వేములవాడ చాళుక్యుల కాలం యుద్ధాలకు,ఎదుగుతున్న తెలుగు, కన్నడ సాహిత్యానికి, జైన ప్రాభవానికి, సమాజంలో మారుతున్న వర్ణ (కుల) వ్యవస్థకు సాక్షి. ఈ కాలంలో తెలంగాణలో ఒక భాగం నేరుగా రాష్ట్రకూట పాలనలో ఉంటే, కరీంనగర్, నిజామాబాద్ ప్రాంతం రాష్ట్రకూట సామంతులైన వేములవాడ చాళుక్యుల పాలనలో ఉంది. వేములవాడ చాళుక్యులే కాకుండా ఇంకొంతమంది సామంతులు కూడా రాష్ట్రకూట ప్రతినిధులుగా తెలంగాణలోని చిన్న చిన్న ప్రాంతాల్ని ఏలినట్లు తెలుస్తున్నది.
భీమకవి ఎక్కడి వాడు?: వేములవాడ భీమకవి ఎక్కడి వాడు, ఎప్పటి వాడు అనేది తెలుగు సాహిత్యంలో ఇప్పటికీ చర్చనీయాంశం. భీమకవిది వేములవాడ అని చెప్పడానికి చారిత్రక ఆధారాలు ఇప్పటివరకైతే దొరుకలేదు. ‘ద్రాక్షారామ భీమేశ’ పద్యపాదంలోని భీమేశ్వరుడు ద్రాక్షారామంలో ఉండొచ్చుగాక.. భీమకవి పేరుతోపాటు ఉన్న వేములవాడ మాత్రం ద్రాక్షారామంలో లేదు కదా. కాబట్టి, భీమకవి వేములవాడకు చెందిన వ్యక్తే అనుకోవటానికి ఆస్కారం ఉంది.
భువనగిరి ప్రాంతంలో దొరికిన మంతపురి శాసనం ప్రకారం.. అయ్యనయ్య అరసర్ అనే మహాసామంతుడు ఈ ప్రాంతాన్ని ఏలాడు. శంకరగండరస అనే మహాసామంతాధిపతి జనగామ, యాదాద్రి-భువనగిరి జిల్లాలోని కొంత ప్రాంతాన్ని ఏలినట్లు ఇతర శాసనాధారాలు చెపుతున్నాయి.
వేములవాడ చాళుక్యుల పేర్లు అన్నీ యుద్ధానికి, పరాక్రమానికి సంబంధించినవే. ఇది ఆ కాలంలో ఉన్న రాజకీయాల్ని సూచిస్తుంది. రాష్ట్రకూట సామంతులుగా వీళ్ళు, కేవలం వేంగీ చాళుక్యులతోనే కాదు, వింధ్యకు పైన ఉత్తర భారతదేశంలో ప్రతీహారులతో, పాల వంశ రాజులతో యుద్ధాలు చేశారు. నరసింహ అనే రాజు మాళ్వా (మధ్యభారతం)లో ఏడుగురు రాజుల్ని ఓడించి వారి నుంచి కప్పం వసూలు చేశాడని, గూర్జర ప్రతీహార రాజును ఓడించి ఆయన రాజ్యంలో యమునా తీరంలోని కాళప్రియ (కాల్పి) దగ్గర విజయస్తంభం పాతించాడని వేములవాడ శాసనంలో ఉంది. వీరి అస్తిత్వం రాష్ట్రకూట రాజ్యబలంతో పెనవేసుకుని ఉంది. రాష్ట్రకూటులు చేసిన యుద్ధాలను వీరు ముందుండి నడిపించారు. అందుకే వీరి పేర్లు, బిరుదులు పరాక్రమాన్ని సూచించేవిగా ఉన్నాయి. ఉదాహరణకు యుద్ధమల్ల, అరికేసరి (శత్రువులకు సింహం వంటి వాడు), నరసింహ వంటి పేర్లు, పాంబరాంకుశ, త్రిభువన మల్ల వంటి బిరుదులూ. వేములవాడ చాళుక్యులు రాష్ట్రకూటులకు సామంతులే కాదు, వారి బంధువులు కూడా. కవ్వ, రేవక నిర్మాడి, లోకాంబిక- రాష్ట్రకూట రాజకుమార్తెలైన వీళ్ళు వేములవాడ చాళుక్య రాజులను పెళ్లి చేసుకుని రాణులైనారు.
బోధన్లో పంప కవి సమాధి
కన్నడ సాహిత్యం తెలంగాణలో పరిమళించడం ఒక విశేషం. తెలంగాణ నేలలో అనాదిగా ఉన్న వైవిధ్యానికి ఇది సూచిక. రెండవ అరికేసరి కాలంలో ఉన్న పంప కవి కన్నడ కవిత్రయంలో మొదటివాడు. కన్నడ ఆది కవిని పోషించింది మన వేములవాడనే. పంప కవి రచనలు.. విక్రమార్జున విజయం (పంప భారతం), ఆదిపురాణం. విక్రమార్జున విజయంలో పంప కవి అరికేసరిని అర్జునుడితో పోలుస్తాడు.
బోధన్ కోట గోడ పక్కన దొరికిన సమాధి ఫలకంపై ఉన్న శాసనం పంప కవి సమాధి బోధన్లో ఉందని చెబుతుంది. దేవేంద్ర సిద్ధాంత మునీశ్వరస్య / శిష్యోభావ శ్రీ ఛుభినందిను (నా)మా / ఆరాధ్య రత్నత్రయ రంత్య కాళే/ సమాధి నాసౌ సురలోక కూప- అని ఉన్న శాసనం జైన సన్యాసి అయిన తర్వాత శుభనందిగా మారిన పంప సమాధి ఇదేనని స్పష్టం చేస్తున్నది. వేములవాడలో జీవించిన పంప బోధన్లో ఎందుకు సమాధి అయ్యారన్న ప్రశ్నకు బాహుబలి కథ జవాబు ఇస్తుంది. జైన మొదటి తీర్థంకరుడైన రుషభనాథుడి కొడుకైన బాహుబలి బోధన్ పాలకుడని, అక్కడే ధ్యానం చేసి సిద్ధుడైనాడని ఆదిపురాణం చెపుతుంది. బాహుబలితో పునీతమైన క్షేత్రం కాబట్టి జైనులకు బోధన్ పుణ్య క్షేత్రం. అందుకే పంప సమాధి బోధన్లో ఉందని చరిత్రకారుల అభిప్రాయం.
ఇదే కాలంలో ప్రముఖ జైన పండితుడు సోమ దేవ సూరి కూడా జీవించారు. వేములవాడ రాజేశ్వరాలయంలోని జైన విగ్రహం పీఠంపై ఉన్న నాలుగు వాక్యాల శాసనం గౌడ సంఘానికి (ఇప్పటి గౌడ కులం కాదు) చెందిన జైన పండితుడు సోమదేవ సూరి కోసం శుభధామ జినాలయాన్ని కట్టి ఇచ్చినట్టుగా చెపుతుంది. యశస్తిలక అనే జైన గ్రంథ రచయిత సోమదేవసూరి. అలాగే ఈ కాలంలోనే జీవించిన జినవల్లభుడు పంప సోదరుడు. ఈయన తెలుగు సాహిత్యంలో తొలి కంద పద్యాన్ని రాశాడు. దీనికి ఆధారం కుర్క్యాల శాసనం. ఇదే కాలంలో ఉన్న మరొక పండితుడు మల్లియ రేచన. ఇలా వేములవాడ చాళుక్యుల కాలంలో కన్నడ, తెలుగు సాహిత్యాలు పెనవేసుకొని అభివృద్ధి చెందాయి.
-డా. ఎం.ఏ. శ్రీనివాసన్
81069 35000