కృత్రిమ మేధ వల్ల మానవాళికి ముప్పు తప్పదని విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ తరచుగా హెచ్చరించేవారు. ఆ మాటేమో గానీ, సినిమా హీరోయిన్లకు, ప్రముఖులకు మాత్రం (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) ఏఐ వల్ల సమస్యలు ఎదురవుతున్నాయి. హీరోయిన్ రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో వైరల్ కావడం తెలిసిందే. ఆ వీడియోలో రష్మిక ఎక్స్పోజింగ్ డ్రెస్ వేసుకొని తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. మామూలు కంటితో అది రష్మిక కాదని గుర్తుపట్టడం కొంచెం కష్టమే. ఏఐ వల్ల ఏర్పడిన తంటా ఇది. ఈ ఉదంతంతో సినిమా రంగం ఉలిక్కిపడింది. రష్మిక తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం, అమితాబ్ బచ్చన్ ఆమెకు సంఘీభావం తెలుపడం సెన్సేషన్ అయింది. అమితాబ్తో పాటు మరికొందరు సినీ నటులు డీప్ ఫేక్ తయారీదారులపై న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని కూడా ఆమెకు సూచించారు. కాగా ఈ ఘటనను కేంద్ర సమాచార సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఖండించడం గమనార్హం.
ఇలాంటి ఫేక్ వీడియోలు తయారుకావడం ఇదే మొదటిసారి కాదు. నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా చుట్టొచ్చినట్టుగా అవి ఫేక్ వీడియోలు అనే సంగతి బైటపడేలోగా కోట్లాది మందికి చేరుతాయి. ఇలాంటివి సినీ ప్రముఖులకే పరిమితం కాదు, రాజకీయ నాయకులకు సంబంధించిన ఫేక్ వీడియోలు కూడా విడుదల చేయడం గురించి మనం వింటూనే ఉన్నాం. ఇందులో కాపీరైట్ సమస్య కూడా ఇమిడి ఉన్నది. డీప్ ఫేక్ చేసే మూల వీడియో యజమానుల హక్కుల మాటేమిటనేది ఇక్కడ ప్రశ్న. తన ఆకార వికారాలను కాపీ చేసి ఫేక్ వీడియోలు తయారుచేస్తున్నారంటూ మేధో హక్కుల పరిరక్షణ చట్టం కింద హిందీ నటుడు అనిల్ కపూర్ ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు. ఆయన ైస్టెల్ను అనుమతి లేకుండా ఏఐ ద్వారా ఎలాంటి వాణిజ్య అవసరాలకు వినియోగించరాదని 16 కంపెనీలను ఆదేశిస్తూ ఏకసభ్య ధర్మాసనం ఆదేశించింది. దీన్ని మన దేశంలో ఏఐపై మొదటి న్యాయ విజయంగా అభివర్ణిస్తున్నారు. తన గొంతును మిమిక్రీ చేసి వాణిజ్య అవసరాలకు వినియోగిస్తుండటంపై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా కోర్టుకు వెళ్లడం తెలిసిందే.
ప్రస్తుతం ఏఐ అంశంపై హాలీవుడ్ సినీరంగం సమ్మె చేస్తుండటం ప్రపంచ స్థాయిలో సమస్య తీవ్రతను తెలియజేస్తున్నది. ఏఐ ద్వారా ప్రముఖ నటుల ‘వర్చువల్ అవతార్’లను తయారుజేసే ప్రాజెక్టులు జోరందుకోవడమే ఇందుకు కారణం. వాటిని ఉపయోగించి సినిమాలు తీస్తే ఇక తమ గతి ఏం కావాలని వారు ప్రశ్నిస్తున్నారు. అంటే ఓ వైపు రష్మిక వంటివారు ఏఐ వీడియోలతో తమ పరువు బజారున పడుతున్నదని కలత చెందుతుంటే మరోవైపు నటుల ఇమేజ్ను కాపీ చేసి యాడ్స్ తదితర అవసరాలకు వాడటం జరుగుతున్నదన్న మాట. రెండూ నాణేనికి చెరోవైపు అని చెప్పాల్సి ఉంటుంది. విడివిడిగా ఎవరికి వారు తమకు అన్యాయం జరిగిందని కోర్టులకు వెళ్లే అవసరం లేకుండా మంత్రి కేటీఆర్ సూచించినట్టు దీనిపై సమగ్రమైన చట్టం తీసుకువచ్చి పకడ్బందీగా అమలుచేస్తే బాగుంటుంది.