన అన్నారు.
టీవీ చానెల్స్ విద్వేష భాషణలను ప్రోత్సహిస్తున్నాయని షా తప్పుబట్టారు. విద్వేషాన్ని వండి వారుస్తున్నారనీ, భిన్నాభిప్రాయం ఎదురైనప్పుడు, విషం చిమ్ముతున్నారనీ, దీనికి చానెల్స్, సోషల్ మీడియా తోడ్పడుతున్నాయని విమర్శించారు.
– ఎడిటోరియల్ డెస్క్