జీఎస్టీ కౌన్సిల్ చేసే సిఫారసులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుపరచవలసిన అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం నరేంద్రమోదీ ప్రభుత్వ కేంద్రీకరణ ఎజెండాకు పెద్ద ఎదురుదెబ్బ. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీ వై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం జీఎస్టీ కౌన్సిల్ సిఫారసులను రాష్ర్టాలపై కానీ, కేంద్రంపై కానీ రుద్దడం రాజ్యాంగం ప్రతిపాదించిన సహకార సమాఖ్య విధానానికి గొడ్డలిపెట్టుగా అభిప్రాయపడింది.
తీర్పులో ధర్మాసనం ఈ విధంగా అభిప్రాయపడింది..
1. కలసికట్టుగా సాగించిన చర్చల ఫలితంగానే జీఎస్టీ కౌన్సిల్ సిఫారసులు రూపొందాయి. కాబట్టి, సమాఖ్య విభాగాలలో ఒకటి ఎల్లప్పటికీ పైచేయిగా ఉండటం కుదరదు. 2. రాజ్యాంగంలోని 279 ఏ ఆర్టికల్ non-obstante clauseతో మొదలుకాలేదని, 246-ఏ లో repugnancy provisionను పొందుపరచలేదని ధర్మాసనం పేర్కొన్నది. భారత సమాఖ్యవాదం అంటే రాష్ట్రం, కేంద్రం నిరంతరం చర్చించుకుంటూ ఉండటమేనని తీర్పులో ధర్మాసనం పేర్కొనడం సహకార సమాఖ్య సూత్రాల ప్రాధాన్యాన్ని నొక్కిచెబుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వ అధికారాల్ని కేంద్రం హరించివేయలేదని, రాజ్యాంగం ప్రతిపాదించిన సహకార సమాఖ్య విధానం అనేది కేంద్రం పాటించవలసిన బాధ్యత అని సుప్రీంకోర్టు కేంద్రానికి ఈ తీర్పు ద్వారా గుర్తుచేసింది. ఐజీఎస్టీ ట్యాక్స్ ‘on ocean freight IGST act’కు లోబడి లేదని, ఆ చట్టానికి చట్టబద్ధత లేదని ‘మోహిత్ మినరల్స్ x కేంద్రప్రభుత్వం’ కేసులో గుజరాత్ హైకోర్టు 2020లో అభిప్రాయపడింది. ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయగా జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం జీఎస్టీ కౌన్సిల్పై కీలక వాఖ్యలు చేసింది.
101 రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పడిన జీఎస్టీ.. భారతదేశంలో సహకార సమాఖ్య విధానాన్ని తుంగలో తొక్కి, కేంద్రీకృత పన్ను విధానాన్ని రూపొందించింది. ఆర్టికల్ 279 ఏ 9 ప్రకారం.. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఆ సమావేశానికి హాజరై, ఓటేసిన సభ్యులలో కనీసం నాలుగింట మూడు వంతుల మెజారిటీ ఉండాలి. ఇందుకు ఈ కింది రెండు సూత్రాలు వర్తిస్తాయి.
మొత్తం వేసిన ఓట్లలో కేంద్రప్రభుత్వ ఓట్లకు మూడింట ఒక వంతు వెయిటేజీ ఉంటుంది.
మొత్తం వేసిన ఓట్లలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ఓట్లకు కలిపి మూడింట రెండు వంతుల వెయిటేజీ ఉంటుంది.
ఈ విధంగా ఓట్లు ఇవ్వడం వలన కేంద్రప్రభుత్వానికి వీటో అధికారం ఇచ్చినట్లు అయ్యింది. జీఎస్టీ కౌన్సిల్లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, దానిని అమలు చేయాలన్నా 3/4 మెజారిటీ ఉండాలి. అంటే దేశంలోని అన్ని రాష్ర్టాలు కలసికట్టుగా ఒక నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆ నిర్ణయాన్ని కేంద్రం సహకారం లేకుండా అమలు పరచుకోలేని విధంగా జీఎస్టీ కౌన్సిల్ను రూపొందించారని స్పష్టమవుతున్నది. ఇది రాజ్యాంగం ప్రతిపాదించిన సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధం.
ఆర్టికల్ 279 ఏ 11 ప్రకారం.. జీఎస్టీ కౌన్సిల్ సిఫారసుల అమలు విషయంలో కేంద్రానికి-రాష్ర్టాలకు మధ్యగానీ, రాష్ర్టాలకు-రాష్ర్టాలకు మధ్యగానీ విభేదాలు తలెత్తితే పరిష్కరించుకోవడానికి జీఎస్టీ కౌన్సిల్ తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. ఈ ఆర్టికల్ సవరణ సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమైనది. Principle of nemo judex in causa sua, i.e., no- one should be a judge in his own case (తన కేసులో తనే జడ్జిగా ఉండటం కుదరదు).
జీఎస్టీ కౌన్సిల్ చేసిన తప్పు ఒప్పులపై నిర్ణయాధికారం అదే కౌన్సిల్కు ఇవ్వడం ప్రజాస్వామ్యం మూలస్తంభాల్లో ఒకటైన న్యాయవ్యవస్థను అపహాస్యం చేసినట్టుగా ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 245, 246 కేంద్ర-రాష్ట్ర అధికారాలను, వాటి పరిధులను సమగ్రంగా నిర్వచించాయి. కానీ, 101వ రాజ్యాంగ సవరణ రాష్ర్టాల అధికార పరిధులను కుదించే విధంగా ఉన్నదని రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సవరణతో ఐజీఎస్టీ,
compensation CESSలను తీసుకొచ్చి రాజ్యాంగంలో పొందుపరచని ఒక కొత్త devolution channel ను ఏర్పాటు చేసారు. ఈ మొత్తం Consolidated Fund of Indiaలో జమ కాదు. అంటే ఈ మొత్తాన్ని ఫైనాన్స్ కమిషన్ ప్రతిపాదించిన 41 శాతం devolution ఫార్ములా ప్రకారం రాష్ర్టాలకు పంచరు. ఈ ఐజీఎస్టీ, సెస్ పంపకాలు లోపభూయిష్టంగా ఉన్నాయని ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. దీన్ని రాజ్యాంగ నిపుణులు అసమాన సమాఖ్య విధానంగా అభివర్ణించారు.
1994 నాటి ఎస్సార్ బొమ్మై x కేంద్రప్రభుత్వం కేసులో, 2011 నాటి నాగరాజన్ x కేంద్రప్రభుత్వం కేసులో, 2018 నాటి నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ప్రభుత్వం x కేంద్రప్రభుత్వం కేసులో, కుల్దీప్ నయ్యర్ x కేంద్రప్రభుత్వం కేసులో వచ్చిన తీర్పులు ఈ సందర్భంగా గమనార్హమైనవి. సమాఖ్యతత్వం భారత రాజ్యాంగ ప్రాథమిక స్వరూపమని, ఏ షరతులైనా రాజ్యాంగ సమాఖ్య స్వరూపానికి భంగకరం కాకుండా ఉండాలని సుప్రీంకోర్టు ఇంతకు ముందే స్పష్టంగా చెప్పింది.
జీఎస్టీ కౌన్సిల్ సహకార సమాఖ్య స్ఫూర్తిని పెంపొందిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ ఆన్నప్పటికీ దానికి విరుద్ధంగా జరిగింది. సంఘర్షణ సమాఖ్యకు జీఎస్టీ కారణం అయ్యింది. ఒకే దేశం-ఒకే పన్ను అనే విధానం వల్ల రాష్ర్టాలకు ఆదాయం ఏటా 14 శాతానికి పైగా పెరుగుతుందని, ఏవైనా రాష్ర్టాలు రాబడి కోల్పోతే 2022 జూలై వరకు పరిహారం చెల్లిస్తామని మోదీ ప్రభుత్వం రాష్ర్టాలకు ఒక సుందర స్వప్నం చూపించింది.
అది నమ్మిన రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీని ఆహ్వానించి ఆమోదించాయి. కానీ, అంచనాలు అన్నీ సమూలంగా తప్పాయి. కరోనాకు ముందు కూడా 14 శాతం రెవెన్యూ వృద్ధిని జీఎస్టీ చూపలేకపోయింది. కరోనా తర్వాత పరిస్థితి ఇంకా అధ్వాన్నంగా తయారైంది. ఇప్పుడిప్పుడే జీఎస్టీ కొంత మెరుగుపడినప్పటికీ, వచ్చే జూలై తర్వాత రాష్ర్టాలకు ఎటువంటి పరిహారం అందే పరిస్థితి ఉండదు. అంటే రాష్ర్టాల ఆర్థిక పరిస్థితి మరింత
అధ్వాన్నంగా తయారు కానుందని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
సెస్ను విపరీతంగా పెంచి ఏటా సుమారు రూ.4 లక్షల కోట్లకుపైన కేంద్రప్రభుత్వం మూటగట్టుకుంటున్నది. కానీ, ఆ ఆదాయాన్ని రాష్ర్టాలతో పంచుకోవడం లేదు. రాష్ర్టాలకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన అప్పులకు షరతులు పెడుతున్నది. రాష్ట్రప్రభుత్వాల పరిధిలోని సార్వభౌమ హామీని రాష్ట్ర outstanding liabilityని కలిపి చూడటం రాజ్యాంగ విరుద్ధం.
నరేంద్రమోదీ ప్రభుత్వం చేస్తున్న రాజ్యాంగ విరుద్ధ పనులను మేధావులు, రాజ్యాంగ నిపుణులు, రాష్ర్టాలు వ్యతిరేకిస్తున్నాయి. రాజ్యాంగ పరిరక్షణ, సమాఖ్య పరిరక్షణ, భారతీయత అనే తాత్విక భావన పరిరక్షణ బాధ్యత మనందరిపై ఉంది. జీఎస్టీ కౌన్సిల్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సహకార సమాఖ్య విధానం బలోపేతం కోసం చేసే పోరాటానికి కొత్త ఉత్తేజం ఇస్తుందనడంలో సందేహం లేదు.
– పెండ్యాల మంగళాదేవి