మన దేశ జనాభా 140 కోట్లు. వీరిలో 100 కోట్ల మందికి పౌష్టికాహారం లభించటం లేదు. నరేంద్రమోదీ పాలనలో భారతీయులకు తినటానికి సరైన తిండి కూడా దొరకటం లేదని ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్’ తాజా నివేదిక వెల్లడించింది. దీన్ని బట్టి దేశం ఏ రీతిన పయనిస్తుందని భావించాలి? దేశమంటే మట్టి కాదు.. దేశమంటే మనుష్యులని, ఆ మనుష్యులకు తిండి ఉంటేనే కండ కలుగుతుందని గురజాడ 120 ఏండ్ల కిందటే చెప్పారు. ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టమని ఉద్బోధించారు. సాధారణ వ్యక్తుల కంటే పాలకులకు ఈ మాటల్లోని స్ఫూర్తి అత్యంత అవసరం. కానీ, ఇట్లాంటి మంచి మాటలను పట్టించుకునే సహనంగానీ, వివేకంగానీ ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్న వారిలో ఇసుమంత కూడా కనిపించటం లేదు. సువిశాల భారతావనిలో ఆకలి కేకలు ప్రతిధ్వనిస్తున్నాయని ఈ ఒక్కటే కాదు.. ఇంతకుముందే పలు నివేదికలు తెలియజేశాయి.
ప్రపంచ ఆకలి సూచీలో భారత్ ర్యాంకు 2014లో 55 కాగా, గతేడాది అది 101కి పడిపోయింది. మొత్తం 116 దేశాలలో మనకు దక్కిన స్థానం అది. రెండేండ్ల వయసులోపు శిశువుల్లో 89 శాతం మందికి బలవర్ధకమైన ఆహారం లభించటం లేదని జాతీయ కుటుంబ ఆరోగ్య తాజా సర్వే ఈ మధ్యన వెల్లడించింది. దిగ్భ్రాంతి కలిగించే మరొక విషయమేమిటంటే ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం విడుదల చేసిన ఆహారవృథా సూచిక-2021లో ఆహారాన్ని విపరీతంగా వృథా చేస్తున్న తొలి ఐదు దేశాల్లో భారత్ ఒకటి. దీని అర్థం ఏమిటి? పండే పంటలు పండుతూనే ఉన్నాయి.. పొంగిపొర్లుతున్న గోదాముల్లో ధాన్యం గింజలను ఎలుకలు తింటూనే ఉన్నాయి.. అన్నార్థుల ఆక్రందనలు కొనసాగుతూనే ఉన్నాయి. దేని దారి దానిదే. ప్రభుత్వం అనేది ఒకటి ఉన్నట్టా? లేనట్టా? మోదీ పాలనలో చమురు, నిత్యావసరాల ధరలు ఆకాశన్నంటటంతో పౌష్టికాహారం కాదు కదా.. ఆహారాన్నే కొనలేని స్థితిలో కోట్ల మంది భారతీయులు ఉన్నారు. ఏటా 10 కోట్ల మంది బలవర్ధక ఆహారం తీసుకోలేని దుస్థితిలోకి నెట్టబడుతున్నారు. ఫలితంగా తలెత్తే ఆరోగ్య సమస్యల కారణంగా ఏటా 16 లక్షల మంది మరణిస్తున్నారు. ఇదీ మోదీ భారత్.
ఇదే దేశంలో ఎనిమిదేండ్ల కిందట కొత్తగా ఆవిర్భవించిన రాష్ట్రం తెలంగాణ. భవిష్యత్తు తరాలకు బలవర్ధకమైన ఆహారాన్ని అందించటానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. వేలాది ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో, వందలాది గురుకులాల్లో విద్యార్థులకు సన్నబియ్యం అన్నంతోపాటు సంపూర్ణ పౌష్టికాహారాన్ని అందిస్తున్నది. విద్యార్థులకు ఇచ్చే మెస్ఛార్జీలను పెంచింది. శైశవ దశలో ఉన్న చిన్నారులతోపాటు గర్భిణులకు, బాలింతలకు మంచి ఆహారం ఇవ్వటం కోసం రాష్ట్రం ఏర్పాటైన కొత్తలోనే అంగన్వాడీ వ్యవస్థను ప్రక్షాళన చేసింది. ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. గిరిజనుల కోసం ‘గిరి పోషణ్’ తీసుకొచ్చింది. రూ.5కే భోజనం అందించే అన్నపూర్ణ కేంద్రాలను నడుపుతున్నది. ఏజెన్సీ ప్రాంతాల్లోని గర్భిణులకు ప్రత్యేకంగా ‘కేసీఆర్ పోషకాహారాల కిట్’ను ఇవ్వాలని తాజాగా నిర్ణయించింది. ఈ చర్యల వల్లనే పలు ఆరోగ్య సూచీల్లో జాతీయ సగటుకన్నా, పలు రాష్ర్టాలకన్నా తెలంగాణ ఎంతో ముందుంది. తెలంగాణను చూసి మోదీ సర్కారు నేర్చుకోవాలి.