భారతదేశంలో బడుగు వర్గాలు, మహిళల అభ్యున్నతికి మహాత్మా జ్యోతిరావ్ఫూలే జీవితాంతం కృషి చేశారు. నేడు ఆయన జయంతి. దేశంలో బీసీల జనాభా ఎంత ఉందో తెలుసుకోవటానికి వీలుగా బీసీ జనగణన చేపట్టాలనే డిమాండ్ ఎంతోకాలం నుంచి ఉన్నా.. కేంద్రంలోని కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు దీనిపై తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నాయి. బీసీనని చెప్పుకొని అధికారంలోకి వచ్చిన మోదీ పాలనలో కూడా ఈ డిమాండ్ నెరవేరటం లేదు. బీసీలు ఉద్యమించి తమ హక్కులను సాధించుకోవాలి.
స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని, సామాజిక-ఆర్థిక-రాజకీయ న్యాయాన్ని దేశ ప్రజలందరికీ అందిస్తామనే ఆశయాన్ని రాజ్యాంగం ప్రకటించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటుతున్నా జనాభాలో సగభాగమైన బీసీల పరిస్థితిలో ఏ మార్పు లేదు. ఓట్ల కోసం జాతీయ రాజకీయ పార్టీలు బీసీల ఉద్ధరణకు ప్రాధాన్యమిస్తామని అంటూనే మోసం చేస్తున్నాయి.
జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ప్రకారం.. 2006లో ఓబీసీ జాబితాలో 5,013 కులాలున్నాయి. వీటిలో యాదవ, కుర్మి, ఎజవ (కేరళ), సైన్ (Sain), దేవర్, మౌర్య, కుశవ తదితర కొన్ని కులాలు తప్ప మిగిలినవి విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో వెనుకబడి వున్నాయి. ఈ దేశంలో అన్నింటికీ లెక్కలుంటాయి. చెట్టు, పుట్ట, రాయి రప్ప, పశుపక్ష్యాదులు, జంతువులకు సంబంధించిన గణాంకాలు కూడా ఉన్నాయి. అరుదైన పక్షి, జంతు జాతులను రక్షించడం కోసం ప్రభుత్వాలు వాటి లెక్కలు తీస్తున్నాయి. కానీ, దేశ జనాభాలో సగం కన్నా ఎక్కువ ఉన్న బీసీల జనాభా ఎంతో తెలియదు. ఈ లెక్కలు తీయడానికి సుదీర్ఘకాలం పాలించిన, పాలిస్తున్న కాంగ్రెస్, బీజేపీ ముందుకు రాకపోవటం దారుణం.
బ్రిటీష్వారు జన గణనతోపాటు కుల గణన కూడా చేశారు. కానీ, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మాత్రం జన గణనలో కులాల వారీ లెక్కలు జరుపటం లేదు. దేశంలో బీసీల జనాభా ఎంత ఉన్నదని తెలుసుకోవటానికి నేటికీ.. 1931లో బ్రిటీష్ వారి హయాంలో జరిగిన జనాభా లెక్కలే ప్రామాణికం. ఈ అంశంపై కేంద్రంలోని ప్రభుత్వాలు ఎంత వివక్ష చూపుతున్నాయో దీనిద్వారా అర్థం చేసుకోవచ్చు.
1951 నుంచి దేశంలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి కుల ఆధారిత గణన జరుగుతున్నది. కానీ బీసీ కుల గణన మాత్రం చేయటం లేదు. బీసీల విషయంలో ఢిల్లీ పాలకులు సాంకేతిక కారణాలు చూపుతూ దాటవేత ధోరణి అవలంబిస్తున్నారు. రాజ్యాంగంలోని 340 ప్రకరణం.. రాష్ట్రపతి ద్వారా బీసీల అభివృద్ధి కోసం ఒక కమిషన్ వేయాలని సూచించింది. దానిలో భాగంగానే నాటి ప్రధాని నెహ్రూ.. కాకా కాలేల్కర్ అధ్యక్షతన తొలి జాతీయ బీసీ కమిషన్ను 1955లో ఏర్పాటు చేశారు. బీసీలకు విద్య, ఉద్యోగ రంగాల్లో అవకాశాలు కల్పించాలని, బీసీ జనగణన చేయాలని ఈ కమిషన్
సిఫారసులు చేసింది. వీటి అమలుకు కేంద్రప్రభుత్వాలు ఎటువంటి ప్రయ తం చేయలేదు. 1979లో మురార్జీ దేశాయ్ నాయకత్వంలోని జనతా ప్రభుత్వం బి.పి.మండల్ అధ్యక్షతన రెండ వ ‘జాతీయ బీసీ కమిషన్’ను ఏర్పాటు చేసింది.
మండల్ కమిషన్గా ప్రసిద్ధినొందిన ఈ కమిషన్.. భారతదేశంలో బీసీల జనాభా 52 శాతం అని తేల్చింది. ఈ కమిషన్ సిఫారసుల నేపథ్యంలో, ప్రస్తుతం బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు నేడు లభిస్తున్నాయి. మండల్ కమిషన్ కూడా బీసీ జనగణన చేయాలని సూచించింది.
మన్మోహన్సింగ్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2011లో దేశంలో ‘సామాజిక, ఆర్థిక కులగణన’ (Socio Economic and Caste Census – SECC) జరుపాలని నిర్ణయించింది. ఈ మేరకు 2011 నుంచి 2015 వరకు SECC నిర్వహించారు. 2015లో మోదీ ప్రభుత్వానికి సర్వే రిపోర్టును సమర్పించారు. కానీ, తనను తాను బీసీగా ప్రచారం చేసుకొనే నరేంద్రమోదీ SECCని బహిర్గతం చేయకుండా రిపోర్టును మూలకు పడేశారు. బీసీల రిజర్వేషన్ల అంశం తమ రాష్ట్రంలో చర్చకు వచ్చిన నేపథ్యంలో బీసీ కులగణన చేసే విధంగా కేంద్రానికి మార్గదర్శకాలు ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే.. దేశంలో బీసీ జనగణన చేయడం సాంకేతికంగా సాధ్యం కాదని మోదీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయటంతో బీసీ జనగణన మళ్లీ మొదటికి వచ్చింది.
మోదీ బీసీ కులానికి చెందిన వారని 2014 లోక్సభ ఎన్నికల సమయంలో బీజేపీ విస్తృత ప్రచారం చేసింది. దీంతో దేశవ్యాప్తంగా బీసీలు పెద్దసంఖ్యలో బీజేపీకి మద్దతుగా నిలిచారు. జనగణనతోపాటు తమ డిమాండ్లన్నీ పరిష్కారమవుతాయని ఆశించారు. కానీ బీసీల ఆశలు అడియాసలు అయ్యాయి. 2017లో మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రోహిణి కమిషన్ కూడా బీసీ జనగణన చేపట్టాలని సూచించింది. తెలంగాణ, ఏపీ, బీహార్, ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ర్టాల అసెంబ్లీలు ఏకగ్రీవ తీర్మానాలు చేసి బీసీ గణన జరుపాలని కేంద్రాన్ని కోరాయి.
బీసీల అభివృద్ధి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. కేంద్రం బీసీ గణన చేయాలని, బీసీల రిజర్వేషన్లు పెంచాలని, రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు.
టీఆర్ఎస్, ఎస్పీ, బీఎస్పీ, ఆర్జేడీ, జేడీయూ, వైసీపీ, డీఎంకే తదితర పార్టీలు, పలు రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ జనగణన చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అయినా మోదీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నది. మోదీ బీసీల పుత్రుడు కాదని, కార్పొరేట్ల దత్తపుత్రుడని బీసీలు గుర్తించాలి. బీజేపీ విషకౌగిలి నుంచి బీసీలు బయటపడి సంఘటిత పోరాటం ద్వారా తమ హక్కులను సాధించుకోవాలి.
(నేడు జ్యోతిరావ్ఫూలే జయంతి )
-డి.రాజారాం యాదవ్ , 97051 31472