రీసెర్చ్ ఆర్టికల్స్ (పరిశోధక పత్రాలు) రాసి వాటిని వివిధ జర్నల్స్లో పబ్లిష్ చేయడం ఇప్పుడు గతంలో కంటే కఠినతరంగా మారింది. కారణం, దేశంలోని జర్నల్స్ స్టాండర్డ్స్ లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తీసుకువచ్చిన సంస్కరణలే. 2017లో ప్రారంభమైన పబ్లికేషన్ నిబంధనలు 2022 నాటికి మరింత కఠినతరం అయ్యాయి.
రీసెర్చ్ ఆర్టికల్స్ను యూజీసీ కేర్ జర్నల్స్లో మాత్రమే పబ్లిష్ చేయాలి. ఇతర జర్నల్స్లో పబ్లిష్ చేస్తే వాటికి గుర్తింపు ఉండదు. యూజీసీ వెబ్సైట్లో కేర్ జర్నల్స్ వివరాలను పొందుపరుస్తున్నారు. యూజీసీ కేర్లో ఒక జర్నల్ నమోదు కావాలంటే నూతన ఫైండింగ్స్తో కూడుకున్న ఆర్టికల్స్ను ప్రచురించడంతోపాటు యూజీసీ ఇతర నిబంధనలు సైతం పాటించాలి. ఇక ఒక ఆర్టికల్ ప్రచురణకు నిర్ణయం తీసుకోవటానికి ఐదు నుండి ఎనిమిది నెలల కాలం పడుతుంది. నాణ్యతలోపం కారణంగా కూడా ఆర్టికల్స్ను తిరస్కరిస్తున్నారు.
రీసెర్చ్ ఆర్టికల్స్ పబ్లిష్ చేయడం ఎవరికి అవసరం?
దేశవ్యాప్తంగా వివిధ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు మరియు యూనివర్సిటీ అధ్యాపకులు రీసెర్చ్ ఆర్టికల్స్ను రాసి జర్నల్స్లో పబ్లిష్ చేయాలి. తద్వారా వారికి ప్రమోషన్, ఇంక్రిమెంట్ వంటివి సులభతరం కావటంతోపాటు అకడమిక్ పెర్ఫామెన్స్ ఇండికేటర్స్ స్కోర్ పెరుగుతుంది. డిగ్రీ కళాశాలలకు మరియు విశ్వవిద్యాలయాలకు లభించే నాక్ గ్రేడ్ల కోసం కూడా ఆయా కాలేజీల్లోని అధ్యాపకుల రీసెర్చ్ ఆర్టికల్స్ను పరిగణలోకి తీసుకుంటారు. అదేవిధంగా, యూనివర్సిటీ అధ్యాపక పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం ఐదు రీసెర్చ్ ఆర్టికల్స్ పబ్లిష్ చేసి ఉండాలి. యూనివర్సిటీల్లోని పరిశోధక విద్యార్థులు సైతం తమ పరిశోధక గ్రంధాల మూల్యాంకనం కోసం తప్పనిసరిగా కనీసం రెండు రీసెర్చ్ ఆర్టికల్స్ను పబ్లిష్ చేయాలి.
యూజీసీ సంస్కరణలు ఏమిటి?
2016కు ముందు రీసెర్చ్ ఆర్టికల్స్ను ఐఎస్ఎస్ఎన్ నెంబర్ కలిగిన ఏ జర్నల్లోనైనా పబ్లిష్ చేసుకునే అవకాశం ఉండేది. పరిశోధనలలో నాణ్యతను పెంచే ఉద్దేశంతో యూజీసీ 2016లో తొలిసారిగా కొన్ని జర్నల్స్ను గుర్తించి వాటిని ‘కేర్ జర్నల్స్’గా పేర్కొంది. వీటిలోనే ఆర్టికల్స్ను ప్రచురించుకోవాలని తెలిపింది. సుమారు 80 శాతం జర్నల్స్ను తీసివేసి, మిగిలిన వాటిని గ్రూప్-1, గ్రూప్-2లుగా విభజించి యూజీసీ కేర్ జర్నల్స్ని 2019లో ప్రకటించింది. గ్రూప్-1లో మొత్తంగా విదేశీ స్క్యూపస్ గ్రూప్ (అత్యున్నత ప్రమాణాలు పాటించే) జర్నల్స్ను, గ్రూప్-2లో నాణ్యతను బట్టి స్వదేశీ స్క్యూపస్ మరియు ఇతర జర్నల్స్ను చేర్చింది. గ్రూప్-2లోని జర్నల్స్ని వెబ్ అఫ్ సైన్స్ మరియు స్క్యూపస్ జర్నల్స్ అని రెండు రకాలుగా విభజించారు. వీటికితోడు ‘పీర్ రివ్యూడ్’ జర్నల్స్లో కూడా ఆర్టికల్స్ను పబ్లిష్ చేసుకోవచ్చని పేర్కొన్నది. కానీ పీర్ రివ్యూ జర్నల్స్కు తగిన గుర్తింపు లేకపోవడంతో పరిశోధకులు యూజీసీ కేర్ జర్నల్స్ వైపే మొగ్గుచూపుతున్నారు. అయితే యూజీసీ కేర్ జర్నల్ను గుర్తించడం క్లిష్టమైన విషయం.
యూజీసీ లిస్టెడ్ జర్నల్స్ను ఎలా తెలుసుకోవాలి?
2016 నుండి నాణ్యత లోపంతో తొలిగించబడిన జర్నల్స్ ఇప్పటికీ తాము యూజీసీ లిస్టెడ్లో ఉన్నామని పరిశోధకులను మోసం చేస్తున్నాయి. మరోవైపు, యూజీసీ నిర్లక్ష్యం వల్ల కొన్ని జర్నల్స్ యూజీసీ కేర్ స్క్యూపస్ లిస్ట్లోనుండి 2020లో తొలగింపునకు గురైనా, వాటిని వెబ్సైట్లో పేర్కొనడం వలన పరిశోధకులు ఆయా జర్నల్స్లో పబ్లిష్ చేసుకుంటున్నారు. ఆ జర్నల్స్ సైతం పరిశోధకుల నుంచి డబ్బులు వసూలు చేసి పబ్లిష్ చేస్తున్నాయి. కానీ చివరకు అవి స్క్యూపస్ డేటా బేస్లో లేకపోవడంతో చెల్లుబాటు కావడంలేదు. కాబట్టి పరిశోధకులు తప్పనిసరిగా యూజీసీ వెబ్సైట్లో పేర్కొన్న గ్రూప్-1 మరియు గ్రూప్-2 జర్నల్స్ను జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. జర్నల్ ఐఎస్ఎస్ఎన్ నెంబర్తో సెర్చ్ చేసిన తర్వాత ‘సోర్స్ టైటిల్’పై క్లిక్ చేయాలి. తద్వారా ఆ జర్నల్ స్క్యూపస్లో ఎ సంవత్సరం వరకు లిస్ట్ అయిందో గమనించవచ్చు. ‘క్లోన్డ్ జర్నల్స్’ను కూడా యూజీసీ తన వెబ్సైట్లో పేర్కొన్నది.
జర్నల్స్ మూడు రకాలు. మొదటిది ‘స్క్యూపస్ మరియు ఏబీడీసీ గ్రూప్ జర్నల్స్. జర్నల్ యొక్క నాణ్యతను బట్టి ఈ గ్రూప్లో చేర్చుకుంటారు. నూతన పరిశోధనలను మాత్రమే ఈ జర్నల్స్లో పబ్లిష్ చేస్తారు. ప్రఖ్యాతిగాంచిన ఎల్స్వెర్, స్ప్రింగర్, వెల్లి మొదలగు గ్రూప్లకు చెందిన జర్నల్స్ ఈ కోవలోకి వస్తాయి. రెండవది యూజీసీ కేర్ జర్నల్స్. దీనిలో స్క్యూపస్ గ్రూప్లోని జర్నల్స్తో పాటు ఇతర జర్నల్స్ను కూడా పేర్కొన్నారు. వీటిలో ఆర్టికల్స్ ప్రచురించుకోవాలి అంటే చాలా కష్టతరం. పరిశోధకులు సమర్పించే ప్రతీ ఆర్టికల్ను కనీసం ముగ్గురు నిపుణులు సమీక్షించి ఆమోదించిన తర్వాతే పబ్లిష్ చేస్తారు. దీనికి అధిక సమయం పడుతుంది. ఇక మూడవది పీర్ రివ్యూ జర్నల్. వీటిలో ప్రచురించే ఆర్టికల్స్కు అంతగా గుర్తింపు ఉండదు.
ఆర్టికల్స్ ఎలా రాయాలి?
ఏ ఆర్టికల్కైనా రివ్యూ అఫ్ లిటరేచర్ గుండెకాయ వంటిది. దానినుంచే ఆబ్జెక్టివ్ మరియు హైపోథెసిస్లను గుర్తించి టైటిల్ను రూపొందించుకోవాలి. సరైన మెథడాలజీని, స్టాటిస్టికల్ టూల్స్ను ఎంపిక చేసుకోవాలి. సోషల్సైన్స్ పరిశోధకులు ఇప్పటికీ ఎస్.పి.ఎస్.ఎస్ వంటి పాత ప్యాకేజీల ద్వారా టూల్స్ వాడుతున్నారు. యూజీసీ కేర్లో పబ్లిష్ అవ్వాలంటే నూతన మోడల్స్ను ఉపయోగించాలి. సెకండరీ డేటా అయితే, పనెల్ ఎస్టిమేషన్ మోడల్, లాగిట్ మోడల్, ఇతర ఎకనోమెట్రిక్ మోడల్స్ జీఎంఎం మోడల్ వంటివి వాడాలి. ప్రైమరీ డేటా అయితే అమోస్, ఆర్ సాఫ్ట్వేర్, మల్టీ క్రైటీరియా డెసిషన్ మోడల్స్ వంటి వాటిని తీసుకోవాలి. వచ్చిన ఫలితాలను ‘రివ్యూ అఫ్ లిటరేచర్’లో ఉన్న నిర్ధారణలతో పోల్చి చెప్పాలి. తన పరిశోధన ఏ విధంగా ఉపయోగపడుతుందో కూడా రాయాలి. రిఫరెన్స్లను ఏపీఏ లేదా ఎంఎల్ఏ ైస్టెల్లో, అల్ఫాబెటికల్ ఆర్డర్లో అమర్చుకోవాలి. ముఖ్యంగా ప్లేగరిజం ఐదు శాతానికి మించకూడదు.
(-డా. రామకృష్ణ బండారు , 80191 69658 అసిస్టెంట్ ప్రొఫెసర్, కిట్ యూనివర్సిటీ, ఒడిశా)