సనాతన ధర్మం – హిందూ మతం – హిందుత్వ భావజాలం ఈ మూడు పదాల భావన అర్థం చేసుకుంటే, అవి ఏ పునాదుల మీద నిర్మింపబడ్డాయో పరిశీలిస్తే భారతీయలు తమ మూలాలను సరిగ్గా అవగాహన చేసుకోగలుగుతారు. ఇవన్నీ ఒకటే అన్న గందరగోళం నుంచి బయటపడతారు.
సనాతన ధర్మం వేదాలలో పొందుపరచబడినది. అది మానవులు తమ వ్యక్తిగత, కుటుంబ, సామాజిక, ఆర్థిక, రాజకీయ ధర్మాలను సరిగ్గా నిర్వర్తించటానికి నిర్దేశించబడినది. మొట్టమొదటగా ‘సనాతన’ అన్న పదానికి అర్థం తెలుసుకోవాలి. ‘శాశ్వతస్తు ద్రువో నిత్య సదా తన సనాతనాః’ అని అది నిర్వచించబడినది. ఎప్పుడూ ఉండునది, స్థిరమై ఉండునది (శాశ్వతస్త ద్రువో), ఎల్లప్పుడూ నియమింపబడినది (నిత్య), ఎల్లప్పుడునూ కలిగి ఉండునది, నాశనము లేనిది (సదా తన సనాతనాః) అని దాని అర్థం. అంటే అది ‘సదాభవః’- ఎప్పుడూ విశ్వ జనీనంగా అలరారుతుంది అని అర్థం. దీనిని ‘ధర్మం’ అన్నారు కానీ మతం అనలేదు. ధర్మం అందరికీ చెందినది. అది మానవులందరినీ వారి జీవితంలో సన్మార్గంలో నడిపేది. మతం లాగా ఒ క వ్యక్తి వల్ల సృష్టింపబడి, ఒక ప్రాంతానికి చెందినది కాదు.
ప్రపంచంలో మానవులందరూ పా టించవలసినది. ఆ ధర్మం మహాభారత యుద్ధం ముగిసే దాకా ప్రపంచమంతటా పాటించబడినది. అందులో మతం లేదు. ఒక్క దేవుడిని పూజించమని లేదు. వేదాలతో ఆధ్యాత్మికత, తత్త్వమార్గం, తార్కికత ఉన్నాయే గానీ ఏ రకమైన ఒత్తిడి కలిగించే నిబంధనలు లేవు. మానవుడు తన భౌతిక, మానసిక, కళాత్మక, శాస్త్రీయ, తాత్వి క, ఆధ్యాత్మిక మార్గాల్లో తన జీవితాన్ని విజయవంతంగా ఎలా గడపవచ్చో చాలా స్పష్టంగా పొందుపరచబడింది. ధర్మం అనేది చాలా చక్కగా నిర్వచించబడింది. దాన్ని పాటించి జీవితాన్ని ఎలా ఆనందమయం చేసుకోవాలో మార్గం చూపబడింది. మానవుల మధ్య అంతరాలు, కులాలు లేవు. వారి వారి భావనలు, చేష్టలు, ప్రవర్తన, వృత్తి మొదలైన అంశాలు పరిగణనలోకి తీసుకుని వర్ణం ఎలా నిర్ణయించాలో ఉంది.
వర్ణం అంటే గుణం. వ్యక్తి గుణమే అతని కర్మను శాసిస్తుంది. అదే అతని వృత్తిని నిర్ణయిస్తుంది. కులాల ప్రసక్తి లేదు కాబట్టి కొందరు (శూద్రులు, స్త్రీలు) వేదం చదవకూడదని ఎక్కడా చెప్పలేదు. వ్యక్తిత్వ వికాసానికి అందరూ వేదాధ్యయనం చేయవలసిందే. 6 లేక 8 సంవత్సరాల వయస్సు నుంచి కనీసం 8 ఏండ్లు చదువుకుని, తర్వాత వారి ఇష్టానుసారం వృత్తులు ఎంచుకుని, వయస్సు వచ్చాక గృహస్థాశ్రమం స్వీకరించి సామాజిక స్పృహతో జీవనం సాగించాలని సనాతన ధర్మం చెప్పింది.
ఇక హిందూ మతం అన్నది ఎక్కడ నుంచి వచ్చిందన్న విషయంలో చాలా మందికి స్పష్టత లేదు. బ్రిటీషర్లు భారతదేశాన్ని ఆక్రమించి పాలించినపుడు అధిక సంఖ్యలో ఉన్న ఇతర భారతీయులని ఎట్లా పిలవాలో తెలియలేదు. అదీకాక అప్పటిదాకా అందరూ సనాతన ధర్మం నిర్దేశించిన శాంతి మార్గంలోనే బతుకుతున్నారు. వీరికి ఒక మతాన్ని అంటగట్టితేనే వీరిని, ముస్లిములని పేరు చేయగలం అన్న కుటిలత్వంతో అధిక సంఖ్యాకులను హిందువులుగా పిలిచారు. వేదాలు, ఇతర ముఖ్యమైన గ్రంథాలన్నింటినీ మత గ్రంథాలుగా ముద్ర వేశారు. ఈ చర్య వలన భారతీయులకు, ప్రపంచానికి చాలా నష్టం జరిగింది. మొదటి నుంచి మహాభారత యుద్ధ కాలం దాకా సనాతన ధర్మాన్ని ఆచరించిన ప్రపంచ దేశాలన్నీ వేదాలు చదవకుండా ఆగిపోయింది. విశ్వజనీన ధర్మం చెప్పిన వేదాలను హిందూ మత గ్రంథాలుగా నిర్వచించటంతో ఆ ధర్మాలన్నీ మరుగున పడ్డా యి. చరిత్ర చెప్పిన రామాయణ, భారతాలను ఊహాత్మక పురాణాలు చేశారు. శాస్త్రీయ గ్రంథాలైన ఉపనిషత్తులను మత గ్రంథాలన్నారు. సంకుచిత మనస్తత్వం పెంచే మతాలు పుట్టుకొచ్చాయి.
ధర్మం పాటించటం అంటే ఎవరికీ హాని చేయకుండా బతకడం. ఎవరైనా హాని కారకులైతే వారిని మార్చే ప్రయత్నాలు చేయడం, మారకపోతే కఠినంగా శిక్షించడం. సనాతన ధర్మంలో అధర్మానికి, అవినీతికి, అన్యాయానికి, ఆశ్రిత పక్షపాతానికి చోటు లేదు. మనుషులందరూ ఒక్కటే! సమానమే! అందరికీ సమాన గౌరవం, సమాన అవకాశాలతో శాంతంగా, ఆనందంగా బతికే హక్కు ఉంది. అలాగే ప్రతి మనిషికి తన పట్ల, తన కుటుంబం పట్ల, సమాజం పట్ల నిర్వహించాల్సిన బాధ్యతలున్నాయి. ఇతరులకు హాని చేయకుండా ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా, ఆనందంగా బతకాలన్నదే వేద వాక్కు! అదే సనాతన ధర్మం!
నిజానికి వేదాలు, రామాయణం, భాగవతం, భారతం, ఉపనిషత్తులలో ఎక్కడా ‘హిందూ’ అన్న పదం గానీ, మతం గానీ కనిపించవు. సృష్టికర్త (ధర్మం పాటిస్తే ఈయన ఉన్నాడని నమ్మకపోయినా ఫరవాలేదు) నియమించిన శక్తులను దేవతలుగా పూజించడం మాత్రమే కనిపిస్తుంది. ఏ శక్తినీ నమ్మని చార్వాకులు కూడా సనాతన ధర్ములే! బ్రిటీష్ పాలకుల కుటిల విధానాలే భారతదేశ విచ్ఛిన్నతకు కారణమయ్యాయి.
ఇక హిందుత్వ భావజాలం విషయానికి వస్తే హిందుత్వ భావజాలం కలిగిన మనుషులు, వారి రాజకీయ పార్టీలు తమ ఆదర్శ గ్రంథాలు చెప్పిన సూక్తులేవీ పాటించరు. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు, తమ పునాది అయిన సనాతన ధర్మం గురించి లేశమైనా అవగాహన లేనివారు. అందుకే వీరి భావాలు, ప్రవర్తన, అశాంతి రేపే వారి సంభాషణలు హిందువులమని నమ్మేవారికి కూడా వెగటు, జుగుప్స కలిగిస్తాయి. వీరు సనాతన ధర్మం తెలిసినవారైతే ఇతరులకు హాని చేసే వ్యక్తిని శిక్షించాలి. ఒక సమూహాన్ని ద్వేషించడం తప్పు అని అర్థం చేసుకునేవారు. మహాభారత కాలంలో కూడా వివిధ శక్తులను నమ్మి పూజంచిన వారు వారి తాత్విక, ఆధ్యాత్మిక భావాలను, భక్తిని గోప్యంగా ఉంచుకున్నారే కానీ బహిర్గతం చేయలేదు. అవి చాలా వ్యక్తిగతమైనవని వారు నమ్మా రు. ఆనాడు గుళ్ళు లేవు, బహిరంగ భక్తి సమావేశాలు, పూజలు, పారాయణలు లేవు. గుంపులో మోక్షం రాదని తెలిసిన విజ్ఞులు గనుక తమ ధ్యానం, తపస్సును గోప్యంగానే ఉంచేవారు.
హిందూ మతం నుంచి విడిపోయి, హిందుత్వ భావజాలాన్ని ఒంట పట్టించుకుని హింసాత్మకంగా ప్రవర్తించేవారు ఇప్పుడు మన సమాజంలో ఎక్కువయ్యారు. నిజమైన భక్తి ఉండి, ప్రశాంత జీవనం గడపాలని ఆశించే హిందువులకు కూడా వీరి సిద్ధాంతాలు అయోమయాన్ని సృష్టిస్తున్నా యి. ఒ క్క క్షణం కళ్లు మూసుకుని ఆలోచించండి. ఆఫ్ఘనిస్థాన్లోని తాలిబన్లకు, భారతదేశంలో ప్రస్తు తం పరిపాలన చేస్తున్న హిందుత్వ నాయకులకు ఏమైనా తేడాలున్నాయా? మత మౌఢ్యం, వేరే భావాలు ఉన్న వారి స్వాతంత్య్ర హరణం, తాము నిర్దేశించిన నిబంధనలు పాటించని వారిపట్ల అసహనం, హింసాత్మక ధోరణి, అనుచిత ప్రవర్తన, ఆశ్రిత పక్షపాతం కలిగిన వీరు బలవంతపు రాజకీయ పార్టీ మార్పిళ్లకు పాల్పడుతున్నారు. పేరుకి ప్రజాస్వామ్యం కాబట్టి తెర వెనుక నాటకాలు ఆడుతున్నారు.
దేశమంతా తమ చెప్పు చేతల్లోఉండాలన్న నియంతృత్వ ధోరణి, విపక్షాలను సంప్రదించకుండా ఇష్టారాజ్యంగా చట్టాలు చేయటం, కాకులను కొట్టి గద్దలకు పెట్టినట్టు సామాన్య ప్రజలను దోచుకుని, ప్రభుత్వ సంస్థలను అమ్మి తన భాష, తన రాష్ట్రం వారిని బిలియనీర్లను చేయటం – ఇవన్నీ తాలిబన్ సిద్ధాంతాలు కావా?
బీజేపీ ఈ దేశాన్ని బాగు చేస్తుందన్న నమ్మకం ఎవరికైనా మిగిలిందా? మరి మన జీవితాలను బాగు చేసుకోవాలంటే, న్యాయాన్ని పొందాలంటే ఈ మత మౌఢ్య హిందుత్వ తాలిబన్లని తరిమికొట్టాలా వద్దా? అందరూ ఆలోచించండి. మన ప్రగతి, ప్రశాంత జీవనం కోసం ఎన్నికలొచ్చినపుడు ఓటు హక్కును జాగ్రత్తగా ఉపయోగించుకోండి. మన భారతదేశాన్ని మరో ఆఫ్ఘనిస్థాన్ కానివ్వకండి.
కనకదుర్గ దంటు
89772 43484